న్యూఢిల్లీ : పొల్యూషన్ లెవెల్స్ విపరీతంగా పెరగడంతో కొత్త ఏడాదిలో శ్వాసకోశ వ్యాధులతో బాధపడే రోగుల సంఖ్య ఏకంగా 30 శాతం పెరిగిందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. రక్తంలో ఆక్సిజన్ తగ్గడం, కాలుష్యంతో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో కొందరు ఐసీయూలోనూ చేరే పరిస్ధితి నెలకొందని చెబుతున్నారు. శ్వాస సమస్యలతో ఇప్పటికే సమస్యలు ఎదుర్కొనే వారికి వాయుకాలుష్యం, వాయు నాణ్యత సూచీ పడిపోవడంతో ఈ శీతాకాలంలో మరింత ముప్పు వాటిల్లుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.
బ్రాంకైటిస్, ఛాతీ ఇన్ఫెక్షన్లు, న్యూమోనియా, ఆస్త్మా వంటి శ్వాసకోశ వ్యాధుల కేసుల సంఖ్య ఈ వింటర్తో పాటు కొత్త ఏడాది ఆరంభంలో గణనీయంగా పెరిగాయని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, డైరెక్టర్, పల్మనాలజీ డాక్టర్ మనోజ్ గోయల్ పేర్కొన్నారు. రోగులు అధికంగా వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు గురువుతున్నారని చెప్పారు.
తాము కొత్తగా ఎలాంటి తాజా కొవిడ్-19 కేసులను గుర్తించలేదని, ఇవన్నీ వింటర్ సీజన్, అధిక కాలుష్యం వల్ల బయటపడుతున్న వ్యాధులేనని డాక్టర్ గోయల్ తెలిపారు. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి వంటి లక్షణాలతో రోగులు ఎక్కువగా ఆస్పత్రులకు వస్తున్నారని చెప్పారు. ప్రజలు శీతాకాలంలో ఉదయం, రాత్రి వేళల్లో ఇంటిపట్టునే ఉండాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.