Leptospirosis | దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షం, వరదల ముప్పు నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సీజనల్ వ్యాధులపై నగర ప్రజలను అప్రమత్తం చేసింది. జంతువుల మూత్రం నుంచి ఈ బ్యాక్టీరియా మానవులకు సోకి.. తీవ్రమైన పరిస్థితుల్లో ప్రాణాంతకంగా మారుతుంది. అయితే, మహారాష్ట్రను లెప్టోస్పిరోసిస్ బ్యాక్టీరియా వణికిస్తున్నది. జూన్ నుంచి లెప్టోస్పిరోసిస్ కేసులు నమోదవుతున్నాయి. జూలైలో ఇప్పటివరకు ఏడుగురికి సోకింది.
లెప్టోస్పిరోసిస్ జంతువులతో పాటు మానువులను సైతం ప్రభావితం చేసే బ్యాక్టీరియా. ఇది లెప్టోస్పైరా జాతికి చెందిన బ్యాక్టీరియా కారణంగా సోకుతుంది. లెప్టోస్పిరోసిస్కు కారణమయ్యే బ్యాక్టీరియా జంతువుల మూత్రం ద్వారా నీరు, నేల కలుషితమై మనుషులకు సోకే ప్రమాదం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. లెప్టోస్పిరోసిస్ తీవ్రమైన కేసుల్లో మరణాలు సంభవించే ప్రమాదం 10-15 శాతం మధ్య ఉంటుందని, ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని నివారణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నిపుణుల అభిప్రాయం ప్రకారం, లెప్టోస్పిరోసిస్ అనేది జూనోటిక్ వ్యాధి.
లెప్టోస్పిరోసిస్ తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతుంది. లెప్టోస్పిరోసిస్ దాని తీవ్రతను బట్టి వ్యక్తి నుంచి వ్యక్తికి సోకే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తిలో లక్షణాలు అభివృద్ధి చెందడానికి రెండురోజుల నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది. సాధారణంగా అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. ఆ తర్వాత లక్షణాలు క్రమంగా కనిపిస్తాయి. బ్యాక్టీరియా సోకిన వ్యక్తుల్లో జ్వరంతో కూడిన దగ్గు, తలనొప్పి ఉంటాయి. కండరాల నొప్పి (ముఖ్యంగా వెన్నెముక), దురద, దద్దుర్లు, అతిసారం, వాంతులు, చలి, కళ్లు ఎర్రబారడడం తదితర లక్షణాలుంటాయని నిపుణులు పేర్కొన్నారు.
అధిక వర్షం, వరదల ప్రభావిత ప్రాంతాల్లోని వారికి లెప్టోస్పిరోసిస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అలాంటి వారికి ప్రత్యేక రక్షణ అవసరమని చెబుతున్నారు. ముఖ్యంగా పాడి రైతులు, పశువైద్యులతో పాటు జంతువులకు దగ్గర ఉండే వారికి, మురుగు నీటిలో పని చేసే వారికి సోకుతుంది. లక్షణాలు కనిపించిన వ్యక్తులు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని, సకాలంలో చికిత్స అందిస్తే పరిస్థితి తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు.