న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరు తీవ్రమైన నేపథ్యంలో ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. పంజాబ్లో పార్టీ పునర్వ్యవస్థీకరణపై ప్రియాంకతో సిద్ధూ చర్చించినట్టు సమాచారం. భేటీ అనంతరం ప్రియాంకతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిగాయని సిద్ధూ ట్వీట్ చేశారు.
ఇక సిద్ధూతో భేటీ ముగిసిన అనంతరం ప్రియాంక పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని కలిసేందుకు టెన్ జన్ఫథ్కు వెళ్లారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని సంసిద్ధం చేసేందుకు, నేతల మధ్య విభేదాలకు స్వస్తి పలికేందుకు ప్రియాంక, రాహుల్ గత కొద్ది వారాలుగా రాష్ట్ర నేతలను కలుస్తున్నారు. ఇక పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య విభేదాలపైనా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది.