ముంబై : మహారాష్ట్రలో ఓవైపు కొవిడ్-19 కేసుల పెరుగుదల ఆందోళన రేకెత్తిస్తుంటే మరోవైపు కలరా, జికా వైరస్ కేసులు వెలుగుచూడటం కలకలం రేపింది. రాష్ట్రంలోని చికల్దరా, అమరావతి ప్రాంతాల్లో జులై 7 నుంచి కలరా వ్యాప్తి చెందుతుండగా పాల్ఘర్లో జికా వైరష్ రెండవ కేసు బయటపడింది. మహారాష్ట్రలో 181 మంది కలరా రోగులను గుర్తించగా వారిలో ఐదుగురు మరణించారు. మరణించిన వారిలో ముగ్గురు రోగులు 24 నుంచి 40 ఏండ్ల లోపు వారు కావడం గమనార్హం.
కలరా వ్యాప్తి చెందిన గ్రామాల్లో నీటి నాణ్యతను పరిశీలించి, మెరుగైన పారిశుద్ధ్యం, చికిత్స అందించేందుకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ఇక పాల్ఘర్ బ్లాక్లోని ఆశ్రమశాల ప్రాంతంలో ఏడేండ్ల బాలికకు జికా వైరస్ సోకినట్టు గుర్తించారు. గతంలో ఇదే ప్రాంతంలో 2021 జులైలో తొలి జికా వైరస్ కేసు బయటపడింది. జికా వైరస్ నియంత్రణకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కట్టడి చర్యలను చేపడుతోంది.