ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడమే ప్రజాస్వామ్యం అన్నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్. ఆయన నిర్వచనం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా వర్తిస్తుంది. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది. లేకపోతే ఒక వర్గం మరో వర్గాన్ని పాలించినట్టు అవుతుంది. ఈ ప్రజాస్వామిక సూత్రంపై కట్టుబడి ఉన్నారు కాబట్టే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్ని వర్గాల భాగస్వామ్యం కోసం పాటుపడుతున్నారు. అట్టడుగు వర్గాల కోసం ద్విముఖ వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. ఒకటి బడుగుబలహీన (బీసీల)వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం. రెండవది సామాజిక బలహీనవర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడం.
అలాగే చట్టసభల్లో మహిళలకు, బీసీలకు భాగస్వామ్యం కల్పించాలని ఇటీవల ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు రాయడాన్ని ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలి. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ చేత తీర్మానం చేయించారు. పార్లమెంటులో ఈ అంశాలపై పోరాడాలని ఎంపీలకు సూచించారు. తెలంగాణ సబ్బండవర్ణాల అభ్యున్నతికి దోహదం చేస్తుందని సీఎం కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే 2014 జూన్ 14న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. చట్టసభలో ప్రాతినిధ్యం దక్కినప్పుడే సమ్మిళితాభివృద్ధి సాధ్యమవుతుందన్న కేసీఆర్ భావన దేశ రాజకీయ లోకానికి కనువిప్పు కలిగించాలి. మహిళలు, బీసీలతో సహా సమాజంలోని అన్ని వర్గాలు పరిపాలనలో భాగస్వాములు అయినప్పుడే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకు ఇతర దేశాల్లోని అనుభవాలే సాక్ష్యం. సకల సంపద సృష్టి కర్తలైన గ్రామీణ కులవృత్తుల వారు, సబ్బండవర్ణాల వారు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కలిగి లేకపోవడమేమిటనే కేసీఆర్ ప్రశ్న ఆలోచింపదగినది.
చట్టసభల్లో సీట్ల పెంపు ద్వారా మహిళా రిజర్వేషన్కు సానుకూలత ఏర్పరచాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించడం గమనార్హం. సీట్ల పెంపు వల్ల ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పరిష్కారం లభిస్తున్నది. మహిళలు తమ రిజర్వేషన్ సాధించుకోవడానికి తాము ఉద్యమించాలనే భావన కవిత దేశవ్యాప్తంగా కలిగించారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాకతప్పదు. సోనియా మొదలుకొని అన్ని పక్షాల మహిళా నాయకులంతా ముందుకు రావాలని కవిత పిలుపు ఇవ్వడం గమనార్హం. ఈ పిలుపు మహిళల రిజర్వేషన్కు బాట వేసింది.
ఇది దేశ రాజకీయ చరిత్రలో అపూర్వమైన ఘట్టం. కవిత ఢిల్లీలో చేపట్టిన ధర్నా చరిత్రలో నిలిచిపోతుంది. మహిళా రిజర్వేషన్ను ఇంకా ఎంతో కాలం వాయిదా వేయలేమనే అభిప్రాయం ఇప్పటికే ఏర్పడింది. మహిళలు సమాజంలో సగభాగం ఉన్నారు. అవకాశం లభిస్తే తమ ప్రతిభా సామర్థ్యాలను రుజువు చేసుకుంటూనే ఉన్నారు. కానీ, చట్టసభల్లో మహిళలకు తగినంత ప్రాధాన్యం ఉండటం లేదు. అందువల్ల కనీసం మూడోవంతు రిజర్వేషన్ కల్పించినప్పుడే వారికి ప్రాతినిధ్యం లభిస్తుంది. మహిళలకు ప్రాతినిధ్యం పెరిగితే చట్టసభ చర్చలు మరింత అర్థవంతంగా జరుగుతాయి. ఇందుకు పార్లమెంటులో కవిత నిర్వహించిన పాత్రే ఉదాహరణ.
బలహీనవర్గాల ప్రజలు కూడా తమ జనాభాతో పోలిస్తే తగినంత ప్రాతినిధ్యం చట్టసభల్లో కలిగిలేరు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయినా బీసీల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు పోతున్నారు. మహిళలకు, బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. అందుకే సీఎం కేసీఆర్ రెండు అంశాలపై ప్రధాని మోదీకి లేఖలు రాశారు.
తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ బీసీలు, మహిళల అభివృద్ధి కోసం
అనేక చర్యలు తీసుకున్నారు. గొల్లకుర్మ, మత్స్య కారులు వంటి ఒక్కో సామాజిక వర్గంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గురుకులాలు పెట్టడమైనా, సర్కారు
దవాఖానలను బలోపేతం చేయడమైనా అంతిమంగా ఈ బలహీనవర్గాలకు
లాభం చేకూర్చేవే.
తెలంగాణలో బీసీలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నారు. కేంద్రం తోడ్పాటు లేకున్నా, సీఎం తన శక్తి కొద్దీ పాటుపడుతున్నారు. కేసీఆర్ అధికారం చేపట్టగానే, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీలతోసహా మొత్తం జనాభా స్థితిగతులపై వివరాలు సేకరించారు. వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. అహోరాత్రులు మేధోమథనం సాగించి బీసీల అభ్యున్నతికి వ్యూహ రచనలు చేశారు. కేసీఆర్ పాలనలో బీసీల్లో స్వాభిమానం బలపడింది. సాధికారత లభించింది. తొమ్మిదేండ్ల కాలంలో దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చి చూస్తే తెలంగాణ బీసీలు ఎంత అభివృద్ధి చెందారో తెలుస్తుంది. సోమవారం నుంచి ప్రధాని మోదీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు తలపెట్టడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మోదీకి రహస్య ఎజెండా ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది.
పార్లమెంటు ప్రజల ప్రతినిధుల వేదిక. ఇది ప్రజల ఎజెండాను చర్చించాలి. పాలకుల ఎజెండాను కాదు. సమాజంలో సగభాగం ఉన్నది మహిళలు. వారికి ప్రాతినిధ్యం తగినంత లేదు. సగానికి పైగా ఉన్నది బీసీలు. వారికి కూడా తగినంత ప్రాతినిధ్యం లేదు. దీనికి పరిష్కారం ఈ రెండు వర్గాలకు రిజర్వేషన్ కల్పించడమే. సీఎం కేసీఆర్ లేఖల ప్రాతిపదికగా మోదీ ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ప్రజల ఎజెండాపై చర్చించాలి. ఈ రెండు వర్గాలకు తక్షణం చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా రాజ్యాంగ సవరణ చేయాలి. ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసినట్టు చట్టసభల్లో సీట్ల సంఖ్యను పెంచాలి. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా పెంచాలి.