లండన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుంటే వైరస్ వ్యాప్తి కట్టడిలో మరికొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇక కొవిడ్-19 రోగులపై జరిపిన తాజా అధ్యయనం వార్నింగ్ సిగ్నల్స్ పంపింది. వైరస్ సోకిన కొవిడ్-19 రోగుల్లో మధుమేహం, గుండె జబ్బుల ముప్పు అధికంగా ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇన్ఫెక్షన్కు గురైన తొలి మూడు నెలల్లో ఈ ముప్పు అధికమని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకిన 23 వారాల తర్వాత మధుమేహ స్ధాయిలు తగ్గుముఖం పడుతుండగా, ఏడు వారాల్లో కార్డియోవాస్క్యులర్ వ్యాధుల ముప్పు తగ్గుతున్నదని వెల్లడైంది.
వైరస్ సోకిన వారిలో దీర్ఘకాల ప్రభావాలు ఉంటాయని ఈ అధ్యయనం తేల్చింది. కొవిడ్-19 వచ్చిన 12 వారాల్లో మధుమేహ స్ధాయిలు పెరిగే అవకాశం ఉందని, ఆపై క్రమంగా మధుమేహం అదుపులోకి వస్తుందని పేర్కొంది. కొవిడ్-19తో బాధపడేవారిలో ముందుగా మధుమేహం, గుండె జబ్బులు లేకుంటే వారిలో ఈ పరిస్థితి దీర్ఘకాలంలో పెరిగే అవకాశాలు కనిపించలేదని తెలిపింది. కొవిడ్-19 బారినపడిన వారిలో తొలి మూడు నెలలు జాగ్రత్తగా వారిని పరిశీలించాలని బీహెచ్ఎఫ్ చీఫ్ ఆఫ్ కార్డియాలజీ ప్రొఫెసర్ అజయ్ షా చెప్పారు.
వివిధ గ్రూపులకు చెందిన 4,28,000 మంది కొవిడ్-19 రోగుల మెడికల్ రికార్డులను పరిశోధకులు విశ్లేషించిన మీదట ఈ వివరాలు వెల్లడించారు. వైరస్ కారణంగా మొత్తంమీద హృద్రోగాలు ఆరు రెట్లు పెరిగాయి. ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్స్, అస్తవ్యస్త హార్ట్బీట్ కారణంగా హృద్రోగ ముప్పు పెరిగినట్టు గుర్తించారు. ఇన్ఫెక్షన్ సోకిన ఐదు వారాల తర్వాత ఈ ముప్పు తగ్గి 12 వారాల నుంచి ఏడాది లోపు ఏడాదికి సాధారణ స్ధితికి చేరుకున్నట్టు వెల్లడైంది. మధుమేహం, గుండె జబ్బుల ముప్పు తగ్గించేందుకు కొవిడ్-19 సోకిన రోగులపై కనీసం మూడు నెలల వరకూ ప్రత్యేక శ్రద్ధతో వైద్య పరీక్షలు, చికిత్స కొనసాగించడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.