నల్లగొండ పట్టణంలో మంగళవారం ఉదయం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు 10 బృందాలుగా విడిపోయి సతీశ్నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో ఏడుగురు సీఐలు, 18 మంది ఎస్సైలు, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్తో కలిపి సుమారు 200 పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
పట్టణంలోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో సుమారు 360 ఇండ్లలో తనిఖీలు నిర్వహించగా, 46 మంది అనుమానితులను గుర్తించి వారి వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది వ్యక్తులను గుర్తించారు. వీరిలో ఉత్తరప్రదేశ్కు చెందిన 10 మంది, బీహార్కు చెందిన 4 మంది, హర్యానాకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన ఒకరు, అస్సాం రాష్ట్రానికి చెందిన ఒకరు ఉన్నారు.
తనిఖీలలో భాగంగా ఇద్దరు రౌడీషీటర్లు, ఐదుగురు ట్రబుల్ మాంగర్స్ను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే ఆరుగురికి గంజా టెస్ట్ లు నిర్వహించగా వీరిలో ఇద్దరిని గంజా సేవించినట్లు గుర్తించడం జరిగింది. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ సక్రమంగా లేని 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు (త్రిచక్ర వాహనాలు) స్వాధీనం చేసుకొని సంబంధిత కేసులు నమోదు చేస్తున్నారు. అదనంగా 4 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ వెల్లడించారు.