హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వైద్యారోగ్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఏటికేడు బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వచ్చారు. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో (2023-24) ఏకంగా రూ.12,161 కోట్లు కేటాయించారు. అంటే హెల్త్ బడ్జెట్ ఏకంగా రెండున్నర రెట్లు పెరిగింది. ‘మొదటి విడత పాలనలో ఇరిగేషన్, సంక్షేమంపై ఎక్కువగా దృష్టిపెట్టాం. రెండో విడతలో విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం’ అని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు.
ఇందుకు తగ్గట్టే గత ఐదేండ్లుగా భారీగా నిధులను కేటాయిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో హెల్త్ బడ్జెట్ రూ.5783 కోట్లు. అప్పటినుంచి ఈ ఏడాది వరకు కేటాయింపులు ఏకంగా 113 శాతం పెరిగాయి. బడ్జెట్ పెరగడమే కాదు.. తలసరి కేటాయింపుల్లోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. పెద్ద రాష్ర్టాల్లో తలసరి వైద్య బడ్జెట్ కేటాయింపుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఈ ఏడాది ఒక్కొక్కరిపై వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.3,440గా నమోదైంది.
సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు (రూ.కోట్లలో)
2019- 20 5783.9
2020- 21 6373.5
2021- 22 6487.6
2022- 23 11440.8
2023- 24 12,161