గద్వాల పురపాలక సంఘంలో 37వార్డులు
రూ. 4కోట్లతో అన్ని వార్డుల్లో పార్కుల నిర్మాణానికి చర్యలు
ఇప్పటికే నాలుగు అందుబాటులోకి..
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
గద్వాల, మే4: గద్వాల పురపాలక సంఘంలో సుమారు రూ.4కోట్లతో పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి వార్డులో ఒక పార్కు ఏర్పాటు చేయాలని పురపాలక సంఘం అధికారులతో పాటు ఎమ్మెల్యే, పురపాలక చైర్మన్ నిర్ణయించారు. అందులో భాగంగా అన్ని వార్డుల్లో పార్కుల నిర్మాణానికి స్థలాలు గుర్తించారు. పురపాలక సంఘంలోని వార్డుల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా అందులో పార్కులు నిర్మిస్తున్నారు. జిల్లా పురపాలక సంఘంలో 37వార్డులు ఉండగా అన్ని వార్డుల్లో పార్కుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో పార్కుకు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నాలుగు ప్రాంతాల్లో పెద్ద పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పార్కులు పాత, కొత్త హౌసింగ్బోర్డు కాలనీలు, కామినీ పార్కు, స్మృతివనం ఏర్పాటు చేస్తున్నారు. మిగతా వార్డుల్లో అక్కడ స్థలాలను బట్టి పార్కుల నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో హౌసింగ్బోర్డు, రాధాకృష్ణకాలనీ, రెండో రైల్వేగేట్, మోమిన్మహేలా ప్రాంతంలో పార్కుల నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో ఐదు పార్కుల పనులు పురగతిలో ఉండి త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. మిగతా పార్కులు టెండర్ దశలో ఉన్నాయి.
ఆహ్లాదం..కాలక్షేపం
పురపాలక సంఘంలో కాసేపు సేద తీరుదామంటే పార్కులు లేక పోవడంతో ఎక్కడో చెట్లు ఉన్న చోట సేద తీరేవారు. ప్రస్తుతం పార్కులు ఏర్పాటు చేస్తుండడంతో ఇక వారు ఉదయం సాయంత్రం అలసిన మనస్సుకు ఆహ్లాదాన్ని పొందడానికి పార్కుకు రావచ్చు. పార్కులో బేంచీలు ఏర్పాటు చేయడంతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, చుట్టూ వివిధ రకాల పూల మొక్కలు నాటారు. చిన్నారులు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అన్ని వసతులతో పార్కులు ఏర్పాటు చేయడంతో పురపాలక ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పార్కులన్నీ అందుబాటులోకి తెస్తాం..
గద్వాల పురపాలక సంఘంలో సుమారు రూ.4కోట్లతో 37వార్డుల్లో పార్కుల నిర్మాణం చేపడుతాం.ఇప్పటికే కొన్ని పార్కులు అందుబాటులోకి రాగా మరి కొన్ని పార్కుల పనులు జరుగుతున్నాయి. కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. పార్కులు పట్టణ ప్రజల కోసం త్వరలో అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తా.
ఇంతియాజ్,ఇన్చార్జి డీఈ