న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత అధికం కావడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు. మరోవైపు శీతాకాలంలో గుండె పోటు ఘటనలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సీజన్లో గుండె పోటు ఘటనలు అధికంగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. చలిలో రక్తనాళాలు సంకోచించడం వల్ల గుండె పోటు ముప్పు పొంచిఉందని వారు హెచ్చరిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా మార్నింగ్ వాక్లకు వెళ్లడం మానుకోవాలని, చలి గాలుల తీవ్రత బారినపడకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచే స్వెటర్స్, మంకీ క్యాప్ వంటివి విధిగా వాడాలని సూచిస్తున్నారు.
హృద్రోగులపై శీతాకాలం పంజా విసురుతుందని, గుండె ధమనుల్లో ఇప్పటికే బ్లాకేజ్లు ఉంటే గుండె పోటుకు గురయ్యే అవకాశం అధికమని, యాంజైనా లక్షణాలు కూడా తీవ్రమవుతాయని వాకార్డ్టీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవి గుప్తా వివరించారు. చలి వాతావరణంలో గుండె ధమనులు సహా శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోతాయని, అప్పటికే గుండె రక్తనాళాలు కుచించుకుపోయిన వారిని చలి వాతావరణం మరింత దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
ఈ సమయంలో వారు అధిక శారీరక శ్రమ చేసినా లేకుంటే బయట వాతావరణంలో ఎలాంటి యాక్టివిటీస్కు ఎక్స్పోజ్ అయినా సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. చలిగాలి, మంచు అధికంగా ఉండే ఉదయం వేళల్లో మార్నింగ్ వాక్కు వెళ్లడం కూడా వయో వృద్ధులు, గుండె సమస్యలు ఉన్నవారు కొన్ని రోజులు మానివేయడం మేలని డాక్టర్ గుప్తా సూచించారు. గుండె పంపింగ్ సామర్ధ్యం తక్కువగా ఉన్నవారిలో ఈ సీజన్లో శరీరంలో, లంగ్స్లో ఫ్లూయిడ్స్ పేరుకుపోయే అవకాశం ఉందని, వారి శరీరంలో అదనపు ఫ్లూయిడ్ హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలను అభివృద్ధి చేసే ముప్పు ఉందని ఆయన పేర్కొన్నారు.