పాలస్తీనా సమస్యపై ఇటీవల అంతర్జాతీయంగా రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో మొదటిది, ఐక్యరాజ్య సమితిలో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే ప్రయత్నాలు మరోసారి ఊపందుకోవడం. రెండోది, పలు దేశాలు పాలస్తీనాకు దౌత్యపరంగా గుర్తింపు ఇవ్వడం. చిరకాలంగా ఇజ్రాయెల్ చేతుల్లో పీడనకు, గాజా యుద్ధంతో నరమేధానికి గురవుతున్న పాలస్తీనా ప్రజల హక్కుల పరిరక్షణలో ఇవి చాలావరకు సహాయకారి అవుతాయని చెప్పవచ్చు. పాలస్తీనాకు ఐరాసలో ప్రస్తుతం పరిశీలక హోదా మాత్రమే ఉన్నది. ఓటుహక్కు రావాలంటే శాశ్వత సభ్యత్వం ఉండాలి. ఈ నేపథ్యంలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని సర్వ ప్రతినిధి సభ మే 10న భారీ మెజారిటీతో తీర్మానం చేసింది. అనుకూలంగా 143 ఓట్లు, వ్యతిరేకంగా 9 ఓట్లు పడటం గమనార్హం. 25 దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు. సుదీర్ఘకాలం పాలస్తీనీయులకు సంఘీభావంగా నిలిచిన భారతదేశం సహజంగానే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది.
ఈ పరిణామాల పట్ల ఇజ్రాయెల్ తీవ్ర అసహనానికి గురవుతున్నది. తీర్మానాన్ని అడ్డుకునేందుకు విఫలయత్నం చేసిన ఇజ్రాయెల్ ప్రతినిధి.. సర్వ ప్రతినిధి సభలో ఆగ్రహావేశాలతో ఊగిపోతూ, ఐరాస చార్టర్ ప్రతిని చించివేసి నిరసన తెలిపారు. మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న మౌలిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఈ తరహా ప్రవర్తన ఏమాత్రం సరిపడదు. అమెరికా సరఫరా చేస్తున్న ఆయుధాలను అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధంగా ఆక్రమిత పాలస్తీనాలోని ప్రజల అణచివేతకు ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్నదనే ఆరోపణల గురించి తీర్మానంలో ప్రస్తావించకపోవడం విమర్శలకు తావిచ్చింది. రకరకాల ఒత్తిళ్ల ఫలితంగా తీర్మానం కుదింపులకు లోనైంది.
ఈ తీర్మానంతో ఉన్నపళంగా పాలస్తీనాకు ఐరాస శాశ్వత సభ్యత్వం లభిస్తుందని చెప్పలేం. ప్రస్తుత పరిశీలక హోదాతో దఖలుపడిన హక్కులకు అదనంగా మరికొన్నిటిని కల్పించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అదేవిధంగా సంపూర్ణ సభ్యత్వం కల్పించాలని భద్రతామండలికి సిఫారసు చేశారు. దీనిపై మండలి సానుకూల నిర్ణయం తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది. అయితే మండలిలో ఈ వ్యవహారం అంత సులభంగా తెమిలే సూచనలు కనిపించడం లేదు. ఇదివరకే ఓసారి వీటోతో అడ్డుకున్న అమెరికా మరోసారీ అదే పని చేస్తానని హెచ్చరిస్తుండటమే అందుకు కారణం.
మరో విడత తీర్మానం ఐరాసలో ఆమోదం పొందిన కొద్దిరోజులకే స్పెయిన్, ఐర్లాండ్, నార్వే దేశాలు పాలస్తీనాకు దౌత్యపరంగా గుర్తింపునిచ్చేందుకు ముందుకు రావడం సానుకూల పరిణామం. మాల్టా, స్లొవేనియా కూడా అందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఐరాస సభ్యత్వ తీర్మా నం, ఐరోపా దేశాల ‘గుర్తింపు’ నిర్ణయం వల్ల తక్షణ ఫలితాలు ఉండకపోవచ్చు. కానీ, అంతకంతకూ ఇజ్రాయెల్ ఏకాకిగా మారుతున్నదనడానికి, పాలస్తీనాకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు పెరుగుతున్నదనడానికి ఇవి సూచికలుగా నిలుస్తాయి. 1948 నుంచి నలుగుతున్న ఈ సమస్యను ఇప్పటికైనా కొలిక్కి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత పాలస్తీనా ప్రాధికార సంస్థను సార్వభౌమాధికార ప్రభుత్వంగా ఆవిష్కరించడం ఒక్కటే పశ్చిమాసియా సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వగలదు.