బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతున్నపుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తనకేమీ పట్టనట్టు వ్యవహరించారు. ఆయన స్థానంలో తననే నియమిస్తారనీ ఊహించి ఉంటే బండి వ్యతిరేక శిబిరానికి మద్దతు ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఆయన పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అయిందని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
‘ప్రధాని మోదీని రేవంత్రెడ్డి ఎప్పుడైనా పల్లెత్తు మాటన్నారా?’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడే కాదు, మోదీ ప్రధాని కాకమునుపు 2014 ఎన్నికల సమయంలోనూ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డి, మోదీని ప్రధాని, చంద్రబాబును ఉప ప్రధాని చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు బీజేపీలో ఉన్న నాగం జనార్దన్రెడ్డి వద్దకు వెళ్లి తన ప్రతిపాదనపై పార్టీలో చర్చించాలని రేవంత్ కోరారు. మోదీ, బాబు కండ్లల్లో ఆనందం కోసం అప్పటినుంచి రేవంత్ కృషిచేస్తూనే ఉన్నారు. అప్పట్లో టీడీపీ, బీజేపీలు పూసుకుతిరిగాయి కదా? రేవంత్ ఆ అనుబంధాన్ని ఎలా మర్చిపోతారు?
ఉద్యోగం లేక నిరుద్యోగులు గడ్డాలు, మీసాలు పెంచుకొని రోడ్ల మీద తిరుగుతున్నారని ఖమ్మం సభలో భట్టి విక్రమార్క అనగానే వేదికపై ఉన్నవారంతా భట్టి వైపు ఒక్కసారి చూశారు. మన నాయకుడు రాహుల్గాంధీ కూడా రాజకీయ నిరుద్యోగిగా గడ్డాలు, మీసాలు పెంచుకొని తిరుగుతున్నారు. ఆ విషయం గ్రహించి మాట్లాడితే బాగుండేదని భట్టి వైపు గుర్రుగా చూసిన నేతల కవి హృదయమై ఉండవచ్చు.
ఎన్నికల నిర్వహణ కమిటీ అనేది ఇప్పటివరకు బీజేపీలో లేదట. మరి ఈటల రాజేందర్కు ఇచ్చారు కదా అని బండి సంజయ్ బ్యాచ్ను అడిగితే.. ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నికల కమిషన్ చేసే పని అని చెప్తున్నారు. మరి ఈటల ఏం చేస్తారని ప్రశ్నిస్తే.. పార్టీ పరంగా పోల్ చిట్టీలు ముద్రించడం, ఓటర్లకు పంచడం, పోలింగ్ బూతుల్లో ఏజెంట్లను నియమించడం ఎక్సట్రా అని చెప్పారు. పాపం ఈ విషయం తెలియక టికెట్లు ఇచ్చేది ఈటల అనే భ్రమల్లో ఉన్నారు టికెట్ ఆశించే నేతలు.
– వెల్జాల