పరిపాలనలో ఉగాది పచ్చడిలో లాగ షడ్రుచులుంటాయి. అంతిమంగా మంచి జరిగిందా, లేదా? ఎంత ప్రగతి సాధించామనేదే కొలమానం. కేసీఆర్ నేతృత్వంలోని ఈ ఎనిమిదేండ్ల ప్రభుత్వ పాలనాతీరును ఎనిమిది విధాలుగా విశ్లేషిస్తే…
1.శాంతిభద్రతలు: ప్రభుత్వ ప్రధాన బాధ్యత శాంతి, భద్రతలు. అశాంతి ఉన్నచోట ప్రగతి ఉండదు. గతంలో పాతబడ్డ జీపుల్లో తిరిగే మన పోలీసులకు ఇన్నోవా కార్లు, మోడ్రన్ సైరన్లు, సీసీ కెమెరాలు, దేశంలో అతిపెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్, హైటెక్ పోలీసింగ్. తెలంగాణ ఏర్పడినప్పుడు కల్పించిన అభద్రతాభావానికి ఇదే క్లెమాక్స్గా మారింది.
2.సంక్షేమం: కాలే కడుపుకు పట్టెడన్నం, నిరుపేదకు ఆసరా పింఛన్ అవసరం. కాబట్టి కోఠిలో బేరమాడినట్లు కాకుండా రూ.200 నుంచి ఆసరా పింఛన్ను ఏకబిగిన రూ.1000 ఆ తర్వాత రూ.2016కు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో 85 లక్షల కుటుంబాలుంటే 40 లక్షల కుటుంబాలకు ఏదో రకమైన ఆసరా అందించి అంత్యోదయ ఉద్యమానికి ఆద్యుడయ్యాడు సీఎం కేసీఆర్.
3.మౌలిక సదుపాయాలు: అగ్ని, భూమి, నీళ్లు, వాయు, ఆకాశం తలపించేలా ప్రణాళిక రూపొందించారు. అగ్ని అంటే ఎలక్ట్రిసిటీ. ఉమ్మడి రాష్ట్రంలో ఉండే అంధకారాన్ని ఛేదించి 26 వేల మెగావాట్ల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. విద్యుత్తును కొనే రాష్ర్టాల జాబితా నుంచి అమ్మే రాష్ట్ర జాబితాలోకి చేర్చడం ఒక సంభ్రమాశ్చర్య ప్రణాళిక. భూమి: రోడ్లు, ఫ్లై ఓవర్లు , ట్రిపుల్ ఆర్ లాంటి నిర్మాణం గణనీయంగా పెంచి, రహదారులు ఆర్థిక ప్రగతికి రాచమార్గాలనే అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ మాటలకు ముహూర్తం పెట్టారు. జల్: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మిషన్ ఇరిగేషన్ ప్రణాళికలతో ఢిల్లీలోని రాజకీయ విరోధులు కూడా మన రాష్ర్టాన్ని పొగిడే అనివార్య పరిస్థితిని కల్పించారు. వాయు: స్వచ్ఛమైన గాలి ప్రాణానికి కనీస అవసరం, హరితహారానికి హారతి పట్టి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో అనుసంధానపరిచి, స్వచ్ఛమైన వాయువుకు పునాది వేశారు. ఆకాశ: డ్రోన్, నూతన విమానాశ్రయాలు ఇంకా రూపుదాల్చుకోనున్నాయి. మున్ముందు వాస్తవరూపం దాల్చనున్నాయి.
4.వ్యవసాయం: కరోనా సమయంలో రైతు, వ్యవసాయం విలువ దేశానికి తెలిసింది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం, కృష్ణా నది నీటి ఉపయోగం, తుపాకులగూడెం బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టుతో పాటు రైతు బంధు, రైతుబీమా, ఉచిత, నాణ్యమైన కరెంట్ వంటి నూతన పథకాలు, ఆచరణలు ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి’ అన్న అర్థం పలికిన దాశరథి గీతానికి నిజరూపం ఇచ్చారు కేసీఆర్. ఒక్కప్పుడు అంబలి కేంద్రాలు నడిపిన నేల నేడు దేశానికి మంచి భోజనం పెడుతున్నది.
5.పరిశ్రమలు: ఉపాధి కల్పనకు, ఆర్థిక ప్రగతికి మూలం పరిశ్రమ. ఉత్పత్తి, ఐటీ, నూతన ఆవిష్కరణలు. పరిపాలన సరళీకృతంలో భాగంగా టీస్-ఐపాస్ లాంటి గ్రీన్ టేప్ సంస్కరణ వల్ల గత ఎనిమిదేండ్లలో 17,234 అనుమతులు, 2,20,602 కోట్ల పెట్టుబడులు, 15,99,468 మందికి ఉపాధికల్పన కేసీఆర్ పాలనకు నిదర్శనం. ఎగుమతులు రూ. 50,000 కోట్ల నుంచి రూ.1.50,000 కోట్లకు పెరగడం సుపరిపాలనకు సూచిక.
