Salt | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): డాక్టర్ల వద్దకు వెళ్లిన ప్రతిసారీ తినే ఆహారంలో ఉప్పు తగ్గించమని చెబుతుంటారు. వయసు మళ్లిన వారు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలని మరీ నొక్కిచెబుతారు. ఎందుకంటే ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల బీపీతో(రక్తపోటు) పాటు గుండె సంబంధిత సమస్యలను పెంచుతుందని చెబుతారు. అయితే తాజాగా అధికంగా ఉప్పును తినడం వల్ల పొట్ట సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రతిరోజూ 10 గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పును తినడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని, మనం రోజువారీ తినే ఉప్పు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుందని జపాన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం వెల్లడించింది. దీనిపై లోతుగా తెలుసుకోవడానికి ఎలుకలపై పరిశోధనలు నిర్వహించారు. ఉప్పు ఎక్కువవడం వల్ల కడుపులోని ఒక పొర దెబ్బతిని క్యాన్సర్కు దారితీస్తుందని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి. గుండె సంబంధిత జబ్బులు, క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు మనం తీసుకొనే రోజువారీ ఉప్పును 6 గ్రాముల కంటే తక్కువగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.