Monsoon | న్యూఢిల్లీ, జూలై 13: వర్షాకాలంలో ప్రజలను పట్టిపీడించడానికి పెద్దయెత్తున వ్యాధులు కూడా పొంచి ఉన్నాయి ..తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ కాలంలో ప్రజలకు అతిపెద్ద ముప్పుగా మారేది డెంగ్యూ జ్వరం. దోమల కారణంగా వచ్బే ఈ జబ్బు బారిన పడకుండా అందరూ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజధాని ఢిల్లీలో దవాఖానలకు డెంగ్యూ జ్వర బాధితుల రాక ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఒక రోగికి పరీక్షలు నిర్వహించగా 10 వేల కంటే తక్కువ ప్లేట్లెట్లు, హిమోగ్లోబిన్ సాంద్రత 20 జి/డీఎల్ ఉన్నట్టు తెలిసింది. ఇది ప్రమాదకర స్థాయి అని.. అందరికీ వ్యాధి లక్షణాల తీవ్రత కన్పించకపోవచ్చునని ఢిల్లీలోని మేక్స్ హాస్పిటల్కు చెందిన ఒక డాక్టర్ తెలిపారు.
అయితే ఈ వ్యాధిని ఎలాంటి లక్షణాలను బట్టి నిర్ధారించాలి. అతి తీవ్ర జ్వరమా, తీవ్ర హిమోగ్లోబిన్ లెవెలా, ప్లేట్లెట్ల కౌంటా.. ఏ అంశాన్ని పాతిపాదికగా తీసుకోవాలన్నది అందరిలో తలెత్తే ప్రశ్న. సమయానికి వ్యాధి తీవ్రతను గుర్తించకపోతే రక్తపోటు స్థాయి పడిపోవడమే కాక, అవయవాలు దెబ్బతిని మరణం సంభవించే ప్రమాదం కూడా ఉంది. ఎవరైనా రోగి హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి, ప్లేట్లెట్ల సంఖ్య సాధారణ స్థాయిలో ఉన్నంత మాత్రాన అతనికి డెంగ్యూ లేదని భావించరాదని, అది జబ్బును గుర్తించకుండా తప్పుదోవ పట్టిస్తుందని, కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయి పెరిగినట్టు గుర్తించిన వెంటనే రోగిని దవాఖానకు తీసుకుని వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
డెంగ్యూ సోకిన వారిలో తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, ఒంటిపై దద్దుర్లు, కడుపులో నొప్పి, తక్కువ రక్తపోటు, తల తిరగడం, చాలా రోజులు తగ్గకుండా జ్వరంతో బాధపడటం వంటి లక్షణాలు కన్పిస్తాయి. దోమల కారణంగా వ్యాపించే ఈ వ్యాధి రెండు నుంచి 14 రోజుల పాటు ఉంటుంది. అయితే వ్యాధి లక్షణాలు సగటున నాలుగు నుంచి ఏడు రోజులకు బయటపడతాయి. ముందుగానే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. లేకపోతే రక్తకణాల సంఖ్య దిగజారి కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలొస్తాయి.
మహిళలు : 11-13 జి/డీఎల్
పురుషులు : 13-16 జి/డీఎల్
పిల్లలు : 13-16 జి/డీఎల్
హిమోగ్లోబిన్ స్థాయి 10 శాతం కన్నా అధికమైనా లేదా 18 జి/డీఎల్ స్థాయి దాటినా అత్యవసరంగా వైద్య చికిత్స పొందాలి.