సర్కారు బడుల్లో చదువుకునే ప్రైమరీ విద్యార్థులకు వర్క్బుక్స్, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్షల మంది పేద, బడుగు, బలహీన విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఈ పథకానికి ప్రభుత్వం సుమారు రూ.60 కోట్లు ఖర్చుచేసే అవకాశం ఉన్నది.
భవిష్యత్తును సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించాలంటే విద్య తప్పనిసరి. కానీ సరిపడా వనరులు లేకపోవడంతో చాలామంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. పాఠశాలకు వచ్చినా సరిపడా పుస్తకాలు లేకపోవడం మూలంగా ఆశించిన రీతిలో అభ్యసనం జరగడం లేదు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు రూ.200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను, రూ.150 కోట్లతో ఒక్కొక్కరికి రెండు జతల బట్టలను కూడా ఉచితంగా అందిస్తున్నది. ఈయేడు వర్క్బుక్స్, నోట్బుక్స్ కూడా అందజేయాలని నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఒక వివరణాత్మక సర్వే నిర్వహించినప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల్లో అభ్యసన కొరత కనిపించింది.
దీనివెనుక ఉన్న ప్రధాన కారణాల్లో పాఠశాలకు వెళ్లే పిల్లల కుటుంబాల ఆర్థికపరిస్థితి సరిగా లేకపోవడం ప్రధానమైనది. దీనివల్ల పేద కుటుంబాల వారు పిల్లల విద్య, అవసరమైన స్టేషనరీ కోసం ఖర్చు చేయడానికి అశక్తత చూపిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యు ద్ధం తర్వాత నోట్బుక్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పేద తల్లిదండ్రులు వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు పిల్ల ల పుస్తకాల బరువు మోయడం కూడా భారంగా మారింది. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈయేడు నుంచి ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు ఉచితంగా వర్క్బుక్స్, నోట్బుక్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం ముదావహం. ఈ నేపథ్యంలో 5వ తరగతి వరకు విద్యార్థులకు వర్క్బుక్స్, 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నోట్బుక్స్ ఉచితంగా అందజేయనున్నది. ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో ఒకేరోజు జూన్ 12న నిర్వహించనున్నది. అదేరోజు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు కూడా పంపిణీ చేయనున్నది. పాఠశాలల ప్రారంభోత్సవం రోజు పండుగ వాతావరణం ఉండాలనేది ప్రభుత్వ ఆకాంక్ష.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రాథమిక దశలో విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధిస్తారు, వారి ఉన్నత విద్య సాఫీగా సాగే అవకాశం కూడా ఉంటుంది.
రాష్ట్రంలోని సర్కారు బడుల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు ఉద్దేశించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 2022 మార్చి 8న వనపర్తిలో శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో రూ.3,497.62 కోట్లు వెచ్చించి, 9,123 స్కూళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో ఇప్పటివరకు దాదాపు 1,240 స్కూళ్లు సిద్ధమయ్యాయి. ‘మన ఊరు-మన బడి’ కింద పూర్తయిన బడులను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు సంబురపడుతున్నారు.
అదేవిధంగా ప్రభుత్వం సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు రాగిజావ అందించే కార్యక్రమం ఏర్పాటుచేయనున్నది. ఇందులో భాగంగానే స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకోనున్నది. ఇలాంటి అనేక వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాలతో పేద విద్యార్థులకు విద్యనందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేస్తున్నది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తారని ఆశిద్దాం.