న్యూఢిల్లీ : గత కొన్నేండ్లుగా భారత్లో హృద్రోగాలతో ఆకస్మిక మరణాలు (ఎస్సీడీ) గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ మరణాల్లో అధికంగా యువత, మధ్యవయస్కులు ఉంటుండటం కలవరం కలిగిస్తోంది. తీవ్ర హృద్రోగాల ప్రమాదం గురంచి యువతే కాకుండా స్కూల్ విద్యార్ధుల్లోనూ అవగాహన కల్పించాలని ప్రపంచ హృదయ దినం సందర్భంగా 5000 మందికి పైగా డాక్టర్లతో కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) ప్రచార కార్యక్రమం నిర్వహించింది.
భారత్ ప్రస్తుతం ప్రపంచ హృద్రోగ క్యాపిటల్గా మారిందని సీఎస్ఐ కన్వీనర్ (ప్రివెంటివ్ కార్డియాలజీ కౌన్సిల్) డాక్టర్ రాజీవ్ గుప్తా పేర్కొన్నారు. కాలుష్యం, డిప్రెషన్, ఎక్కువసేపు స్క్రీన్లపై గడపడం, చక్కెర వాడకం పెరగడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో హృద్రోగ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ప్రజల జీవన శైలిలో మార్పులతోనూ భారత్లో గుండె జబ్బులు పెరిగాయని అన్నారు.
శారీరక వ్యాయామం కొరవడటం, కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకోవడం ముప్పు కారకాలుగా ఉన్నాయని సీఎస్ఐ గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దేవవ్రత రాయ్ వివరించారు. మద్యపానం తీసుకునేవారు పెరుగుతున్నారని, ఫాస్ట్ ఫుడ్ చైన్స్ పెరగడం అవి కొవ్వులు, ఉప్పు, చక్కెర పరిమితులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను పాటించకపోవడం హృద్రోగాలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటితో పాటు నిరుద్యోగం, పేదరికం వంటి సామాజిక అసమానతలు పేదల్లో కుంగుబాటుకు ప్రేరేపిస్తూ ఆపై తీవ్ర హృద్రోగాలకు దారితీస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.