Heart Diseases | పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెజబ్బుల ప్రమాదం తక్కువని అనుకునేవాళ్లం. అయితే, ఇటీవల ఇండియన్ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయనం ఇదంతా అపోహేనని తేల్చింది. యాభైఏండ్లు దాటిన స్త్రీలలో.. మగవాళ్లతో పోలిస్తే అధిక రక్తపోటు సమస్యకు ఆస్కారం ఎక్కువని వెల్లడించింది. దీనివల్ల గుండెపనితీరు దెబ్బతిని ఆ వయసు పురుషులకంటే ఎక్కువగా హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని చెప్పింది.
ఇటీవల దేశంలోని వివిధ వయసులు, వివిధ ప్రాంతాలకు చెందిన స్త్రీపురుషుల ఆరోగ్య వివరాలు సేకరించారు. ఆ సమయంలో యాభై ఏండ్లలోపు స్త్రీలతో పోలిస్తే, అదే వయసు పురుషులకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. కానీ, యాభై దాటితే మాత్రం స్త్రీలకే హృద్రోగ గండం అధికం. మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ మహిళలు నలభై ఏళ్లు దాటాక అధిక బరువును కలిగి ఉంటున్నారు. ఊబకాయం, మధుమేహం తదితర సమస్యలతో పాటు మెనోపాజ్ తర్వాత హార్మోన్లలో వచ్చే మార్పులు, రక్తంలో ఐరన్ శాతం పెరగడం వల్ల రక్తం చిక్కబడటం లాంటివి.. అధిక రక్తపోటుకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. హైబీపీని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్లాంటి వాటికి దారితీయొచ్చని హెచ్చ రిస్తున్నారు. అందుకే యోగా, మెడిటేషన్ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలనీ, ఉప్పు, చక్కెర సాధ్యమైనంత తక్కువ మోతాదులో తీసుకోవాలనీ, ఆహారంలో పండ్లు కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలనీ సూచిస్తున్నారు వైద్యులు. ఇక నుంచి నడి వయసు దాటిన ఆడవాళ్లు గుండె ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిందే.
“ఫ్లూ అంటే జలుబు, జ్వరమే అని లైట్ తీసుకోకండి.. దీంతో ఆ సమస్య కూడా వస్తుందంట!!”