Mahatma gandhi photo on indian currency | మన కరెన్సీ నోట్లపై బోసినవ్వులతో ఉన్న గాంధీ బొమ్మను గమనించే ఉంటారు ! పది రూపాయల నోటు నుంచి మొదలు పెడితే.. రెండు వేల రూపాయల నోటు దాకా దేని మీద చూసిన బాపూజీ బొమ్మనే కనిపిస్తుంది. కానీ మన కరెన్సీ నోట్ల మీద మహాత్ముడి బొమ్మను ప్రింట్ చేయడం మొదటి నుంచి లేదనే విషయం తెలుసా ! అవును స్వాతంత్య్రం వచ్చిన దాదాపు అర్ధ శతాబ్దం వరకు మన కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మను ముద్రించలేదు. మరి బోసినవ్వుల గాంధీ బొమ్మను కరెన్సీ నోట్ల మీద ప్రింట్ చేయడం ఎప్పుడు మొదలైంది? అంతకుముందు మన నోట్ల మీద ఎవరి బొమ్మలు ఉండేవో తెలుసా? గాంధీ జయంతి ( Gandhi jayanti ) సందర్భంగా ఈ వివరాలు ఒకసారి చూద్దాం..
స్వాతంత్య్రం రాకముందు ఆంగ్లేయులు నోట్లపై కింగ్ జార్జ్ చిత్రాలను ముద్రించేవారు. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 1950 జనవరి 26న గణతంత్ర రాజ్యంగా మారింది. అప్పటి నుంచి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ ) నోట్లను ముద్రిస్తుంది. ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లోని సమాచారం ప్రకారం.. 1949లో భారత ప్రభుత్వం మొదటిసారి రూపాయి నోటు డిజైన్ను రూపొందించింది. బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ చిత్రానికి బదులు మహాత్మా గాంధీ బొమ్మతో ఈ డిజైన్ను రూపొందించారు. కానీ దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో గాంధీ బొమ్మకు బదులు అశోక స్తంభం ముద్రించాలని నిర్ణయించారు. దీనికి మించి కరెన్సీ నోటు డిజైన్లో పెద్దగా మార్పు చేయలేదు. 1950లో అశోక స్తంభం ఉన్న డిజైన్తో తొలిసారిగా రూ.2, రూ.5, రూ.10, రూ.100 నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అన్ని నోట్లలో కేవలం రంగులు మాత్రమే డిఫరెంట్గా ఉండేవి. డిజైన్ మాత్రం ఒకే విధంగా ఉండేది. అన్ని నోట్లకు వెనుకవైపు పడవల బొమ్మ ఉండేది. 1954లో రూ. 1000, రూ.2000, రూ.10,000 నోట్లను తీసుకొచ్చారు. తిరిగి 1978లో రద్దు చేశారు. కరెన్సీ నోట్ల డిజైన్లలో మార్పులు తీసుకొచ్చారు. రూ. 2, రూ. 5 నోట్లపై జింకలు, సింహాల బొమ్మలను ముద్రించారు. ఇక 1972లో తొలిసారిగా రూ.20 రూపాయల నోటును తీసుకొచ్చారు. 1975లో 50 రూపాయల నోటును తీసుకొచ్చారు.
1969లో మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా తొలిసారి కరెన్సీ నోట్లపై బాపూజీ బొమ్మను ముద్రించారు. సేవాగ్రామ్ ఆశ్రమం ముందు మహాత్మా గాంధీ కూర్చొని ఉన్న చిత్రాన్ని నోటు వెనుకవైపు అచ్చు వేశారు. 1975 నుంచి రూ.100 నోట్లపై వ్యవసాయ స్వయం సమృద్ధి, తేయాకు తోటల్లో ఆకులు తెంపడం వంటి ఫొటోలను ముద్రించడం మొదలుపెట్టారు. అలాగే రూపాయి నోటుపై చమురు బావి, రెండు రూపాయల నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహం, రూ.5 నోటుపై ట్రాక్టర్తో పొలం దున్నుతున్న రైతు, రూ.10 నోటుపై కోణార్క్ మందిరం చక్రం, నెమలి, శాలిమార్ గార్డెన్ ఫొటోలు ముద్రించారు.
1987 అక్టోబర్లో తొలిసారిగా 500 రూపాయల నోటును ముద్రించారు. దీనిపై గాంధీ బొమ్మను, వాటర్ మార్క్లో అశోక స్తంభాన్ని ఆర్బీఐ ముంద్రించింది. 1996లో అప్పటి వరకు ఉన్న వాటితో పోలిస్తే కొత్త భద్రతా ప్రమాణాలతో గాంధీ సిరీస్ నోట్ల ముద్రణ మొదలైంది. వాటర్ మార్క్ను కూడా ఆర్బీఐ మార్చేసింది. అంధులు కూడా గుర్తుపట్టేలా వీటి డిజైన్ను మార్చారు. 2000 అక్టోబర్ 9 నుంచి వెయ్యి నోట్లు ముద్రించడం మొదలు పెట్టారు. కానీ 2016లో నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత 500, 1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త 500, 2000 నోటును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నోట్ల మీద కూడా బాపూజీ బొమ్మనే కొనసాగించారు.
మన కరెన్సీ నోటుపై బోసి నవ్వుతో మెరిసిపోతున్న గాంధీ బొమ్మ ఉంటుంది కదా ! ఈ చిత్రం ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లోని వైస్రాయ్ హౌస్లో ఉంది. 1946లో గాంధీజీ మయన్మార్కు చేరుకున్న సమయంలో అప్పటి బ్రెమా, ఇండియా కార్యదర్శి ఫ్రెడరిక్ పెథిక్ లారెన్సీని కలిశారు. అక్కడ తీసినదే ఈ చిత్రం. అయితే అప్పట్లో ఈ ఫొటోను ఎవరు తీశారనేది క్లారిటీ లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గాంధీ జయంతి |1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల్లో గాంధీజీ ఎందుకు పాల్గొనలేదు?
Kohinoor Diamond |కోహినూర్ వజ్రం గోల్కొండ కోట నుంచి బ్రిటన్ దాకా ఎలా వెళ్లింది?
గాంధీ జయంతి | గాంధీ మీద వచ్చిన ఆ బుక్ను ఇండియాలో ఎందుకు బ్యాన్ చేశారు?