Anti Biotic Resistance | ఎండలు, వర్షాభావం కారణంగా నేల ఎండిపోవడం వల్ల యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. ఈ విశ్లేషణ ప్రకారం నేలలోని తేమ తగ్గిపోవడం సహజ యాంటీబయోటిక్స్ పరిమాణాన్ని పెంచుతూ, వాటికి ప్రతిఘటన చూపే బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తోందని తేలింది. ఈ పరిశోధనను Nature Microbiology journal లో ప్రచురించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో పెరుగుతున్న ఎండలు, నేలలోని పొడిబారుదల (aridity) పెరగడానికి కారణమవుతున్నాయి. దీని ఫలితంగా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కూడా పెరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని California Institute of Technology కు చెందిన పరిశోధకులు 116 దేశాల్లోని ఆసుపత్రుల నుంచి సేకరించిన యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ డేటాను, ఆయా ప్రాంతాల వర్షపాతం, ఉష్ణోగ్రతలతో పోల్చారు. ఈ విశ్లేషణలో, ఎక్కువగా పొడి పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ స్థాయి కూడా ఎక్కువగా ఉండటం గమనించారు.
శాస్త్రవేత్తల ప్రకారం నేలలో సహజంగా యాంటీబయోటిక్స్ ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడటానికి ఈ రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఎండలు ఎక్కువైనప్పుడు, ఈ యాంటీబయోటిక్స్ సాంద్రత పెరిగి, వాటికి సున్నితంగా స్పందించే బ్యాక్టీరియా తగ్గిపోతుంది. అదే సమయంలో రెసిస్టెంట్ బ్యాక్టీరియా మాత్రం నిలబడగలుగుతుంది. పరిశోధనలో భాగంగా కాలిఫోర్నియాలోని పంట భూములు, గడ్డి భూములు, స్విట్జర్లాండ్లోని అడవులు, చైనాలోని తడి భూముల నుంచి సేకరించిన మట్టి నమూనాలను పరిశీలించారు. ఈ డేటాలో కూడా ఎండ పరిస్థితుల్లో యాంటీబయోటిక్ ఉత్పత్తి చేసే జన్యువులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
ల్యాబ్ ప్రయోగాల్లో కూడా ఇదే విషయం నిర్ధారితమైంది. నీటి శాతం తగ్గినప్పుడు యాంటీబయోటిక్స్ సాంద్రత పెరిగి, సాధారణ బ్యాక్టీరియా 99 శాతం వరకు తగ్గిపోవడం కనిపించింది. కానీ యాంటీబయోటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా మాత్రం ప్రభావితం కాలేదు. ఈ ఫలితాలు వాతావరణ మార్పులు ప్రజారోగ్యంపై మరొక కొత్త కోణంలో ప్రభావం చూపుతున్నాయని సూచిస్తున్నాయి. అయితే ఈ మార్పులు మనుషుల ఆరోగ్యంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఈవిధంగా వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఎండలు కేవలం పర్యావరణానికే కాకుండా, యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ పెరుగుదలకు కూడా దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.