Milk | పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయని తరతరాలుగా చెబుతూ వస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పాలు తాగడం వల్ల ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థోపెడిక్ నిపుణులు ఈ అపోహలను ఖండిస్తూ, మితంగా పాలు తీసుకోవడం వల్ల ఎముకలకు ఎలాంటి హాని ఉండదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన ఎముకల కోసం పాలు మాత్రమే కాకుండా సమతుల ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకర జీవనశైలి కూడా అంతే ముఖ్యమని సూచిస్తున్నారు. పాలు లేదా మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఆమ్లత్వం పెరిగి, దానిని సమతుల్యం చేయడానికి ఎముకల నుంచి కాల్షియం బయటకు వస్తుందని ఒకప్పుడు యాసిడ్-యాష్ సిద్ధాంతం పేరుతో ప్రచారం జరిగింది. కానీ ఇటీవలి శాస్త్రీయ పరిశోధనలు ఈ సిద్ధాంతానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవని తేల్చాయి. సరిపడా కాల్షియంతోపాటు ప్రోటీన్ కూడా తీసుకుంటే ఎముకలు మరింత బలపడతాయని, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఎముకలు విరిగే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మితంగా లేదా కొంచెం ఎక్కువ పరిమాణంలో పాలు తాగడం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందనే వాదనకు ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న పరిశోధనల ప్రకారం పాలు, పాల ఉత్పత్తులను మితంగా తీసుకోవడం ఎముకల ఖనిజ సాంద్రతపై ప్రతికూల ప్రభావం చూపదని, కొన్ని సందర్భాల్లో సానుకూల ప్రభావం కూడా ఉంటుందని వెల్లడైంది. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల ఖనిజ సాంద్రత తగ్గి అవి బలహీనపడే వ్యాధి. ఇది ఒక్క ఆహారం వల్ల మాత్రమే రాదు. వయస్సు పెరగడం, మహిళల్లో మెనోపాజ్ కారణంగా హార్మోన్ల మార్పులు, విటమిన్ డి లోపం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, అధిక మద్యపానం, పోషకాహార లోపం వంటి అనేక కారణాలు కలిసి ఈ సమస్యకు దారితీస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.
పాలు కాల్షియం, ప్రోటీన్, ఫాస్పరస్, విటమిన్ డి (ఫోర్టిఫై చేసిన పాలలో) వంటి ఎముకల నిర్మాణానికి అవసరమైన కీలక పోషకాలకు మంచి మూలం. చిన్నతనం నుంచి యుక్తవయస్సు, పెద్దవయస్సు వరకు తగిన మోతాదులో కాల్షియం తీసుకోవడం వల్ల ఎముకలు గరిష్ఠ బలాన్ని సంతరించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల పాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే పాలను అధికంగా తాగడం కూడా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు మాత్రమే ఎక్కువగా తీసుకుని ఇతర ఆహారాలను తగ్గిస్తే శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు అందవు. దీని వల్ల పోషకాహార అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కొందరిలో అజీర్ణం, అధిక కేలరీల వినియోగం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. కాబట్టి పాలను సమతుల ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలి.
లాక్టోజ్ అసహనం (లాక్టోజ్ ఇంటోలరెన్స్) ఉన్నవారు పాలను జీర్ణించుకోలేరు. అలాంటి వారు కాల్షియం కోసం ఫోర్టిఫై చేసిన మొక్కల ఆధారిత పాలు, రాగి, టోఫూ, ఆకుకూరలు వంటి ప్రత్యామ్నాయ ఆహారాలను తీసుకోవచ్చు. వీటి ద్వారా కూడా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాలు ఒక్కటే సరిపోవని, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి పొందడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం వంటి ఆరోగ్యకర అలవాట్లు పాటించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మితంగా పాలు తాగడం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం పెరగదని, సరైన జీవనశైలిలో భాగంగా పాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.