దిగుమతులపై దేశాలు సుంకాలు విధించడం కొత్తకాదు. కానీ వాటిని ఆయుధీకరించడమే అసలు సమస్య. ఇతర దేశాలను బెదిరించి లొంగదీసుకోవడానికి, దారికిరాని దేశాలను శిక్షించడానికి సుంకాలను వాడుకోవడం మొదటినుంచీ అమెరికాకు అలవాటే. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ అలవాటు గాడితప్పి ప్రపంచ ఆర్థికరంగాన్ని డోలాయమానంలో పడేసింది.
భారత్ విషయమే తీసుకుంటే 2.7 శాతమున్న సుంకాలను ట్రంప్ పాతిక శాతానికి పెంచడమే కాకుండా, అదనంగా రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ‘ప్రతీకారంగా’ మరో పాతిక శాతం, మొత్తం 50 శాతం సుంకాన్ని బాదారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని, 18 శాతం టారిఫ్కు భారత్ అంగీకరించిందని ఇటీవల ప్రకటనలు కూడా వెలువడ్డాయి. తాజాగా వెలువడిన అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ‘పరమపద సోపానపటం’ ఆటకు తెరదించినట్టయింది.
అధ్యక్షుడు ఇష్టారాజ్యంగా సుంకాలు వేయడానికి వీల్లేదని, ఆ అధికారం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉన్నదని సుప్రీంకోర్టు నొక్కిచెప్పడం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే.. అధ్యక్ష ప్రత్యేక అధికారాల చట్టం కింద ట్రంప్ సుంకాలు బాదుతూ పోయారు. అయితే ఆ అధికారాలు కేవలం యుద్ధ సమయాల్లో లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ప్రజాస్వామిక విధానంలో పరిపాలనా వ్యవస్థపై న్యాయవ్యవస్థ ములుగర్ర ఎంత ముఖ్యమైందో ఈ ఉదంతం మనకు స్పష్టం చేస్తున్నది.
అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ఇచ్చిన తీర్పు వల్ల భారత్, బ్రెజిల్, చైనా వంటి దేశాలకు ఉపశమనం కలుగుతుంది. అయితే అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా ట్రంప్ తన మొండివైఖరిని విడనాడలేదు. పైగా ఓవైపు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై విమర్శలు సంధిస్తూ మరోవైపు సుంకాలను దొడ్డిదారిన పెంచేందుకు కసరత్తు చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. 1974 వాణిజ్య చట్టం కింద 150 రోజుల కాలవ్యవధికి తాత్కాలిక ప్రాతిపదికన 10 శాతం సుంకం వేయనున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
మరుసటిరోజు దీనిని 15 శాతానికి పెంచనున్నట్టు తేల్చిచెప్పడం అమెరికా వాణిజ్యంలోని అస్థిర పరిస్థితిని తెలియజేస్తున్నది. ఏది ఏమైనప్పటికీ వెయిటెడ్ యావరేజీ ప్రకారం ఇది 12 శాతానికి తగ్గుతుందని అంటున్నారు. మనదేశంలో అమెరికా సుంకాల వల్ల కుదేలైన టెక్స్టైల్, వజ్రాల తయారీ వంటి అధిక ఉపాధి కలిగించే రంగాలు సంక్షోభం నుంచి బైటపడే అవకాశాలు ఆ తీర్పువల్ల మెరుగుపడతాయని కచ్చితంగా చెప్పవచ్చు.
సుప్రీంకోర్టు తీర్పుతో అమెరికా సుంకాల సమస్య పూర్తిగా తొలిగిపోయిందని చెప్పలేము. ఇది తాత్కాలిక విరామమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. ట్రంప్ ప్రకటనలతో అమెరికాతో వాణిజ్యం అంటేనే ప్రపంచ దేశాలు జడుసుకునే పరిస్థితి ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలో అమెరికా ఒంటెత్తు పోకడలపై ప్రపంచ దేశాల్లో పునరాలోచన మొదలైంది. అమెరికాతో వాణిజ్య చర్చలకు భారత్ తాత్కాలిక విరామం ప్రకటించడం విశేషం. తక్కువ సుంకాలకు అవకాశం ఉన్నప్పుడు ఒప్పందం పేరిట ఎక్కువ సుంకాలను మోయడం దేనికనే ఆలోచన దీని వెనుక ఉన్నట్టు తెలుస్తూనే ఉన్నది.
అయితే ఈ చెడుగుడు ఆటకు ఓ పరిష్కారం అంటూ ఉండాలనేది కొన్ని దేశాల అభిప్రాయం. దేశాలు విడివిడిగా కాకుండా, సమూహాలుగా ఏర్పడి అమెరికాతో వాణిజ్య చర్చలు జరపాలని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా దాసిల్వా చేసిన సూచన కొత్తబాటను సూచిస్తున్నది. యూనియన్గా ఏర్పడాలనేది ఆయన మాటల సారాంశం. నిజానికి గాట్, డబ్ల్యూటీవో వంటి బహుళపక్ష వాణిజ్య వేదికలు అమెరికా ఒంటికొమ్ము సొంటికాయ విధానాల వల్ల అవసాన దశకు చేరుకున్నాయి. యూనియన్గా ఏర్పడటమంటే మరోసారి బహుళపక్ష వేదికలకు మళ్లడమే అని అర్థం. ప్రపంచ దేశాలు దీని గురించి ఆలోచించాలి.