Gandhi jayanti | స్వాతంత్య్ర సంగ్రామం నాటి గాంధీజీ ఫొటోలు ఎప్పుడైనా చూశారా ! అందులో ఇద్దరు మహిళల భుజాలపై చేతులు వేసి గాంధీజీ నడవడం చాలా ఫొటోల్లో కనిపిస్తుంది. కానీ ఆ మహిళలు ఎవరు అనేది చాలా మందికి తెలియదు. వాళ్లెవరో కాదూ.. గాంధీ మనుమరాళ్లు అభా గాంధీ, మను గాంధీ. వీళ్లిద్దరి బాపూజీకి చేతికర్రలా ఉండటమే కాకుండా.. ఆయన సిద్ధాంతాలను ఆచరిస్తూ మహాత్ముడికి కడవరకు తోడుగా ఉన్నారు. వీళ్లిద్దరే కాదు గాంధీ మార్గంలో నడుస్తూ ఆయనకు దగ్గరై స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళలు ఇంకొంతమంది ఉన్నారు. మరి వాళ్లెవరో ఒకసారి చూద్దాం.. గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
కస్తూర్బా గాంధీతో గాంధీజీకి 13వ ఏట వివాహమైంది. అప్పటినుంచి ఆమె గాంధీజీ అడుగుజాడల్లోనే నడిచారు. చివరికి స్వాతంత్య్ర సంగ్రామంలోనూ ఆమె.. గాంధీ మార్గాన్నే అనుసరించారు. స్వాతంత్య్రం కోసం శాంతియుతంగా పోరాడారు. ఈ పోరాటంలో కస్తూర్బా గాంధీ ఆరుసార్లు అరెస్టయ్యారు. చివరిసారి ఏకంగా 18 నెలల పాటు పూనాలోని ఆగాఖాన్ ప్యాలెస్లో నిర్బంధంలో ఉన్నారు. 1944 ఫిబ్రవరి 22న అదే ప్యాలెస్లో ఆమె కన్నుమూశారు.
గాంధీ మునిమనువడు కను గాంధీ భార్యనే అభా గాంధీ. ఈమె బెంగాలీ. గాంధీ ప్రార్థన కార్యక్రమాల్లో అభా భజన కీర్తనలు పాడేవారు. కనుగాంధీ ఫొటోలు తీసేవారు. గాంధీ ఆఖరి రోజుల్లో అభా ఆయన వెంటనే ఉంది. గాంధీజీ నడిచేందుకు అభా గాంధీ సాయం తీసుకునేవారు. నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేసిన సమయంలోనూ అభా అక్కడే ఉన్నారు.
మహాత్మా గాంధీకి మను గాంధీ దూరపు బంధువు. చిన్న వయసులోనే ఆమె గాంధీజీ వద్ద చేరారు. మనును గాంధీజీ తన మనవరాలిగా భావించేవారు. గాంధీజీ నోవాఖాలీలో ఉన్న రోజుల్లో అభాతో పాటు మను ఆయనకు తోడుగా ఉండేవారు. అభా, మను ఇద్దరి భుజాలను ఆసరాగా చేసుకునే గాంధీజీ నడుస్తుండేవారు. కస్తూర్బాకు చివరి రోజుల్లో సపర్యలు చేసిన వారిలోనూ మను పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శి ప్యారేలాల్ నయ్యర్కు సుశీల చెల్లెలు. గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితమై ఆయన అనుచరురాలిగా మారింది. గాంధీజీకి ఈమె వ్యక్తిగత డాక్టర్గా కూడా ఉన్నారు. వృద్ధాప్యంలో గాంధీజీ మనూ, అభా తర్వాత సుశీలపైనే ఎక్కువగా ఆధారపడేవారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కస్తూర్బా గాంధీతో పాటు సుశీల కూడా అరెస్టయ్యారు. కస్తూర్బా గాంధీ చివరి రోజుల్లో ఉన్నప్పుడు ఆమె వెంట సుశీల ఉన్నారు.
