వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండటంతో ఇక్కడ ప్రధాన నదులైన గోదావరి, కృష్ణ పారుతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిపైన ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించలేదు. దీంతో తెలంగాణ వ్యవసాయం పూర్తిగా వర్షం, బోరుబావుల పైన ఆధారపడి వ్యవసాయం నడిచింది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటికి తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం సుమారు ఒక కోటి 25 లక్షల (ప్రస్తుతం తెలంగాణలో 25,62,623 బోర్ వెల్స్ నడుస్తున్నట్టు టీఎస్ఎన్సీడీజీఎన్ 2019-20 వెల్లడించింది.) బోర్లు వేసినట్టు ఒక అంచనా. బోర్లలో నీళ్లు పడక నీళ్లు పడితే కరెంటు లేక పొలాలు ఎండిపోయి నిత్యం తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, కరెంటు చావులతో వ్యవసాయం కొనసాగింది. కాకతీయులు, నిజాం రాజులు తవ్వించిన సుమారు 46,531 చెరువులు, కుంటలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరాదరణకు గురవ్వడంతో చెరువులన్నీ పూడిక నిండి తాంబాలంలాగా మారాయి. వాటిని మిషన్ కాకతీయ పేరుతో పునరుద్ధరించుకున్నాం. సుమారు ఒక లక్షాయాభై వేల కోట్ల రూపాయలతో గోదావరి, కృష్ణ నదులపైన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు నిర్మించుకొని ఈరోజు ఎక్కడ చూసినా తాగునీరు, సాగునీరు కనబడుతున్నది. ఒకప్పుడు దండుగ అన్న వ్యవసాయం ఇప్పుడు పండుగగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక కరెంటు మోటర్లు పెట్టబోయిన వ్యవసాయదారులు కరెంటు షాక్లతో చనిపోవడం, మోటర్లు, స్టార్టర్లు కాలిపోయేవి. కానీ 2018 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేయడంతో పాటు సాగునీరు ఇవ్వడంతో ఇవాళ వ్యవసాయం ఒక పండుగలా మారింది.
ఒకనాటి తెలంగాణ పరిస్థితులకు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామల పల్లికి చెందిన చింత అంజయ్య అనే రైతు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నడు. ఆయన వయస్సు ఇప్పుడు 65 ఏండ్లు. యువకుడిగా ఉన్నప్పటి నుంచి వ్వవసాయమే చేస్తున్నడు. ఎవుసానికి నీటి వసతి లేకపోవడంతో గడచిన 25 ఏండ్లలో 40 బోర్లు వేసిండు. బోర్లు ఏసి ఏసి చింత అంజయ్య బోర్ల అంజయ్య అయిపోయిండు. అలాంటిది గడచిన ఆరేడేండ్ల నుంచి బోర్లు ఏసుడు మానేసిండు. కారణం తెలంగాణ వచ్చాక పెరిగిన నీటివనరులు. ఆయన భూమిలో ఇప్పుడు మూడు బోర్లు నిండుగా నీళ్లు పోస్తున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రామంలోని చెరువులు, కుంటలన్నీ నింపడంతో ఎండాకాలంలో మత్తళ్ల్లు దుంకుతున్నాయి. ఒక బోర్తో ఆయనకున్న ఐదు ఎకరాల పొలం పారుతుంది. మరో రెండు బోర్లతో ఐదు ఎకరాలు కాస్తు చేస్తున్నడు. తెలంగాణ వచ్చాక నీటి వనరులు పెరగడంతో వ్యవసాయం పండుగైందని అంజయ్య సంతోషిస్తున్నడు.
మెదక్ జిల్లా, మండలం, గ్రామం పెద్ద నిజాంపేట గ్రామానికి చెందిన విట్టల్ గౌడ్ది పరిస్థితి కూడా అలాంటిదే. ఆయన 30 బోర్లు వేశాడు. అయినా పంటలు పండక ఆయనకున్న 15 ఎకరాల్లో ఐదు ఎకరాలు అమ్ముకున్నడు. ప్రస్తుతం కూడవెళ్లి వాగు పక్కన 10 ఎకరాల పొలం ఉన్నది. గత మూడు ఏండ్లుగా మల్లన్న సాగర్ నీళ్లతో వాగు పొంగిపొర్లుతుండడంతో ఆయనకున్న 10 ఎకరాల పొలంలో రెండు పంటలు పండిస్తున్నడు.
ఇలాంటి కథలెన్నో ఇప్పుడు తెలంగాణ గడపగడపకూ కనిపిస్తున్నాయి. కాళేశ్వరం మూలంగా నీటి వనరులు పెరగడంతో వ్యవసాయం పండుగ అయింది. తెలంగాణ వచ్చాక రాష్ట్ర వ్యవసాయంలో సమూల మార్పులు వచ్చాయని రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేసీఆర్ రైతు ప్రభుత్వమే ముచ్చటగా మూడోసారి రావాలని కోరుకుంటున్నారు.