Teeth brushing | ఉదయం నిద్ర లేవగానే మనం పళ్లు తోముకుంటాం. రోజంతా దంతాలతోపాటు నోరు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడుతుంది. బ్రషింగ్ చేయడం వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం అందుతుంది. దంతాలను సక్రమంగా క్లీన్ చేసుకోని వారిలో చిగుళ్ల సమస్యలతో పాటు గుండె జబ్బులు, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కనిపిస్తుంటాయి. అందుకే నోటి ఆరోగ్యమే మన ఆరోగ్యమని వైద్యులు చెప్తుంటారు.
పళ్లు తోముకోవడంలో మనం సాధారణంగా బ్రష్పై పేస్ట్ పెట్టుకుని దంతధావనం చేసి ఆ తర్వాత నాలుక శుభ్రపరుచుకుంటాం. దాంతో పళ్లు తోముకోవడం పూర్తయినట్లుగా భావిస్తుంటాం. పళ్లను శుభ్రంగా తోముకోవడం వలన నోటిలోని బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములను కడుపులోకి పోకుండా అడ్డుకోవచ్చు. పళ్లు తోముకోవడంపై మనలో చాలా మంది ఎన్నో అపోహలు ఉన్నాయి. వీటిని నివృత్తి చేసుకోవడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
హార్డ్ బ్రష్ వాడాలా..?
దంతాలను బాగా శుభ్రం చేసుకోవడానికి హార్డ్ బ్రష్ ముఖ్యమైనది. మరీ హార్డ్ కాకుండా.. మరీ మృధువైనవి కాకుండా మధ్యస్తంగా ఉండే బ్రష్లను వాడాలి. దంతాలను ఎక్కువసేపు తోమడం సరికాదు. దీనివల్ల పళ్లపై ఎనామిల్ తొలిగిపోయి బలహీనపడి దంతాల సున్నితత్తవం పెరుగుతుంది. అందుకని రెండు నిమిషాలపాటు బ్రష్ చేసుకోవడం ఉత్తమం. తద్వారా టూత్పేస్ట్లోని ఫ్లోరైడ్తో పళ్లు చక్కగా శుభ్రమవుతాయి. పళ్లు మరీ మిలమిలలాడాలంటే హార్డ్ బ్రష్, ఎక్కువ సేపు తోమడం మాని.. దంతవైద్యుడ్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా మంచిది.
హార్డ్ బ్రిజల్స్ మంచివేనా..?
బ్రష్ హార్డ్ బ్రిజల్స్ ఉన్న బ్రష్లను వాడితే పళ్లు మెరుస్తాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే, కఠినమైన బ్రిజల్స్ దంతాలను, చిగుళ్లను గాయపరుస్తాయి. రక్తం కారేలా చేస్తాయి. దంతాలపై ఉండే ఎనామిల్ పోయేలా చేసి దుష్ప్రభావాలు కలుగజేస్తుంది. అందుకని మరీ హార్డ్.. మరీ మృధువైనవి కాకుండా మధ్యస్థంగా ఉండే బ్రిజల్స్ ఉండే బ్రష్లతో పళ్లు తోముకోవడం చాలా మంచిది.
ఒక్కసారే తోముకోవాలా..?
బద్దకం, సమయం లేకపోవడం వల్ల చాలా మంది రోజులో ఒక్కసారే పళ్లు తోముకోవడంతో సరిపెట్టుకుంటారు. నిజానికి రోజులో కనీసం రెండుసార్లు దంతధావనంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు పళ్లు తోమడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కునే పాచీని పారద్రోలవచ్చు. లేనట్లయితే, దంతాలు పుచ్చిపోయి, చిగుళ్లు పాడైపోయి వివిధ సమస్యలు వస్తాయి. అలాగే ఫ్లాసింగ్ కూడా చేసుకోవడం చాలా మంచిది.
తిన్న తర్వాత తోముకోవచ్చా..?
చాలా మందిలో ఆహారం తీసుకున్న తర్వాత దంతాలను శుభ్రపరుచుకుంటారు. నోటిలోని లాలాజలం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే, నోటిలోని బ్యాక్టీరియా ఇతర సూక్ష్మక్రిముల నుంచి రక్షిస్తుంది. అలాంటిది ఆహారం తీసుకున్న తర్వాత పళ్లు తోమడం వల్ల ఈ ప్రభావం తగ్గిపోతుంది. అందుకని భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాలు వేచి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
చిగుళ్ల రక్తం హార్డ్ బ్రష్తోనే ..?
గట్టిగా బ్రష్ చేయడం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో దీనికి ఇతర సమస్యలు జోడవుతాయి. చిగుళ్లలో రక్తస్రావం చిగుళ్ల వాపు, చిగుళ్ల వ్యాధులకు సంకేతంగా నిలుస్తుంది. హార్డ్ బ్రష్తో ఇష్టం వచ్చినట్లుగా పళ్లపై రుద్దితే అనవసరంగా రక్తం కారుతుంది. ఇది చిగుళ్లను నాశనం చేస్తుంది. అందుకని చిగుళ్లను వేళ్లతోనే మర్ధనం చేయాలి. చిగుళ్ల నుంచి రక్తం కారుతుందంటే చిగుళ్ల వ్యాధి తొలిదశగా భావించాలి. ఇది మరింత తీవ్ర కాకముందే వైద్యుడ్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
ఏడాదికోసారి బ్రష్ మార్చాలా..?
మనలో చాలా మంది బ్రష్లను ఏండ్లుగా వాడుతుంటారు. అయితే, ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్లను మార్చడం చాలా మంచిదని దంత వైద్యులు సూచిస్తున్నారు. బ్రిజల్స్ వంగిపోయి కనిపించగానే బ్రష్ మార్చాలని, అరిగిపోయిన బ్రిజల్స్ పళ్లపై ఫ్లేక్స్ తొలగించడంలో సహాయపడవు. అలాగే, జ్వరం నుంచి కోలుకున్న తర్వాత కూడా బ్రష్ మార్చడం శ్రేయస్కరం.
బ్రష్ నిండా పేస్టు పెట్టాల్సిందేనా..?
చాలా మంది బ్రష్ నిండా పెస్టు పెట్టుకుని బ్రషింగ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల దంతాలు శుభ్రం సంగతి అటుంచితే, పేస్ట్ వేస్టవుతుంది. నోట్లో పెట్టి రుద్ది ఉమియగానే నోట్లో ఉన్న పేస్ట్ అంతా వెళ్లిపోతుంది. అలాకాకుండా పెద్దవాళ్లు బటానీ గింజ పరిణామంలో, చిన్న పిల్లలకు బియ్యపు గింజంత మాత్రమే పేస్టు వేసుకుని పళ్లు తోముకోవడం మంచిది.
మౌత్వాష్ సరిపోతుంది కాదా..?
బ్రష్ చేసుకున్న తర్వాత మౌత్వాష్తో పుక్కిలిస్తే నోటి దుర్వాసనతోపాటు దంతాల మధ్య ఇరుక్కునే పదార్థాల అవశేషాలు బయటకు పంపవచ్చు. నోటిలో ఉండే క్రిములను దూరం చేసుకోవచ్చు. అలాకాకుండా బ్రష్ చేయకుండా మౌత్వాష్ వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకని బ్రష్ చేసిన తర్వాతనే మౌత్వాష్ నోట్లో పోసుకుని గార్గ్లింగ్ చేయాలి.