మహాత్మా గాంధీకి దగ్గరైన మహిళల్లో ఒకరు మీరాబెన్ ( 1892-1982). ఈమె అసలు పేరు మెడలిన్ స్లెడ్. ఈమె బ్రిటిష్ అడ్మిరల్ సర్ ఎడ్మండ్ స్లెడ్ కుమార్తె. జర్మన్ పియానో విధ్వాంసుడు బోథోవెన్ అంటే మెడెలిన్కు అభిమానం. అదే సమయంలో సంగీతకారుల గురించి ఫ్రెంచ్ రచయిత రోమైన్ రోలెండ్ రచనలు చేసేవారు. అలాగే బోథోవెన్ గురించి కూడా రోలెండ్ పలు రచనలు చేశారు. ఈ క్రమంలోనే రోలెండ్తో మెడలిన్కు పరిచయం ఏర్పడింది. అయితే గాంధీ జీవిత చరిత్రను కూడా రోలెండ్ రాశారు. ఈ బయోగ్రఫీని మెడలిన్ చదివింది. ఆ తర్వాత గాంధీ ప్రభావం ఆమెపై చాలావరకు పడింది. దీంతో గాంధీ చెప్పిన మార్గంలోనే నడవాలని ఆమె నిర్ణయించుకుంది. మద్యం సేవించడాన్ని మానేసింది. శాకహారిగా మారిపోయింది. అంతేకాదు సబర్మతీ ఆశ్రమానికి రావాలని నిర్ణయించుకుని గాంధీజీకి లేఖ కూడా రాసింది. 1925 అక్టోబర్లో మెడెలిన్ గుజరాత్కు వచ్చింది. అప్పటి నుంచి మహాత్మాగాంధీతో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది. ఆహ్మదాబాద్ వచ్చిన తర్వాత మెడెలిన్ పేరు మీరాబెన్గా మారింది.
సరళా దేవి చౌధరాని ( 1872-1945 ) రవీంద్ర నాథ్ ఠాగూర్ మేనకోడలు. 1919లో ఓసారి లాహోర్లోని సరళ ఇంట్లో గాంధీ బస చేశారు. సరళను తన ఆధ్యాత్మిక భార్యగా గాంధీ అభివర్ణించేవారు. ఖాదీ వాడకం గురించి ప్రచారం చేసేందుకు గాంధీ, సరళ కలిసి భారతదేశమంతటా పర్యటించారు. కానీ వీరి సాన్నిహిత్యం కారణంగా రామ్భుజ్తో సరళ వైవాహిక బంధం తెగిపోయే పరిస్థితులు కూడా వచ్చినట్లు గాంధీ ఒక సందర్భంలో ఒప్పుకున్నారు. ఈ కారణంతో సరళను గాంధీ దూరం పెట్టారు.
అమెరికాలో జన్మించిన నిలా క్రామ్ కుక్.. 1931లో భారత్కు వచ్చేసింది. ఆ తర్వాత గాంధీజీని అనుసరిస్తూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. ఈ క్రమంలోనే అంటరానితనానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాల గురించి 1932లో గాంధీకి వివరిస్తూ ఆమె ఒక లేఖ రాసింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య లేఖల ద్వారా సంభాషణలు జరిగేవి. 1933లో యరవాడ జైల్లో గాంధీని నిలా కలిశారు. అప్పుడు ఆయన నిలాను సబర్మతీ ఆశ్రమానికి పంపించారు. కొంతకాలం అక్కడ గడిపిన నిలాకు ఆశ్రమ సభ్యులతో మంచి అనుబంధం ఏర్పడింది. ఆశ్రమంలో అందరూ ఆమెను నాగిని అని కూడా పిలిచేవారు. కానీ ఉదారవాద ఆలోచనలు ఉన్న నిలాకు ఆశ్రమ జీవితం గడపడం నచ్చలేదు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గాంధీజీకి అత్యంత సన్నిహితులైన సత్యాగ్రహ ఉద్యమకారుల్లో ఒకరు అమృత్ కౌర్. కపూర్థల రాజు హర్నామ్ సింగ్ కుమార్తె ఈమె. ఇంగ్లండ్లో చదువుకున్నారు. 1934లో తొలిసారి ఆమె గాంధీజీని కలిశారు. ఇద్దరూ లేఖలు కూడా రాసుకునేవారు. సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అమృత్కౌర్ జైలుకు కూడా వెళ్లారు. స్వతంత్ర భారత దేశానికి ఈమె తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గాంధీ జయంతి |1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల్లో గాంధీజీ ఎందుకు పాల్గొనలేదు?
Kohinoor Diamond |కోహినూర్ వజ్రం గోల్కొండ కోట నుంచి బ్రిటన్ దాకా ఎలా వెళ్లింది?
గాంధీ జయంతి | గాంధీ మీద వచ్చిన ఆ బుక్ను ఇండియాలో ఎందుకు బ్యాన్ చేశారు?