న్యూఢిల్లీ : ఆధునిక జీవనశైలితో వయసుతో నిమిత్తం లేకుండా మానవాళిని వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కరోనా అనంతరం యువతలోనూ గుండె పోటు ఘటనలు బెంబేలెత్తిస్తున్నాయి. 30 ఏండ్లు దాటినవారంతా విధిగా హెల్త్ చెకప్ చేయించుకోవాలని, వైద్యుల సలహాతో ప్రతి ఏటా ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక సమయం లేదనో, సమయానికి డబ్బులేదనో ఏదో కారణంతో పలువురు హెల్త్ చెకప్స్ను వాయిదా వేస్తుంటారు.
హెల్త్ చెకప్స్ను సులభతరం చేసేలా కేవలం ఏడు నిమిషాల్లోనే 20 రకాల పరీక్షలను నిర్వహించే ఏటీఎం తరహా మిషన్లు వచ్చేస్తున్నాయి. యూపీలో హెల్త్ ఏటీఎం కియోస్క్లు, హెల్త్ పాడ్స్ గ్రామీణ, సబర్బన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4600 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లలో కియోస్క్లు, ఏటీఎంల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇండియా హెల్త్ లింక్తో ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఈ హెల్త్ ఏటీఎం కియోస్క్ల్లో బీపీ, ఈసీజీ వంటి 20 రకాల ఆరోగ్య పరీక్షలను కేవలం ఏడు నిమిషాల్లో నిర్వహిస్తారు. ప్రాధమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారు ఈ కియోస్క్ల్లో పరీక్షలు చేయించుకోవచ్చు. ఎలాంటి సమస్య తలెత్తినా ఆటోమేటెడ్ టచ్ స్క్రీన్ కియోస్క్ ద్వారా వారు డాక్టర్తో టెలీకన్సల్టింగ్ పొందే వెసులుబాటు ఉంది. ఏటీఎం తరహాలో హెల్త్ పాడ్ ఎక్విప్మెంట్ ద్వారా బీపీ, టెంపరేచర్, ఆక్సిజన్ లెవెల్స్, బీఎంఐ, ఈసీజీ వంటి వివరాలను 5 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. రిపోర్ట్స్ వెంటనే వాట్సాప్, ఈమెయిల్, ఎస్ఎంఎస్ లేదా ప్రింటవుట్పై పొందవచ్చు. ఈ ఏర్పాటు ఆస్పత్రుల్లో రోగుల ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Read More :
Tea | ఛాయ్ అంటే ఇష్టం ఉంటే సరే.. కానీ అదే పనిగా కప్పులు కప్పులు తాగొద్దని చెప్పే చిట్టి కథ