ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు సంపన్నుల కోసం, మరోవైపు పేదల సంక్షేమం కోసం రెండు పరస్పర విరుద్ధ విధానాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ సంపన్నుల అనుకూల బడ్జెట్ స్వభావాన్ని నిన్నటి మొదటి భాగంలో విశ్లేషించిన వ్యాస రచయిత నేడు రెండవ భాగంలో తెలంగాణ బడ్జెట్ ప్రజల సంక్షేమ తత్వాన్ని వివరించారు.
ఈ కథ తాలూకు మరో కోణం… మరో ధ్రువం లేదా మరో సిద్ధాం తం.. అది ‘డిమాండ్ మేనేజ్మెంట్’కు సంబంధించి నది. అంటే జనాలకు కొనుగోలుశక్తి ఉంటేనే.. దానికోసం వారికి ఉపాధి అవకాశాలూ… ఆదాయాలూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుం దీ అంటూ ‘క్షేమం అవిభాజ్యం’ అని ఘోషించే సంక్షేమ రాజ్య సూత్రీకరణ. ఈ సూత్రీకరణకు ఫిబ్రవరి 1 కేంద్ర బడ్జెట్ అనంతరం, ఫిబ్రవరి 6న వెలువడిన తెలంగా ణ రాష్ట్ర బడ్జెట్ సజీవ తార్కాణం. తాము అను సరిస్తున్న ధనికుల, కార్పొరేట్ల అనుకూల ఆర్థిక విధానాలను ప్రశ్నించినందుకు, ఎదిరించినందుకు కేంద్రంలోని బీజేపీ కత్తిగట్టి గ్రాంట్ల విడుదల విషయంలో శీతకన్ను వేయడం మొదలుకొని, రుణ సమీకరణను నిరోధించడం వరకు, ప్రతి అడుగులోనూ తెలంగాణకు అవరోధాలు కల్పిస్తున్నా సడలని సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పంథాను విడువకుండా ముందుకే సాగుతున్నది. ఇదేతరహా సంక్షేమాన్ని ఈ దేశంలోని ప్రతి రైతుకూ… ప్రతి పేదవాడికీ… మధ్య తరగతికి కూడా చేరుస్తానంటూ బీఆర్ఎస్గా తన సంక్షేమ ఎజెండాను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నది.
దానికి తార్కాణాలనేకం. ప్రస్తుతం కుదించి వేయబడిన రూపంలో కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న పీఎం కిసాన్ పథకానికి మార్గదర్శనం చేసింది. తెలంగాణలో అప్పటికే అమలుజరుగుతున్న రైతుబంధు పథకం. కాగా, పీఎం కిసాన్ ఆడంబరంగా ఆరంభమైన అనతికాలంలోనే నీరుగారిపోతుండగా, రైతు బంధు పథకం మాత్రం ఇటు నిధులు, అటు లబ్ధిదారుల సంఖ్య విషయంలో కూడా దిన దిన ప్రవర్ధమానమవుతూ తెలంగాణ రైతాంగా నికి కొండంత అండగా ఉంటున్నది. 2018 వానకాలంలో రైతుబంధు కింద 50.25 లక్షల మంది రైతులు లబ్ధిపొందగా, ఇది 2022 యాసంగి నాటికి 66.61 లక్షల మందికి పెరి గింది. అలాగే, ఈ పథకం కింద కేటాయింపుల మొత్తం 2019- 20లో 5,100 కోట్ల రూపా యలు ఉండగా… అది 2020- 21లో రూ.6,900 కోట్లు, 2022లో రూ.7,508 కోట్లు. ఇక ప్రస్తుతం 2023 యాసంగికి గాను రూ.7,645.55 కోట్లకు పెరిగింది. అలాగే, ఆరంభించిన సమయంలో ఎకరానికి సీజన్కు రూ.4 వేలుగా ఉన్న ఈ ప్రయోజనం తర్వాత అనతి కాలంలోనే రూ.5 వేలకు పెరిగింది. అదీ కథ…! ధనికుల అనుకూల బీజేపీ అభివృద్ధి నమూనాకు… జన సామాన్యం హితం కోరే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ నమూనాకు తేడా ఇదే.
