న్యూఢిల్లీ : నిద్రలేమితో ఏకాగ్రత కొరవడటం, మతిమరుపు సమస్యలు, కుంగుబాటుతో పాటు దీర్ఘకాలంలో పలు అనారోగ్యాలు చుట్టుముడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రించాలని పలు అధ్యయనాలు వెల్లడిస్తుండగా పలువురు కేవలం ఆరు గంటలే నిద్రిస్తున్నారు. నిద్రలేమితో పలు అనారోగ్యాలు వెంటాడతాయని, తగినంత నిద్రతో శరీరానికి విశ్రాంతి లభించి మరుసటి రోజు హుషారుగా పనిచేసుకునేందుకు అవసరమైన శక్తి లభిస్తుందని నిపుణుల సూచిస్తున్నారు.
ఆరు గంటల కంటే తక్కువ నిద్రతో బరువు పెరగడం ఫలితంగా మధుమేహం, ఒబెసిటీ బారినపడే ప్రమాదం ఉంది. నిద్రలేమితో మతిమరుపు పెరుగుతుందని, జ్ఞాపక శక్తిని కోల్పోతామని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ పరిస్ధితి దీర్ఘకాలంలో అల్జీమర్స్, డిమెన్షియా ముప్పు పెంచుతుందని చెబుతున్నారు. నిద్రలేమితో బాధపడే వారిలో ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తిని శరీరం కోల్పోవడంతో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు.
తగనింత నిద్ర లేకుంటే జీవ గడియారంలో అవాంతరాలతో కలోన్, ఒవరీ, బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు పొంచిఉందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఆరు గంటల కంటే తక్కువ నిద్రతో రక్తపోటు, అధిక కొవ్వు వంటి జీవన శైలి వ్యాధులతో గుండె జబ్బు, స్ట్రోక్ ముప్పు పెరుగుతందని అధ్యయనాలు వెల్లడించాయి. తగినంత నిద్రతో రక్త నాళాలు కోలుకుని కార్డియో వాస్క్యులర్ వ్యవస్ధ పుంజుకుని కీలక అవయవాలు మళ్లీ పనిచేసేందుకు సిద్ధమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.