ఏపీవోల క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, జనవరి 25 : ఉపాధి హామీ పనులు చేయడంలో తెలంగాణ ముందున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన 13.75 కోట్ల పనిదినాల్లో ఇప్పటివరకు 13.38 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయని తెలిపారు. కూలీలకు రూ.2,374 కోట్లు చెల్లించామన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ రూపంలో రూ.1,049 కోట్లు చెల్లించామని వివరించారు. మరో రెండు కోట్ల పనిదినాలను కేంద్రం కల్పించిందని, వీటిని కూడా పూర్తి చేయగలమన్న విశ్వాసంతో ఉన్నామని చెప్పారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీ అడిషనల్ ప్రాజెక్టు అధికారుల అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, రాష్ట్ర నీటివనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, ఏపీవోల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎం మోహన్రావు, అధ్యక్షుడు అంజిరెడ్డి, సంఘం నాయకులు గురుపాదం, శ్రీనివాస్రెడ్డి, బాలయ్య, నారాయణ, జాకబ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.