Transco-Discom Sports | హనుమకొండ చౌరస్తా, జూలై 16: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, పట్టుదలతో పోరాడిన వారికే విజయం దక్కుతుందని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వీ తిరుపతిరెడ్డి అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్ కౌన్సిల్ (Sports Council) ఆధ్వర్యంలో తెలంగాణ ట్రాన్స్కో (Tansco), టీజీఎన్ పీడీసీఎల్, టీజీఎస్ పీడీసీఎల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. 2026- 27 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ట్రాన్స్కో, డిస్కల ఇంటర్ సర్కిల్ (Inter Circle) వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్ పోటీల ప్రారంభ కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.

Jyoti Prajwalana
ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నారని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని అన్నారు. క్రమశిక్షణతో, అంకితభావంతో పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని కోరారు. విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అదే నిజమైన క్రీడాస్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, జట్టు భావనను పెంపొందిస్తాయని, విధి నిర్వహణలో ఎంత నిబద్ధతతో పనిచేస్తామో, అదే ఉత్సాహంతో క్రీడల్లోనూ పాల్గొనడం ఉద్యోగుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుందని సూచించారు. నిరంతరం పని ఒత్తిడితో పనిచేసే విద్యుత్ ఉద్యోగులకు ఈ క్రీడలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని వెల్లడించారు.
అనంతరం డైరెక్టర్ ఆపరేషన్స్టీ మధుసూదన్ మాట్లాడుతూ.. వరంగల్ పోరాటాల గడ్డ అని, ఈ నేలలో ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ నిండి ఉంటుందని అదే స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని విజయం వైపు అడుగులు వేయాలని కోరారు. డైరెక్టర్ హెచ్ఆర్డీ సీ ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ ఉద్యోగులు సేవా కార్యక్రమాల్లోనే కాకుండా క్రీడారంగంలోనూ ఎల్లప్పుడూ ముందుంటారని, రాష్ర్ట స్థాయి ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలకు ఉమ్మడి వరంగల్ వేదిక కావడం ఆనందంగా ఉందని అన్నారు. 20 టీంలు వాలీబాల్, 11 టీంలు బాల్బ్యాడ్మింటన్, 15 టీంలు క్యారమ్ పోటీల్లో పాల్గొన్నాయి.
కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ రాజుహన్, సీజిఎం వేణుబాబు, ప్రెసిడెంట్ స్పోర్ట్స్ కౌన్సిల్, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఆపరేషన్ హనుమకొండ బీ సామ్యనాయక్, స్పోర్ట్స్కౌన్సిల్ సభ్యులు ఏ ఆనందం (ఎస్ఈ వరంగల్), సీహెచ్ సంపత్రెడ్డి (ఎస్ఈ జనగామ), పీ విజయేందర్రెడ్డి (ఎస్ఈ మహబూబాబాద్), ఏ రమేష్ (ఎస్ఈ జయశంకర్ భూపాలపల్లి), బీ భిక్షపతి (ఎస్ఈ ములుగు), స్పోర్ట్స్ఆఫీసర్ ఎన్ జగన్నాథ్, కన్వీనర్ కే దర్శన్కుమార్, సభ్యులు యాకుబ్బాషా, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు.