2001లో ఉమ్మడి రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పనయిపోయినట్టేనని నిరాశా నిస్పృహ లు ఆవరించిన కాలంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. మరోవైపు విద్యుత్తు ఉద్యమం. పెంచిన విద్యుత్తు చార్జీ లు తగ్గించాలని వామపక్షాల నాయకత్వంలో ఉద్యమిస్తే రైతులపై కాల్పులు జరిపారు. దాంతో డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ నిరసనగా ముఖ్యమంత్రికి లేఖ రాసి, తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఒకవైపు రైతుల ఉద్యమం, మరోవైపు తెలంగాణ ఉద్య మం. పరిస్థితులు చేయి దాటాయి. అదే సమయంలో నాటి సీఎం చంద్రబాబుపై అలిపిరిలో నక్సల్స్ దాడి చేశారు. ఆ దాడిని సానుభూతిగా మార్చుకోవాలని ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు చంద్రబాబు. కానీ బాబు అనుకున్నట్టు ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికలు ప్రకటించలేదు. అసలే ఉద్యమాలు, మరోవైపు వరుసగా నాలుగేండ్లు కరువు, ఆపద్ధర్మ ప్రభుత్వంతో ఎన్నికలకు వెళ్లిన బాబు ఘోరంగా ఓడిపోయారు. కాంగ్రెస్ , టీఆర్ఎస్, వామపక్షాల కూటమి విజయం సాధించింది.
నాలుగేండ్ల కరువు గతంలో ఎప్పుడూ లేదు. ఏ ప్రభు త్వం అధికారంలో ఉన్నా అంత కరువును ఎదుర్కోలే దు. ఈ పరిస్థితులన్నీ కలిసి 2004లో ప్రాంతీయ పార్టీని ఓడించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చాయి. రాష్ట్రంలో నెలకొన్న కరువు, తీవ్రమైన పరిస్థితుల వల్ల 2004లో గెలిస్తే , ఐదేండ్ల పాలనలో ప్రవేశపెట్టిన వివిధ పథకాల వల్ల 2009లో తిరిగి కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో గెలిచింది.
2009 ఎన్నికల వరకు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు మాత్రమే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే టీఆర్ఎస్ 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణ ఏర్పడినా 2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ 62 స్థానాల్లో గెలిచింది. టీఆర్ఎస్కు అన్ని స్థానాలు వస్తాయని చాలామంది తెలంగాణ వాదులు కూడా ఊహించలేదు. ఒంటరిగానే గెలుస్తాం, టీఆర్ఎస్తో పొత్తంటే కొన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుందని కాంగ్రెస్ అగ్రనాయకత్వం పొత్తుకు, టీఆర్ఎస్ కలయికకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ నిర్లక్ష్యమే తెలంగాణకు, టీఆర్ఎస్కు మేలు చేసింది.
2014లో టీఆర్ఎస్ 62 స్థానాలు గెలిస్తే, 2018లో కాంగ్రెస్ టీడీపీ, వామపక్షాలతో కలిసి మహాకూటమిగా వచ్చింది. 62 సీట్లు కాస్తా టీఆర్ఎస్కు 88 అయ్యాయి. 2014 కన్నా ఐదేండ్ల పాలనతో టీఆర్ఎస్ తెలంగాణలో మరింత బలపడింది. కుటుంబపాలన అంటూ 2014 లో ఇవే విమర్శలు. తమ వర్గం వారిని అరెస్టు చేశారని ఓ సామాజిక వర్గం, మాకూ అధికారం కావాలని మరో సామాజిక వర్గం విమర్శలు చేయవచ్చు, హడావుడి చేయవచ్చు. కానీ, సామాన్యుల ఆలోచనలు, వారు స్పందించే తీరు, ఓటు వేయడానికి, వ్యతిరేకించడానికి కారణాలు వేరుగా ఉంటాయి. వృద్ధాప్య పింఛన్లు, రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య తక్కువేమీ కాదు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు వీటి ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయద్దు. ఫలితాలను వీళ్లే నిర్ణయిస్తారు. వీళ్లేమీ రోజూ టీవీలో కనిపించి విశ్లేషణ చేయరు. కానీ, ఓటు ద్వారా కృతజ్ఞత చూపిస్తారు.
సామాజిక మాధ్యమాలు పెరిగాక ఎవరికి వారే సర్వేలంటూ ఏవో లెక్కలు ప్రకటిస్తున్నా.. ఒకవైపు మంచి వర్షాలు, కళకళలాడుతున్న చెరువులు, ప్రాజెక్టులు, సం క్షేమ పథకాలతో తెలంగాణలో పాజిటివ్ వాతావరణం ఉన్నది. కాంగ్రెస్కు కలిసిరావడానికి రాష్ట్రంలో కరువు లేదు, ఆ పార్టీకి బలమైన నాయకత్వమూ లేదు. అందుకే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఎలాంటి అడ్డంకులు లేవు.
-బుద్దా మురళి