Health Tips | అసలు, ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది? ఆ పరిస్థితి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?
ఫుడ్ పాయిజనింగ్కు కలుషిత ఆహారం ప్రధాన కారణం. వండాల్సిన పదార్థాల్ని, వంట సామగ్రిని శుభ్రంగా కడగకపోవడం, వంట చేసే వ్యక్తి శుచిగా లేకపోవడం, పరిసరాల అపరిశుభ్రత వల్ల ఇలా జరుగుతుంది. అలాగే, మాంసాహారం వండిన చోటును సరిగా శుభ్రపరచకుండా.. అక్కడే కూరగాయల్లాంటివి నిల్వ ఉంచితే.. ‘క్రాస్ కంటామినేషన్’ జరుగుతుంది. దీంతో ఆ పదార్థాల్లోని చెడు బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇందులో ఏ కారణం వల్ల విషతుల్యమైనా.. వాంతులు, నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పిలాంటి ఇబ్బందులు వస్తాయి. అందులోనూ, డయేరియాకు గురైనప్పుడు శరీరంలో ద్రవాల స్థాయి తగ్గిపోకుండా చూసుకోవాలి.
తరచూ నీళ్లు తాగాలి. మజ్జిగ, నిమ్మరసం, ఎలక్ట్రాల్ పౌడర్, జీలకర్ర నీళ్లు, వాము నీళ్లు, సూప్లు, రాగిజావ, సగ్గుబియ్యం లాంటి ద్రవాలు, ద్రవాహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా, జీర్ణవ్యవస్థకు తగిన విశ్రాంతి ఇవ్వాలి. అంటే, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి. అరటి పండు, ఉడకబెట్టిన చిలగడదుంప, మెత్తగా వండిన కిచిడీ, పెరుగన్నం లాంటివన్నమాట. అలాగే కారాలు, మసాలాలకు దూరంగా ఉండాలి. ప్రొబయాటిక్స్ తీసుకోవాలి. పెరుగు, ఇడ్లీ ఈ కోవలోకే వస్తాయి. ఇవి మళ్లీ మన పొట్టలోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహకరిస్తాయి. ఇక, అల్లం మరగబెట్టిన నీళ్లు బ్యాక్టీరియాను పారదోలి జీర్ణ కోశానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కాఫీలు, వేపుళ్లు, మైదాతో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. పండ్ల రసాలు మంచి శక్తినిస్తాయి.
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@gmail.com