మనిషిని శారీరకంగా, మానసికంగా కుంగదీసే వ్యాధి.. క్యాన్సర్. రక్తం, అస్థిమజ్జ, శోషరస గ్రంథి వ్యవస్థల్లో కణాల అసాధారణ పెరుగుదలే రక్త క్యాన్సర్కు దారి తీస్తుంది. రక్తంలోని ఎర్ర రక్తకణాలు శరీర భాగాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తాయి. తెల్ల రక్తకణాలు సైనికుల్లా వ్యాధికారక క్రిముల నుంచి కాపాడతాయి. గాయాలైనప్పుడు శరీరం నుంచి రక్తం కారిపోకుండా.. వెంటనే గడ్డకట్టేలా రక్త ఫలకికలు (ప్లేట్లెట్స్) సాయం చేస్తాయి. రక్తకణాల ప్రాథమిక విధులకు ఆటంకం కలిగించే అసాధారణ పరిస్థితులే
రక్త క్యాన్సర్కు కారణం. ఈ నేపథ్యంలో రక్త క్యాన్సర్ల పూర్వాపరాలు. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, రక్త ఫలకికల్లో అసాధారణమైన పెరుగుదల కారణంగా రక్త క్యాన్సర్ వృద్ధి చెందుతుంది. ఈ రక్తకణాలన్నీ అస్థిమజ్జలో ఏర్పడతాయి. రక్తకణాలు అస్థిమజ్జలో అభివృద్ధి చెందే క్రమానికి ఆటంకం ఏర్పడి నప్పుడు.. ఆ పరిస్థితి క్యాన్సర్కు దారితీస్తుంది. లింఫోమా, ల్యుకేమియా, మైలోమా, మైలో ప్రొలిఫరేటివ్ నియోప్లాస్మ్స్, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ లాంటివి రక్త క్యాన్సర్ల కిందికి వస్తాయి. రక్త క్యాన్సర్లలో 60-65 శాతం వరకూ లింఫోమా క్యాన్సర్లే. ఇవి అన్ని వయసుల వారికీ రావచ్చు. ఈ రుగ్మతకు సమర్థవంతమైన చికిత్స కూడా అందుబాటులో ఉంది. రక్త క్యాన్సర్లలో తెల్ల రక్తకణాలకు వచ్చే ల్యుకేమియా వాటా 20 శాతం ఉంటుంది. ఇక, ప్లాస్మాకు వచ్చే మైలోమా 5-10 శాతం వాటా కలిగి ఉంటుంది.
తెల్ల రక్తకణాలకు సోకే ల్యుకేమియా అనేక రకాలు.. నెమ్మదిగా దాడిచేసేవి, దీర్ఘకాలికమైనవి, తీవ్రమైనవి. బాల్యంలో దాపురించే ల్యుకేమియాను అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా (ఏఎల్ఎల్) అని పిలుస్తారు. ఇది పెద్దల్లో కూడా వస్తుంది. తీవ్రమైన మైలాయిడ్ ల్యుకేమియా, దీర్ఘకాలిక లింఫాటిక్ ల్యుకేమియా, దీర్ఘకాలిక మైలాయిడ్ ల్యుకేమియా రోగులను అతలాకుతలం చేస్తాయి. వీటిలో కొన్నిటికి మామూలు మందులతోనే చికిత్స చేస్తారు. ఉదాహరణకు ఏఎల్ఎల్కు ఇమాటినిబ్ అనేది అద్భుతమైన ఔషధం.
క్యాన్సర్ కారకాలలో రక్తహీనత (ఎనీమియా) కూడా ఒకటి. సాధారణంగా, ఐరన్ లోపం వల్ల రక్తహీనత తలెత్తుతుంది. శాకాహారుల్లో అయితే విటిమిన్ బీ12, ఫోలేట్ లోపం వల్ల వస్తుంది. రక్తం ధారాపాతంగా కారడం, తెల్ల రక్తకణాలు అసాధారణంగా పెరగడం లేదా తగ్గడం వల్ల తలెత్తే ఇన్ఫెక్షన్లు, రక్తహీనత మొదలైన రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఓ దశలో అలసట, జ్వరం, ఒళ్లునొప్పులను కూడా రక్త క్యాన్సర్ లక్షణాలుగా పరిగణిస్తారు. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు, కిడ్నీల్లో పగుళ్లు సంభవించినప్పుడు మైలోమాగా భావించాల్సి ఉంటుంది. ఏ చిన్న లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయలేం. రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలి.
