విద్యారంగంలో విప్లవాలు రావాలని కాలమే ఎదురుచూసింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన ఆదివాసి గూడేల నుంచి పట్టణాలు, నగరాల్లోని మురికివాడల ముంగిళ్ల దాకా విద్యారంగం విస్తరించినప్పుడే మహిళా సమాజం వికాసం చెందుతుంది. ఆకాశంలో సగభాగమైన మహిళలు, బాలికలు సంపూర్ణ విద్యావంతులు కాకపోతే ఆ సమాజ అభివృద్ధి ఆగిపోతుంది. రాష్ట్ర అవతరణ తర్వాత కేసీఆర్ దార్శనిక తతో మహాత్మ జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, అంబేద్కర్ ఆలోచనల మేరకు అందరికీ విద్య అందించాలనే మహా సంకల్పంతో ముందుకుసాగుతున్నారు. అం దుకే నేడు ఈ విద్యా విప్లవం ఈ నేలంతా విరబూస్తు న్నది. దేశానికే తలమానికంగా తెలంగాణ గురుకుల విద్యావ్యవస్థ నిలిచింది. మహిళా విద్యకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. డ్రాపౌట్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. బాలికల విద్యకు ప్రోత్సాహకాలు పెరిగాయి. అమ్మాయిలు అన్నిరంగాల్లో అబ్బాయిలతో పోటీపడుతూ దూసుకుపోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పునరాలోచన చేసుకొని విద్యారంగంలో జరుగుతున్న మార్పును చూస్తే తెలంగాణ తల్లి పులకరిస్తున్నది. ఈ నేలంతా పరవశిస్తున్నది.
గత ప్రభుత్వాల్లోనూ నేను మంత్రిగా పనిచేశాను. అయితే మహిళల సంక్షేమం, అభివృద్ధి, విద్య విషయంలో పట్టుదలగా వ్యవహరించి సత్ఫలితాలు సాధించిన ప్రభుత్వం ఇది మాత్రమేనని గర్వంగా చెప్పగలను. అమ్మాయిగా పుట్టినప్పటి నుంచి పెళ్లయ్యేంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తున్నది. గత ప్రభుత్వాలు ఊహించని రీతిలో మహిళలకు హైజీనిక్ కిట్ల నుంచి మొదలుపెడితే ఉన్నత విద్య దాకా ప్రతీ అంశంపై వినూత్నంగా ఆలోచిస్తున్నది. తరగతి గదుల్లో నుంచి (కంప్యూటర్ ల్యాప్టాప్)లో విద్యను నేర్చుకునేవరకు చర్యలు చేపట్టింది. విద్యారంగంపై తీసుకున్న చర్యలను ఒక్క వ్యాసంలోనో, ఒక్క లేఖలోనో చెప్తే అయిపోయేది కాదు. కానీ ఒక మం త్రిగా నా శాఖ పరిధిలోని విద్యారంగానికి చెందిన ప్రధాన అంశాలను ఈ రోజు ప్రస్తావించదలుచుకున్నాను. మహిళల అక్షరాస్యత పెరగకపోవడానికి గల కారణాలు, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులపై సీఎం కేసీఆర్ అనేక వేదికలపై చర్చించారు. ఆర్థికపరమైన కారణాలు, బాలికలంటే సమాజంలో కొన్నివర్గాల్లో ఉన్న వివక్ష , పితృస్వామ్య ఆలోచనలుండటం వల్ల బాలికలను చదువుకు దూరంగా ఉంచడం, బాలురను మాత్రమే చదివించడం వంటి పరిస్థితులను గుర్తించారు. బడికి దూరంగా ఉంటున్న బాలురను, ప్రత్యేకించి బాలికలను పాఠశాలల్లో చదివించేలా ముఖ్యమంత్రి పలు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థకు చికిత్సను అందిస్తూనే సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అందులో భాగమే గురుకులాలు. ఇవి ఏర్పడిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించేందుకు ముందుకువస్తున్నారు. అప్పటివరకు ఆడపిల్లలకు చదువు భారమని భావించిన అమ్మాయిల తల్లిదండ్రులు గురుకులాల్లో తమ పిల్లలను చదివించడం గౌరవప్రదంగా భావిస్తున్నారు.
గతంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించే స్తోమత లేక, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లేక తమ పిల్లలను చదువుకు దూరంగా ఉంచేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాల్లోనే ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్షా ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తున్నది. గురుకులాలను ప్రత్యేకంగా బాలికల కోసం ఏర్పాటుచేయడంతో విద్యార్థినుల శాతం ఏటా పెరుగుతున్నది. ముఖ్యంగా మైనారిటీ బాలికల్లో అక్షరాస్యత శాతం ఏటా పెరుగుతున్నది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే మన రాష్ట్రం మెరుగ్గా ఉండటం సంతోషదాయకం. దళిత, గిరిజన వర్గాలకు చెందిన విద్యార్థులు ఆకాశమే హద్దుగా చదవుతుండటం తెలంగాణకు గర్వకారణం. మలావత్ పూర్ణ వంటి విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్నే అధిరోహించి తెలంగాణ విద్యారంగం కీర్తిప్రతిష్ఠలను దశ దిశలా వ్యాపింపజేశారు. పూర్ణ లాంటివారు వందల సంఖ్యలో తయారవుతుండటం గొప్ప విశేషం. ఈ రోజు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని గర్వంగా చెప్పదలుచుకున్నాను.
ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆంగ్ల మాధ్యమం, ‘మన ఊరు-మన బడి’తో బడుల రూపురేఖలన్నీ మారే పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యాభివృద్ధి ఏ ఒక్క రోజులోనో పూర్తయ్యేది కాదు. నిరంతర ప్రక్రియ. ఎప్పటికప్పుడు ఈ రంగా న్ని బలోపేతం చేసుకుంటూ విద్యారంగంలో కరిక్యులమ్, బోధనా పద్ధతుల్లో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చివేస్తున్నాం. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం విద్యార్థుల రాత మారుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించేందుకు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటుచేశాం. విద్యారంగంలో తీసుకువస్తున్న సం స్కరణల వల్ల మహిళలకు నిజంగా సాధికారత లభిస్తుందన్న సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. విద్యా యజ్ఞంలో మహిళల సాధికారత కోసం కృషిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలి, కొం డంత ధైర్యాన్నివ్వాలని వినమ్రంగా కోరుతున్నాను.
(వ్యాసకర్త: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి)
– సబితా ఇంద్రారెడ్డి