కేంద్రం అమలు జరుపుతున్న అనేకానేక ఇతర పథకాల విషయం చూద్దాం. ఉజ్వల గ్యాస్ పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం మొదలుకొని ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీలు, పీఎం కిసాన్ వరకూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మొత్తం 14 కీలక సబ్సిడీ పథకాల్లోనూ ప్రస్తుతం కోతలు పడ్డాయి. గత బడ్జెట్ల నుంచీ కోతలు పడుతున్నాయి.
మరోపక్కన కార్పొరేట్లకు, పై వర్గాలకు మాత్రం రాయితీల వరాలు నిరాటంకంగా కురుస్తూనే ఉన్నాయి. అది కార్పొరేట్ పన్నును 32 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం కావొచ్చు. లేదా బ్యాంకు రుణాల ఎగవేత దారుల బకాయిల రైట్ ఆఫ్లు కావొచ్చు. లేదా ప్రస్తుతం బ్లాక్ బ్లస్టర్ షోగా లక్షల కోట్ల రూపా యల మొత్తాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేసే ప్రొడక్టవిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం కావొచ్చు. వీటన్నింటిలోనూ కథ ఒక్కటే. జన సామా న్యం కట్టిన పన్నుల డబ్బును, కార్పొరేట్లకు కాసుల వర్షంగా కురిపించేందుకు కైంకర్యం చేయడమే..! పైగా ఇదంతా చాలదన్నట్టు ప్రజల కోసం వారే కడుతున్న పన్ను డబ్బును వాడుతున్న ప్రభుత్వాలపై కత్తిగట్టి ‘ఉచితాలు’, ‘రేవడి కల్చర్’ అంటూ, ఆఖరికి సుప్రీంకోర్టు భుజాలపై కూడా తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం. అభివృద్ధికీ, సంక్షేమానికి పోటీ పెట్టి సంక్షేమం ‘ఎక్కువ’ జరిగితే అభివృద్ధి కుంటుపడుతుందంటూ కుతర్కాలు చేయడం బీజేపీకి పరిపాటిగా మారింది.
దీనికి ప్రతివాదన నేడు తెలంగాణలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం సమపాళ్లలో, సమతుల్యతతో జరుగుతున్న కార్యక్రమాలే. అయితే ఇక్కడ పథకాల అమలులో కొంత ముందువెనుకలూ లేదా వేగం తీరుతెన్నులలో తేడాలుండొచ్చు. కానీ, గమనించాల్సింది ఎంత ధనిక రాష్ట్రంలోనైనా అందుబాటులో వనరులు ఒక స్థాయిలోనే ఉంటాయనేది. కాబట్టి రాత్రికి రాత్రే లేదా 70 ఏండ్ల నిర్లక్ష్యం తర్వాత… ఎనిమిదేండ్లలోనే భూమ్మీదికి స్వర్గం దిగిపోతుందనుకుంటే పొరపాటే. చూడవలసింది ఈ కొన్నేండ్ల స్వతంత్ర అస్తి త్వంలో మన చుట్టూ జరిగిన మార్పులను. అలాగే ఈ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ భిన్నంగా, మెరుగ్గా ఉన్న అభివృద్ధినీ.. పురోగతిని కూడా. ఈ క్రమంలోనే ఒక్క ఉదాహరణను చూపుదాం. సంక్షేమానికీ, అభివృద్ధికీ కూడా మరో మచ్చుతునకగా ఉన్న తమిళనాడు రాష్ర్టం పరిస్థితిని ఇక్కడ పరిశీలించొచ్చు. 1965లో ఆ రాష్ట్రం తాలూకు తలసరి ఆదాయం రూ.400 కాగా, అదే కాలంలో బీహార్ రాష్ట్రపు తలసరి ఆదాయం రూ.350. మరి నేడు 2020 నాటికి తలసరి ఆదాయం బీహార్లో అత్తెసరుగా రూ.46 వేలుగా మిగిలిపోగా, సంక్షేమానికి పెద్దపీట వేసిన ద్రవిడ రాజకీయాల తమిళనాడులో రూ.2.25 లక్షలుగా ఉన్నది.