రక్త క్యాన్సర్లు మూడు రకాలు.. ల్యుకేమియా, లింఫోమా, మైలోమా. ల్యుకేమియా తెల్లరక్తకణాలకు సోకుతుంది. తెల్లరక్తకణాల ప్రాథమిక విధి అయిన వ్యాధి కారక క్రిములతో పోరాటాన్ని అడ్డుకుంటుంది. ల్యుకేమియా సాధారణంగా 15 ఏండ్లలోపు పిల్లల్లో కనిపిస్తుంది. ఇక, శోషరస వ్యవస్థకు వచ్చే క్యాన్సర్ లింఫోమా. ఇది శోషరస కణాల మీద ప్రభావం చూపుతుంది. ఇవి కూడా ఒక రకం రక్తకణాలే. ఈ పరిస్థితిని సాధారణంగా 15-35 ఏండ్ల మధ్య స్త్రీపురుషులలో చూస్తాం. యాభై ఏండ్లు పైబడిన వారిలోనూ కనిపిస్తుంది. ప్లాస్మా కణాలపై ప్రభావం చూపే క్యాన్సర్.. మైలోమా. ప్లాస్మా కూడా తెల్ల రక్తకణాల్లో భాగమే, కాబట్టి ఇది కూడా శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. మైలోమా కారణంగా మనలో రోగ నిరోధక శక్తి క్షీణించి శరీరం తేలికగా ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం ఉంది.
అందరికీ అస్థిమజ్జ మార్పిడి అవసరం ఉండదు. రోగ నిర్ధారణ (డయాగ్నోసిస్), చికిత్సకు రోగి స్పందన, కణితి జన్యుచరిత్ర మొదలైన వాటిని బేరీజు వేసిన తర్వాతే అస్థిమజ్జ మార్పిడిని వైద్యులు సిఫారసు చేస్తారు.
రక్త క్యాన్సర్లను చాలావరకు నయం చేయవచ్చు. ఆధునిక సాంకేతికత పుణ్యమా అని చికిత్సల విజయాల రేటు పెరుగుతున్నది. గతంతో పోలిస్తే.. వ్యాధి నుంచి కోలుకున్న రోగులు ఎక్కువ కాలం బతుకుతున్నారు. కీమోథెరపీ, రేడియేషన్, టార్గెటెడ్ థెరపీ/ బయాలాజిక్స్, అస్థిమజ్జ మార్పిడి, ఇమ్యునో థెరపీ లాంటివి రక్త క్యాన్సర్ చికిత్సను మెరుగుపరచాయి. రక్త క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తిస్తే .. నాణ్యమైన చికిత్స అందించవచ్చు. రోగి పూర్తిగా కోలుకోవడం సాధ్యమే.
కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందనేది అపోహ మాత్రమే. కానీ, హెరిడిటరీ బ్రెస్ట్
ఒవేరియన్ క్యాన్సర్ (హెచ్బీఓసీ) లాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నవారికి మాత్రం క్యాన్సర్ ఆస్కారం ఎక్కువ. ఇలాంటివారు జెనెటిక్ కౌన్సెలింగ్, రక్తం, లాలాజలం పరీక్షల ద్వారా జన్యు పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ ముప్పును అడ్డుకునే అవకాశం ఉంటుంది. లి ఫ్రామెని సిండ్రోమ్ లాంటి కొన్నిరకాల రక్త క్యాన్సర్లు, డౌన్ సిండ్రోమ్ను కలిగించే ల్యుకేమియా తదితరాలు జన్యుపరమైనవి. దాదాపు 4 శాతం రక్త క్యాన్సర్లు జన్యు పరమైనవే అంటారు నిపుణులు.