మోదీపై యువతలో విర్తకి
మహిళల్లోనూ పెరుగుతున్న వ్యతిరేకత
ముఖ్యంగా యువతలో, మహిళల్లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తున్నది. అయితే, బీజేపీ పట్ల అసంతృప్తి పెరిగిపోతున్నప్పటికీ.. ఆ పార్టీని నిలువరించగల ప్రతిపక్షం కనుచూపుమేరలో లేకపోవటంతో.. ఏ పార్టీ పట్ల ఆసక్తి చూపని వారి సంఖ్య అధికమవుతున్నది. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల రణరంగంలో ప్రతిపక్షాలు బీజేపీని ఓడించటం అనేది.. స్త్రీలను, యువతను ఆకట్టుకోవటంపై ఆధారపడి ఉంటుంది. ‘యూ గవ్-మింట్-సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్) మిలీనియల్ సర్వే’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
మోదీ కల్పించిన భ్రమల నుంచి దేశ ప్రజానీకం బయటపడుతున్నది. ఎనిమిదేండ్ల మోదీ పాలన చూసిన తర్వాత.. ఇంకానా.. ఇకపై చెల్లదు అన్నట్లుగా బీజేపీకి దూరమవుతున్నది.
2020-2021 మధ్య పలు దఫాలుగా ఈ సర్వేను 206 పట్టణాలు, నగరాల్లో నిర్వహించారు. 12,900 మందిని ప్రశ్నించారు. తొలి మూడు దఫాల్లో పాల్గొన్నవారిలో 45 శాతం మంది బీజేపీకి మద్దతిస్తున్నట్లు తెలిపారు. కానీ, 2021 నవంబరు-డిసెంబరుల్లో చివరి దఫా నిర్వహించినప్పుడు బీజేపీ మద్దతుదారుల సంఖ్య 38 శాతానికి పడిపోయింది.
ఉత్తరప్రదేశ్తోపాటు ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు సమీపానికి వచ్చిన కీలక సందర్భం అది. ఆ తరుణంలో బీజేపీ పట్ల విముఖత పెరుగటం గమనార్హం. అయితే, దీనివల్ల ప్రతిపక్షాలు సంతోషించే పరిస్థితి లేదు. ఎందుకంటే, రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్కు సర్వేలో పాల్గొన్నవారిలో 11 శాతం మంది మాత్ర మే మద్దతు పలికారు. 34 శాతం మంది ఏ పార్టీ పట్లా అభిమానం చూపకుండా నిరాసక్తంగా లేదా తటస్థంగా ఉన్నారు. ఈ తటస్థుల సంఖ్య ఏప్రిల్ 2020లో 30 శాతం ఉంది. ఏడాదిన్నరలో అది మరో 4 శాతం పెరిగింది.
బీజేపీ మద్దతు తగ్గుతున్నట్టుగా స్పష్టమవుతున్నది. కానీ, దానివల్ల కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు లాభపడటం లేదు. ఏ పార్టీకీ మద్దతు తెలుపకుండా ఉన్న తటస్థుల సంఖ్య మాత్రం పెరుగుతున్నది.
రాజకీయ తటస్థత కారణంగా పౌర నిష్క్రియాపరత్వం
ఏ పార్టీకి మద్దతునివ్వకపోవటం అనేది ప్రజల్లో రాజకీయ నిష్క్రియాపరత్వాన్ని పెంచుతుందని సర్వేలో వెల్లడైంది. ఏదో ఒక పార్టీకి మద్దతిస్తామని చెప్పేవారితో పోల్చితే వీరిలో సగం మంది కూడా రాజకీయ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనరని, ప్రచారంలో కూడా పాలుపంచుకోరని తేలింది. ఓటు వేయటానికి కూడా వీరు అంతగా ఆసక్తి చూపరు.
