మనం బస్సులోనో, రైలులోనో, మార్కెట్లోనో జనం మధ్య ఉంటాం. ఉన్నట్టుండి ఎవరో స్పృహ తప్పి పడిపోతారు. కొన్ని నిమిషాలపాటు అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఆ తర్వాత అలసిపోయినట్టు కనిపిస్తారు. ఈ పరిస్థితిని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది మూర్ఛ రోగం (ఎపిలెప్సీ) కావచ్చు. ఇది ఆరోగ్య
పరంగా తీవ్రమైన పరిస్థితి. వైద్యం తప్పనిసరి. ఎపిలెప్సీ లేదా మూర్ఛరోగం నాడులకు సంబంధించిన రుగ్మత. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నదని అంచనా. వీరిలో 10 నుంచి 20 శాతం మంది భారతదేశంలో ఉంటారు.
మూర్ఛరోగుల్లో మెదడులో విద్యుత్ ప్రసారం మోతాదుకు మించి ఉంటుంది. దీనివల్ల స్పృహ తప్పడం, అసాధారణమైన ప్రవర్తన, ఉద్రేకం, కొన్నిసార్లు తెలివి కోల్పోవడం జరుగుతుంది. శరీరం స్పృహ తప్పిన కారణంగా కొంతమందికి కొన్ని సెకండ్లపాటు అంతా శూన్యంగా అనిపిస్తుంది. ఇంకొంతమందిలో కాళ్లు, లేదంటే చేతుల కండరాలు మళ్లీమళ్లీ సంకోచిస్తాయి. అయితే ఈ పరిస్థితి ఒక్కసారి వస్తే మాత్రం మూర్ఛకు సంకేతం కాదు. 24 గంటల సమయంలో ఇలా రెండుసార్లు అసంకల్పితంగా స్పృహ తప్పిన పరిస్థితులు తలెత్తితే మాత్రం ఎపిలెప్సీ నిర్ధారణ చేయించుకోవాల్సిందే. ఎవరైనా స్పృహ తప్పి పడిపోయినప్పుడు పరిసరాల్లో ఏం జరుగుతున్నది తెలియదు.
శరీర ప్రతిస్పందనలు సరిగ్గా ఉండవు. ఇక మూర్ఛ రోగం ఉన్నవారికి తమకు అలా జరిగినట్టు కూడా గుర్తించలేరు. మూర్ఛకు ముందు ఎలాంటి హెచ్చరికలూ ఉండవు. కానీ, మూర్ఛ తగ్గిన వెంటనే రోగి పూర్తిగా మామూలుగా అయిపోతాడు. మెదడు అసాధారణంగా మారిపోయే పరిస్థితిని బట్టి స్పృహ తప్పిపోవడాన్ని వర్గీకరిస్తారు. తొందరగా గుర్తిస్తే వీటిని అదుపులో ఉంచుకోవడం సాధ్యమే. మూర్ఛను నియంత్రించుకోవడానికి 10 సూత్రాలను తెలుసుకోవాలి.
1. ఎపిలెప్సీ అనేది చాలావరకు నియంత్రించుకోగల సమస్య.
2. ఇది మానసిక అనారోగ్యం కానేకాదు.
3. ఒకవేళ మూర్ఛ వస్తే ఆ ప్రభావం శరీరం మీద ఎలా ఉందో ఓ చోట రాసిపెట్టుకోవాలి. ఈ లక్షణాలు చికిత్సలో పనిచేస్తాయి.
4. తొలిదశలో చికిత్స అన్నివిధాలా ఉత్తమం.
5. డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.
6. చికిత్స సాధారణంగా 2 నుంచి 5 ఏండ్లపాటు ఉంటుంది.
7. ఎపిలెప్సీ రోగికి ఏ విధమైన ఆహార పరిమితులూ ఉండవు. తగినంత నిద్ర తప్పనిసరి.
8. ఇతరుల్లా చదవడం, పనిచేయడం, ఉల్లాసంగా బతికేయడం సాధ్యమే.
9. ఎపిలెప్సీ ఉన్న మహిళలు పెండ్లి చేసుకోవచ్చు. పిల్లల్ని కనొచ్చు.
10. ఆస్తమా, తలనొప్పికి చికిత్స తీసుకున్నట్టే ఎపిలెప్సీకి కూడా వైద్యం చేయించుకోవచ్చు.
ఎపిలెప్సీ రోగులపట్ల మరీ జాగ్రత్త వద్దు. అలాగని అపోహలతో వారిని విడిగా ఉంచడమూ చేయవద్దు. అన్నిటికీ మించి, పిల్లల్లో ఎపిలెప్సీ సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. దీనిని ఇతర లక్షణాలతో పోల్చుకుని అపోహలకు పోవద్దు. మంచి వైద్యం అందిస్తే పిల్లలు చురుకైన బాల్యాన్ని ఆస్వాదించగలరు. ఇక ఎపిలెప్సీ ప్రభావం కూడా ఒక్కొక్కరి మీద ఒక్కోలా ఉంటుంది. కాబట్టి, ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.