న్యూఢిల్లీ : పోషకాల గని అరటి పండు (Banana) సూపర్ ఫ్రూట్గా ఎన్నో దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఏడాది పొడవునా లభించే అరటి పండ్లు రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటి పండులో ఫైబర్, ప్రొటీన్, యాంటీఆక్సిడెంట్లు, అత్యవసర మినరల్స్ పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా బనానా ఉపయోగకరం. జలుబు, దగ్గు ఉన్నవారు అరటి పండు తీసుకుంటే అవి మరింత పెరుగుతాయనే భయంతో బనానాను దూరం పెడుతుంటారు.
మరికొందరు రాత్రి వేళలో అరటి పండ్లను తినడం మంచిది కాదని పక్కనపెడుతుంటారు. ఇక ఊబకాయం, మధుమేహంతో బాధపడేవారు అరటిపండు జోలికెళ్లరు. ఇలా అరటిపండు తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. అయితే అరటిపండు తీసుకోవడానికి సీజనల్ వ్యాధులకు మధ్య ఎలాంటి సంబంధం ఉన్నట్టు ఎలాంటి అధ్యయనాల్లో వెల్లడికాలేదు. పోషకాల పవరహౌస్గా పేరొందిన అరటి పండులో ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అరటి పండు ఎక్కువ మోతాదులో తీసుకుంటేనే దగ్గు, జలుబు పెరుగుతాయని మితంగా తీసుకుంటే శరీరానికి మేలే చేస్తుందని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు బీఎన్ సిన్హా చెప్పారు.
మరోవైపు బనానాలో ఉండే బనానా లెక్టిన్ అనే ప్రొటీన్ వైరస్లతో పోరాడి, వైరల్ కణాలు శరీరంలో ప్రవేశించడాన్ని అడ్డుకుంటాయని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. దగ్గు, జలుబు, అజీర్ణ సమస్యలతో బాధపడే వారికి సూచించే బ్రాట్ డైట్లో బనానా ముందువరసలో ఉంది. అరటిపండు రోజూ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకం సమస్యను కూడా నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక అరటి పండును రాత్రి వేళల్లో తీసుకోరాదని చెబుతుంటారు. అయితే మితంగా తింటే రాత్రి వేళల్లోనూ అరటిపండు తినవచ్చని, అయితే ఇందులో పలు పోషకాలు ఉండటంతో జీర్ణమయ్యేందుకు సమయం తీసుకుంటుందని, అందుకే రాత్రి సమయాల్లో పరిమితంగా తింటే ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Read More :