ఈ ఎనిమిదేండ్లలోనే.. దాదాపు రెండున్నర రెట్లకు పైగా పెరిగిన తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం, రెట్టింపైన విద్యుత్ శక్తి విని యోగం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య 8 లక్షలను దాటడం, ఈ సంఖ్య త్వరలోనే 10 లక్షలను దాటుతుందనే అంచనా- ఇటువంటి వి తార్కాణాలు తెలంగాణలో వేగంగా జరు గుతున్న ఆర్థిక పురోగతికి అద్దం పట్టేవే. ఇక ఉమ్మడి రాష్ర్టంలో 2004- 05 నుంచి 2013- 14 వరకు 10 ఏండ్లలో తెలంగాణ లో పెట్టబడిన అభివృద్ధి వ్యయం 54,052 కోట్ల రూపాయలు మాత్రమే. కాగా, తెలంగాణ ఏర్పడిన అనంతరం ఎనిమిదేండ్లలో అభివృద్ధికి పెట్టుబడులు 5 రెట్లు పెరిగి 2,88,263 కోట్ల రూపాయలకు చేరాయి. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం 10.21 లక్షల కోట్ల రూపాయలను ఈ కాలంలో ఖర్చు చేసింది. కాగా, ఈ సంక్షేమ అవసరం కోసం 8 సంవత్సరాలలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి దక్కింది 47,312 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది మొత్తం రాష్ర్ట సంక్షేమ వ్యయంలో 4.6 శాతం మాత్రమే.
ఇలా చెప్తూ పోతే అనేక గణాంకాలను ఉటంకించవచ్చు. కాబట్టి నేటి ప్రపంచంలోని రెండు పరస్పర విరుద్ధ ఆర్థిక నమూనాలకూ, ఆలోచనలకూ ఈ రెండు బడ్జెట్లు, అంటే కేంద్ర బడ్జెట్ అలాగే తెలంగాణ బడ్జెట్లు ప్రతినిధులుగా ఉంటాయి. ఈ క్రమంలో తెలంగాణలో జరిగిన గణనీయమైన పురోగతి మరోపక్కన ఇక్కడి ప్రజలలో మరిన్ని సరికొత్త ఆకాంక్షలను కూడా కలిగించింది. నెరవేరిన అభివృద్ధి లక్ష్యాలు, అలాగే సరికొత్తగా మేలుకొన్న ఈ ఆకాంక్షల మధ్య అనివార్యంగా కొంత గ్యాప్ లేదా ఖాళీ ఉంది. ఈ ఖాళీ జాగలోకే ఉత్త ఖాళీ మాటలు.. ఖాళీ డబ్బాలు చొరబడుతున్నాయి. జరుగుతున్న దానినీ.. జరిగిన దానిని వదిలేసి… ఈ ఆకాంక్షల జాగ లోకి చొరబడి ఉత్త ఖాళీ డబ్బాల శబ్దాలతో హడావుడి చేయడం, నేడు కేంద్రంలో సంక్షే మానికి నీళ్లొదిలేసిన బీజేపీ తాలూకు రాష్ట్ర నేతలు కూడా చేయగలుగుతున్నారంటే అది నిజంగా సాహసమే! కళ్లుండి, చెవులుండీ అన్నీ చూస్తూ.. వింటూనే ఉన్న జన సామాన్యాన్ని పరిహసించే సాహసం అది..!
ఈ ఎనిమిదేండ్లలోనే.. దాదాపు రెండున్నర రెట్లకు పైగా పెరిగిన తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం, రెట్టింపైన వారి విద్యుత్ శక్తి విని యోగం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య 8 లక్షలను దాటడం, ఈ సంఖ్య త్వరలోనే 10 లక్షలను దాటుతుందనే అంచనా ఇటువంటివి తార్కాణాలు తెలంగాణలో వేగంగా జరు గుతున్న ఆర్థిక పురోగతికి అద్దం పట్టేవే.
నేటి ప్రపంచంలోని రెండు పరస్పర విరుద్ధ ఆర్థిక నమూనాలకూ, ఆలోచనలకూ ఈ రెండు బడ్జెట్లు, అంటే కేంద్ర బడ్జెట్, అలాగే తెలంగాణ బడ్జెట్ ప్రతినిధులుగా ఉంటాయి. ఈ క్రమంలో తెలంగాణలో జరిగిన గణనీయమైన పురోగతి మరోపక్కన ఇక్కడి ప్రజలలో మరిన్ని సరికొత్త ఆకాంక్షలను కూడా కలిగించింది.
డి.పాపారావు: 98661 79615