దశాబ్దాలుగా దేశంలో వ్యవసాయం సహా అన్ని రంగాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో స్థానిక సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధికి కొత్తకోణం చూపడంలో ప్రాంతీయ పార్టీలకు అవకాశాలు లభించాయి. ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అనే అంశంపై చర్చ సాగుతోంది. 2004, 2009లలో జాతీయ ప్రభుత్వాల ఏర్పాటు, పాలనలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఇకపై ప్రాంతీయవాదం దేశాభివృద్ధికి ఆటంకంగా పరిగణించే పరిస్థితులు లేవు.
గత సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని జాతీయ, ప్రాంతీయపార్టీలతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయినా వ్యవసాయ సమస్యలకు పరిష్కారాలు దొరకకపోవడం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలు దేశీయ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏలోని పార్టీలు బీజేపీకి దూరమవుతున్నాయి. ఇదే అవకాశంగా కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు జాతీ య స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించాలని భావిస్తున్నారు.
లోక్సభలో 300 సీట్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో అధికార బీజేపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలలో వ్యవసాయ సంక్షోభం ఒకటిగా తేలింది. అందుకే బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు రైతు అనుకూల విధానాలతో ముందుకు రావాలి.
అధిక ధరలు, వాతావరణ మార్పులు, రుణభారంతో వ్యవసాయ రంగం కొట్టుమిట్టాడుతున్నది. చిన్న కమతాలు కలిగిన రైతుల్లో 80 శాతం మందిని ఈ పరిస్థితులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సాగునీటిని పెంచి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపవచ్చు. దేశంలోని వ్యవసాయ వైవిధ్య పరిస్థితుల కనుగుణంగా రాష్ర్ట ప్రభుత్వాలు తమ ప్రాంతీయ కార్యాచరణను అమలు పరుచుకోవటానికి కేంద్రం సహకరించడంలేదు. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలు రైతులను ఈ దిశగా సంఘటిత పరచి పరిష్కారాలను చూపడం నేటి చారిత్రక అవసరం. కేసీఆర్, మమతా బెనర్జీ, శరద్పవార్ లాంటి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు వ్యవసాయ రంగ సమస్యలపై పోరాడుతూ దేశాన్ని కాపాడాలి.
2024సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి కాబట్టి ఈ దిశగా ప్రజలను సమాయత్త పరచడం ప్రాంతీయపార్టీలకు అనివార్యం. ప్రాంతీయ పార్టీలు స్థానిక సమస్యలకు వ్యవసాయ సంక్షోభాన్ని జోడించి రైతులను సంఘటిత పరిచి రాష్ట్రాలపై బలమైన పట్టును సాధించడం ఎంతో అవసరం. ఇది అంత సుసాధ్యం కాకున్నా వివిధ ప్రాంతీయ పార్టీలు, అన్ని రాష్ట్రాల రైతులతో దీర్ఘకాలిక సంబంధాలు నెలకొల్పుకుంటూ భాగస్వామ్య ఉద్యమాలతో జాతీయ స్థాయిలో ముందుకు పోవాలి. దేశ వ్యవసాయ విధానాన్ని మౌలికంగా మార్చడానికి ఇది అత్యంత ఆవశ్యం. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు తెలంగాణ రాష్ర్టంలో జరిగిన అభివృద్ధి ఆధారంగా విలక్షణమైన పాలనా నమూనాను రూపొందించుకోవడానికి కృషి చేయాలి. తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు లాంటి వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు దేశమంతా అమలు చేయాలని ప్రాంతీయ పార్టీలు గొంతెత్తుతూ, ఐక్యతతో లక్ష్యం సాధించాలి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయ సాధనతో ప్రాంతీయ పార్టీలను, కొన్ని ప్రాంతాలకే పరిమితమైన జాతీయ రాజకీయ పార్టీలను రైతాంగ సమస్యల ఆధారంగా ఏకతాటిపై తెచ్చేందుకు కేసీఆర్ చేస్తున్న కృషి స్వాగతించదగినది.
(వ్యాసకర్త: డైరెక్టర్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ )
-ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ జువ్వాడి