6.పరిపాలనా దక్షత: అన్నిటికి మూలం, ప్రగతికి పునాది పరిపాలన చతురత. రాజకీయ రచనలో కౌటిల్య నీతి, రాజకీయ వ్యూహం పన్నడంలో శ్రీకృష్ణమార్గం. సామ, దాన, భేద, దండోపాయాల ఉపయోగం. హస్తినకు, హస్తవాసికి సమాంతర రాజకీయ ప్రయత్నం… ఒగ్గడం, తగ్గడం, ఎదురుదాడికి దిగడం, పరిపాలన, రాజకీయ ప్రణాళికను సమాంతరంగా నడిపించడం అందరితో సాధ్యం కాదు. విచిత్రమేమంటే ప్రతిపక్ష పార్టీలను కూడా పరోక్షంగా నడిపించే చతురత ఎన్టీఆర్ లాంటి ఉద్ధండులతో కూడా సాధ్యం కాలేదు. ప్రతిపక్ష పార్టీల ఎజెండాను తానే సెట్ చేసి పద్మవ్యూహం పన్నితే అందులో చిక్కుకున్నవారు, తామే సూత్రధారులమని భావించుకొని తెలియకుండా చిక్కుకున్న పాత్రధారులని తెలియక చాలామంది ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. కేసీఆర్ను తిట్టడం, తిట్టించుకోవడం కూడా పలు పార్టీ నాయకుల పెరుగుదలకు కారణమని పాకులాడటం ఒక విచి త్రం. నచ్చినప్పుడు తాటిచెట్టు మీద ఎక్కించడం, అది కేవలం తమ ప్రతిభ అని విర్రవీగినవారికి పాతాళ దర్శనం చేపించడం కేసీఆర్ అంతరంగం తెలియనివారి అమాయకత్వంతో పడే అవస్థలు.
7.సామరస్యం: దేశంలో అతిపెద్ద అయుత చండీయాగం 15వేల మంది వేద పండితులతో చేసి, ఇండియాలోనే మొదటిసారి ప్రభుత్వ ఖర్చుతో 1000 కోట్లతో యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం చేపట్టి, ఒక్క విమర్శకు అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు మహర్దశ తేవడం హిందువుగా ఒక ఎత్తు అయితే, అదే తరహాలో ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతాలను కూడా సంతృప్తి పరుస్తూ… కేసీఆర్ చేసే సమతుల్య ధార్మిక రాజకీయ ప్రక్రియ ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు. మఠాలు, మఠాధిపతులకు సాష్టాంగ నమస్కారం చేస్తూనే, అవసరమైనప్పుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తూ వినయం అమాయకత్వం కాదు, సంస్కారం సమర్పణ కాదు, ఎవరి స్థానం ఏంటో గుర్తుచేస్తున్నారు.
8.ఆర్థిక సుస్థిరత: (కుబేర) ‘ధనం మూలం- ఇదం జగత్’ అన్నారు పెద్దలు. రాష్ట్ర ప్రగతికి కొలమానం ఆర్థిక ప్రగతి. నాయకుడు ఎంత గొప్ప వాడైనా ఆర్థిక సుస్థిరత లేకుంటే అస్తిత్వం జటిలం. 1.2 లక్షల తలసరి ఆదాయం 2.5 లక్షలకు చేరడం, 5 లక్షల కోట్లున్న జీడీపీ 11 లక్షల కోట్లకు చేరడం ఆర్థిక ప్రగతికి నిదర్శనం. ఒక ఎకరం ఉన్న రైతు కూడా కోటీశ్వరుడు కావడం, వలసలు వెళ్లే రాష్ట్రం నుంచి, వలసలు వచ్చే రాష్ట్రంగా మారడం, తెలంగాణలో 3 కోట్ల ఎకరాల భూమి విలువ.. సగటున ఎకరానికి 50 లక్షలున్నది, కోటి యాభై లక్షలకు పెరగటం ఉన్నతికి తార్కాణం. తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లా భూమి అమ్మితే వచ్చే
పెట్టుబడితో మనం ఒక రాష్ర్టాన్ని కొనే స్థాయికి ఎదిగాం.
రాష్ట్ర సంపదతో పాటు రాజకీయ అస్తిత్వం కూడా అవసరం. దానికి ఆర్థిక పటిష్టత కూడా అవసరం. అందుకే గతంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు తమ ఎన్నికల అవసరాల కోసం సీమాం ధ్ర నాయకుల ముందు మోకరిల్లే పరిస్థితి నుంచి, రాష్ట్ర భవిషత్తు, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా అవసరం ఉన్నచోట , తెలంగాణ రాజకీయ అస్తిత్వమే ఇతర రాజకీయపార్టీల కు, రాష్ర్టాలకు పెట్టుబడి పెట్టే స్థాయికి తీసుకొని రావడం పదవుల కోసం పాకులాడే రాజకీయ నాయకులకు అర్థమయ్యే అంశం కాదు. తెలంగాణ ఉద్యమానికి రథసారథిగా ఉన్న కేసీఆర్ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రగతికి కూడా రథసారథిగా ఉన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం చైనా తలసరి ఆదాయానికి చేరటానికి చేసే ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావలసిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: మాజీ ఎంపీ, భువనగిరి)
-డాక్టర్ బూర నర్సయ్యగౌడ్