మేడమ్ నమస్తే. మా పాప ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది. ఎంత బుజ్జగించినా ఫలితం ఉండదు. ఎందుకిలా జరుగుతుంది?
పిల్లలు పెరిగేకొద్దీ రాత్రిళ్లు నిద్రలోంచి లేచి ఏడ్చే అలవాటు తగ్గుతుంది. మాట్లాడగలిగే వయసు కాబట్టి, ఎందుకు ఏడుస్తున్నదీ కచ్చితంగా చెప్పగలరు. కొన్నిసార్లు పీడకలలు వేధిస్తుంటాయి. మెలకువ వచ్చినప్పుడు పక్కలో తల్లి లేదా తండ్రి కనపడకపోయినా ఏడుపు తన్నుకొస్తుంది. చెవిపోటు, కడుపునొప్పి, నులిపురుగుల కారణంగా మలద్వారం వద్ద తీవ్రమైన దురద, ఏదైనా పురుగు కుట్టడం.. ఇలా అనేకానేక కారణాలు ఉండవచ్చు. సాయంత్రాలు బాగా ఆడుకుని అలసిపోయినప్పుడు కాళ్లనొప్పులు బాధించవచ్చు కూడా. పడుకోబెట్టడానికి ఒకటి రెండు గంటలముందే తేలికగా అరిగే ఆహారం తినిపించాలి. తగినన్ని నీళ్లు ఇవ్వాలి. ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలి.
పిల్లలు నిద్రపోయే గదిలో ఉష్ణోగ్రత, గాలి, పలుచని వెలుతురు.. నిద్రకు అనువైన వాతావరణం ఉండాలి. ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే.. ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. ఎందుకంటే ఆరోగ్యానికి, నిద్రకు, ఏడుపునకు ప్రత్యక్ష సంబంధం ఉంది.
– డాక్టర్ ఉషారాణి సూపరింటెండెంట్ నిలోఫర్ పిల్లల దవాఖాన హైదరాబాద్