ఆలేరు టౌన్, మార్చి 27 : హోలీ.. సప్తవర్ణాల కేళి.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ. గత ఏడాది కొవిడ్ నిబంధనలు పాటించి హోలీ జరుపుకొన్నాం. ఈ ఏడాది కూడా గత సంవత్సరం మాదిరిగానే జరుపుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలి. అంతే కాకుండా ఈ పండుగకు చారిత్రక ప్రాశస్త్యముంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆనందాన్ని పంచుకోవచ్చు…లేదంటే అనర్థాలు తప్పవు. మార్కెట్లో ఎన్నో రకాల రంగులు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో అనేక రకాల రసాయనాల మిశ్రమాలు ఉంటాయి. దీనివల్ల మన ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ రంగుల్లో లెడ్ఆక్సైడ్, అల్యూమినియం బ్రోమైడ్, మెర్క్యురి సల్ఫైడ్. కాపర్ సల్ఫైడ్ వంటి రసాయనాలు శరీరానికి హాని చేస్తాయి. ఈ రసాయనాలు కండ్లల్లో పడితే కంటిచూపు పోయే ప్రమాదం ఉన్నది.
చర్మం మంట పెట్టడం, దుద్దుర్లు రావడం జరుగుతుంది. అయితే అస్తమా వ్యాధులతో బాధపడే వారు, గర్భవతులు, మరీ చిన్నపిల్లలు రంగులు చల్లుకునే కార్యక్రమంలో పాల్గొనవద్దు. రంగులు కండ్లలో పడకుండా రక్షణ అవసరం. వీలైతే అద్దాలు ధరించాలి. వాడిన రంగుల దుస్తులను మళ్లీ ధరించవద్దు. జుట్టుపై హానికర రంగులు పడకుండా టోపీ ధరించాలి. కోడిగుడ్లు కొట్టడం, పేడ చల్లడం వంటివి చేయవద్దు. చెరువులు, నదుల్లో స్నానానికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పండుగ సమయంలో ఆనందం ఎంత ముఖ్యమో సభ్యత, సంస్కారం కూడా అంతే ముఖ్యం. ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు. హోలీ వేడుకల్లో సహజసిద్ధమైన రంగులనే ఉపయోగించాలి. దీని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ప్రకృతి సిద్ధమైన రంగులు వాడటం వల్ల శరీరానికి హాని జరగదు. వాటిని కడిగేందుకు తక్కువ నీరు అవసరమవుతుంది. సహజ రంగులతో నీటిని పొదుపు చేయవచ్చు. అసలే వేసవి కాలం.. ఈ నేపథ్యంలో నీటి పొదుపును పాటిస్తూ పండుగగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది.
మోదుగుతో ఉపయోగాలెన్నో..
శివుడికి సమర్పించే పూజా ఫలం.. రోగ నివారణకు ఉపయోగపడే ఆయుర్వేద వృక్షం. ప్రతి ఏటా పాల్గుణ మాసంలో హోలీ పండుగకు కొద్ది రోజుల ముందు మోదుగు చెట్టుకు అందమైన అగ్నిపూలు పూస్తాయి. ఈ అందమైన కాంతులు వెదజల్లే మోదుగు పూలు వనాలకే అందాన్నిస్తాయి. ఈ పూలల్లో మకరందం ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఈ పూలు విరగబూస్తాయి. జిల్లాలో పలుచోట్ల ఆకట్టుకుంటున్నాయి. మోదుగు చెట్టుతో మనకు విడదీయరాని అనుబంధం ఉన్నది. దీని ఆకులు విస్తారాకులకు ఉపయోగించడమే కాకుండా మోదుగు కాడలను, కొమ్మలను పూజల్లో వినియోగిస్తారు. యజ్ఞయాగాదులు, హోమాల్లో ఎండిపోయిన మోదుగు కొమ్మలను కాలుస్తారు. దీని ద్వారా వచ్చే పొగ చెడును పారద్రోలుతుందని నమ్మకం. ఈ పూలను ఉడకబెడితే సహజసిద్ధమైన రంగు వస్తుంది. హోలీ పండుగ రోజు ఈ రంగుతో ఆడుకుంటారు. ఈ రంగుతో ఆడుకుంటే చర్మంతోపాటు కంటికి ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు ఉండవు. మోదుగు చెట్లను దేవాలయాల్లో నిర్వహించే హోమాల్లో కాలుస్తారు. బొగ్గుబట్టీలు, వంట చెరకు వాడకంలో, రియల్ఎస్టేట్ ప్రభావంతో మోదుగు చెట్లు అంతరించే ప్రమాదం ఉందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఈ మోదుగు చెట్లు కనబడుతాయి. మోదుగు విత్తనాలను పొడిగా చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే ఏలికపాములు, బొద్దెపురుగుల నివారణకు తోడ్పడుతుంది. అలాగే పురుగులు పట్టిన పండ్లల్లో మోదుగు పూల విత్తనాలు పొడి చేసి వేస్తే ఆ పురుగులు పోతాయి. తెల్లమచ్చలు, తామర వ్యాధి తగ్గుతుంది.
రసాయన రంగులు వాడొద్దు
హోలీ పండుగ సందర్భంగా ప్రజలు రసాయన రంగులను వాడొద్దని ప్రభుత్వ వైద్యాధికారి డా.శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రసాయన రంగుల వాడకం వలన చర్మ, కంటి సమస్యలు ఏర్పడుతాయన్నారు. చిన్న పిల్లలను రసాయన రంగులకు దూరంగా ఉంచాలన్నారు. రసాయన రంగులను అధికంగా వాడటం వలన మూత్రపిండ సమస్యలు సైతం ఏర్పడుతాయని తెలిపారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో హోలీ పండుగ సమయంలో భౌతికదూరం, మాస్కులతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
– డా.శ్రీనివాస్, ప్రభుత్వ వైద్యాధికారి