Health | ఆయుర్వేదంలో సాత్వికాహారానికి పెద్దపీట వేశారు. మొక్కల మీద ఆధారపడిన ఈ భోజన విధానం స్వచ్ఛతకు, సమతూకానికి ప్రాధాన్యం ఇస్తుంది. సాత్వికం అంటే పూర్తిగా శాకాహారం. రుతువుల వారీగా దొరికే తాజా పండ్లు, కూరగాయలు, సిరి ధాన్యాలు, పప్పులు, మొలకలు, ఎండుఫలాలు, పాలు, పాల పదార్థాలు ఇందులో భాగం.
సాత్వికాహారం పోషణను అందివ్వడమే కాదు.. మన మనసు, శరీరం, ఆత్మ మధ్య సమతూకాన్ని నెలకొల్పుతుంది. తినే ఆహారం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుందనే సంగతి తెలిసిందే. సాత్వికుడు ప్రశాంతంగా, పరిశుభ్రంగా, శక్తిమంతంగా, ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉంటాడని అంటారు. ఆయా ఉత్పత్తులను దాదాపుగా వాటి సహజ రూపంలోనే తీసుకోవడం ఈ ఆహార విధానం ప్రత్యేకత. భోజన పదార్థాలను తామస, సాత్విక, రాజస.. అని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. రాజస ఆహారం మనసును అతిగా ప్రేరేపిస్తుంది. తామస ఆహారం మనల్ని మందకొడిగా ఉంచుతుంది. ఉప్పు దట్టించిన చిరుతిళ్లు, పుల్లటి ఆహారాలు, టీ, కాఫీ, మద్యం, ఉల్లి, వెల్లుల్లి, ఫ్రిజ్లో ఉంచిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, మాంసం, చేపలు, గుడ్లు, మిగిలిపోయిన భోజనాలు, ఎప్పుడో వండిన పదార్థాలను సాత్వికాహారులు అసలు ముట్టుకోకూడదు.
ఎన్నో ప్రయోజనాలు
ఇందులో ఎలాంటి టాక్సిన్లు లేకపోవడంతో మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మానసిక వికాసానికి సాయపడుతుంది. సాత్విక ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శక్తిదాయకమైంది. సుఖనిద్రకు, బలమైన రోగ నిరోధక శక్తికి హామీ ఇస్తుంది. ఎలాంటి నిల్వ పదార్థాలు, రసాయనాలు, కృత్రిమ చక్కెరలు ఉండవు. ఇది చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం. వారానికి ఒక్కసారైనా సాత్వికాహారం తీసుకుంటే శరీరం డీటాక్స్ అవు తుందని సూచిస్తారు ఆయుర్వేద వైద్యులు. ఇక్కడ తీపి నిషిద్ధం కాదు కానీ, తీయదనం కోసం చక్కెరకు బదులుగా తేనె వాడతారు. సాత్వికాహారం తీసుకునేవారిలో గుండెపోటు ప్రమాదం ముప్పైశాతం తక్కువని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.