దీనికి విరుద్ధంగా.. ఏదో ఒక పార్టీ పట్ల అభిమానం చూపేవాళ్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనటానికి ఉత్సాహం చూపుతుంటారు. వీరి కారణంగా రాజకీయ పార్టీల మధ్య పోటీ స్థిరంగా నెలకొని ఉంటుంది. ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉండేలా ప్రజలు వ్యవహరించటానికి వీరు తోడ్పడుతారు. అయితే, వీరి వల్ల కూడా సమస్యలు లేకపోలేదు. ప్రజాస్వామ్య ప్రక్రియలను పక్కనపెట్టయినా తమ పార్టీకి లాభం చేకూర్చాలని చూస్తారు. ప్రజాస్వామిక విధానాల పట్ల సహనం చూపరు.
పెరుగుతున్న తటస్థుల సంఖ్య
ఒకపైపు బీజేపీ మీద పెట్టుకున్న ఆశలు ఒట్టివేనని తేలటంతో ఆ పార్టీకి దూరం జరుగుతున్నప్పటికీ, తమకు నమ్మకం కలిగించే స్థాయిలో ఏ పార్టీ కూడా లేకపోవటంతో తటస్థంగా ఉండే వారి సంఖ్య పెరుగుతున్నది. వీరిలో ఎక్కువ మంది గతంలో బీజేపీకి మద్దతు పలికినవారే. అంటే, ఆ పార్టీ ఓటర్లే ఎక్కువగా తటస్థలుగా మారుతున్నారు. వీరిలో యువత ప్రథమస్థానంలో ఉండగా, మహిళలు
ఆ తర్వాత ఉన్నారు.
ఏ పార్టీకీ మద్దతివ్వని తటస్థుల్లో యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారు. వీరు ముఖ్యంగా చిన్న పట్టణాలకు చెందినవారు. వీరందరూ పోస్ట్-మిలీనియల్స్. అంటే, 1996 తర్వాత జన్మించినవాళ్లు. వారి వయసు దాదాపు 25 ఏండ్లు ఉంటుంది. ఏ పార్టీ కూడా తమకు ఆశావహంగా అనిపించటం లేదని 2020 డిసెంబరులో దాదాపు మూడోవంతు మంది (33 శాతం మంది) యువతీ యువకులు చెబితే, 2021 డిసెంబర్కు ఈ మాట చెబుతున్న యువత సంఖ్య 40 శాతానికి చేరుకున్నది. మహానగరాలకు చెందిన యువతలో ఇటువంటి మార్పు పెద్దగా లేదు. కానీ, మూడోశ్రేణి నగరాల్లో 29 నుంచి 36 శాతానికి పెరిగింది. ఉపాధి, ఉద్యోగాలు లేకపోవటం, ఉన్నవాటిని కూడా కరోనా తదితర కారణాలతో కోల్పోవటం, పట్టణాల్లో పెరిగిన పేదరికం – యువతలో ఈ ధోరణికి కారణాలు కావచ్చు.
కరోనాకు ముందున్న పరిస్థితులకు ఆర్థికవ్యవస్థ ఎప్పుడు వస్తుంది?
సర్వేలో పాల్గొన్నవారిలో ఈ ప్రశ్నకు స్పందించిన పార్టీల అభిమానులు, తటస్థులు (శాతంలో)..
కరోనా విపత్తును కేంద్రం ఎలా ఎదుర్కొన్నది
అనిశ్చితిలో ఓటర్లు
కరోనా విపత్తును కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నదని చెప్పినప్పటికీ.. ఆ పార్టీ ప్రభుత్వం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయటం ఈ సర్వేలో తేలిన రెండు విరుద్ధాంశాలు. అలాగే ఏ పార్టీనీ అభిమానించమన్న తటస్థులు కూడా ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తితోనే ఉన్నారు.
ప్రజల్లో అసంతృప్తికి మూలకారణం ఆర్థికపరమైన అంశం కాదని తెలుస్తున్నది. ఇదొక అవకాశమేగాక సవాల్ కూడా. ప్రతిపక్షాలు తమ బలాన్ని పెంచుకోవాలనుకుంటే.. భారీసంఖ్యలో ఉన్న తటస్థులను తమవైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. అలాగాకుండా, తటస్థుల సంఖ్య మరింత పెరిగే విధంగా రాజకీయాలు కొనసాగితే అది మన ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని చెప్పక తప్పదు.
-మింట్ సౌజన్యంతో…