న్యూయార్క్ : ప్రతిరోజూ వ్యాయామం చేస్తే మరణం ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలపగా వారానికి కనీసం ఒకట్రెండు రోజులు 8000 అడుగులు (6.4 కిలోమీటర్లు) నడిస్తే అకాల మరణం ముప్పు తప్పుతుందని (Health Tips) ఓ అధ్యయనం వెల్లడించింది. జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం కీలక వివరాలు వెల్లడించింది. వారానికి కొద్దిరోజులైనా ఇంటెన్సివ్ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని పేర్కొంది.
వారానికి ఒకట్రెండు రోజుల పాటు 8000 అడుగులు నడిచిన వారు అసలు ఆ మైలురాయి చేరుకోని వారితో పోలిస్తే రాబోయే పదేండ్లలో మరణించే ముప్పు 14.9 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనం తేల్చిచెప్పింది. వారానికి మూడు నుంచి ఏడు రోజులు 8000 అడుగులు నడిచే వారిలో మరణాల ముప్పు 16.5 శాతం తక్కువగా ఉన్నట్టు ఆ అధ్యయనం పేర్కొంది. 65 ఏండ్లు ఆపైబడిన వయసు వారిలో వారానికి ఒకట్రెండు రోజులు 8000 అడుగుల నడకతో పలు ఆరోగ్య ప్రయోజనాలు కనిపించాయి.
వారానికి ఎన్ని రోజులు 8000 అడుగుల నడక సాగిస్తున్నారనే దానితో హృద్రోగం సహా ఏ కారణం చేతనైనా మరణించే ముప్పు తక్కువగా ఉన్నట్టు వెల్లడైందని జపాన్లోని క్యోటో యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. వారానికి కేవలం రెండు రోజుల నడకతో వ్యక్తులు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని వారు తెలిపారు.
2005, 2006లో 3100 మంది రోజువారీ ఎన్ని అడుగులు నడిచారనే గణాంకాలను సేకరించిన అధ్యయనం బృందం ఆపై పదేండ్ల తర్వాత వారిలో మరణించిన వారి డేటాను సరిపోల్చి పరిశోధన చేపట్టింది. ప్రతి రోజూ నడకను అలవాటు చేసుకున్న వారిలో హృద్రోగాలు, ఊబకాయం, మధుమేహం, హైబీపీ, కుంగుబాటు వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుందని మయో క్లినిక్ పేర్కొంది.
Read More :