Telangana | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూమి కేటాయించి బీసీ బాంధవుడిగా నిలిచారు ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భావించిన తెలంగాణ ప్రజలు రెండు పర్యాయాలు కేసీఆర్కు అవకాశం ఇచ్చారు. ఈ తాపకు కూడా అవకాశం ఇస్తే బీసీల ఆర్థికాభివృద్ధి మరింత పెరుగుతుందని బీసీ సంఘాలు భావిస్తున్నాయి.
దేశాన్ని పాలిస్తున్న బీజేపీ బీసీ కులగణనకు వెనుకడుగు వేస్తూ వివక్షను ప్రదర్శిస్తున్నది. రాష్ట్ర బీజేపీ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఏం చేయలేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. తద్వారా బీసీ ఓటుబ్యాంకును కొల్లగొట్టాలని వెంపర్లాడుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ బీసీలను మచ్చిక చేసుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. గత అరవై ఏండ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీసీలకు చేసిందేమీ లేదు. కానీ, మళ్లీ అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నది. తెలంగాణ ప్రభుత్వం బీసీల ఆర్థిక స్వావలంబన కోసం కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చింది. 2022-2023 బడ్జెట్లో బీసీలకు రూ.6,225 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో బీసీ కులాల ఆత్మగౌరవానికి అనేక పథకాలను అమలుచేస్తున్నది. అంతేకాకుండా కేసీఆర్ నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నది. దానిలో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించింది.
మహిళలు ఆర్థికంగా స్థిరపడినప్పుడే కుటుంబం, దేశం బాగుంటుందనీ… మహిళా ఆర్థికాభివృద్ధ్దే ధ్యేయంగా గ్రామీణ మహిళలకు నిఫ్ట్లో శిక్షణ ఇస్తున్నది. 25 మంది సభ్యులను ఒక యూనిట్గా ఏర్పరిచి ప్రతి ఒక్కరికి కుట్టు మెషిన్లతో పాటు అన్నిరకాల యంత్రాలను అందించాలని నిర్ణయించింది. మహిళా సంఘాలకు డ్వాక్రా రుణాలు మంజూరు చేస్తున్నది. కల్యాణలక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలబడుతుంది.
నేడు కొంతమంది నాయకులు స్వార్థ రాజకీయాల కోసం బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కేసీఆర్పై ఎన్ని విమర్శలు చేసినా బీసీలు కేసీఆర్ వెంటే ఉంటారనడానికి గత ఎన్నికల ఫలితాలే నిదర్శనం. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక బీసీలకు విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం కల్పించింది నిజం కాదా? బీసీ మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిస్తూ జీవనోపాధి కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. బీసీ విద్యార్థుల కోసం బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి కార్పొరేట్కు దీటుగా విద్యనందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభు త్వానిదే. బీసీ జూనియర్ కాలేజీలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్ సర్వీసెస్, గ్రూప్-1,2 ఇతర కేంద్ర, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణనిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం.
బీసీలు సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి బీసీ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. బీసీ సమాజం కోసం పోరాడిన మహనీయుల జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నది. బీసీ కులాలైన గొల్లకుర్మలకు గొర్లు, బెస్త, ముదిరాజులకు చేప పిల్లల పంపిణీ, గీత, చేనేత కార్మికులకు చేయూతనందిస్తున్నది. చేతివృత్తుల వారికి రుణాలు మంజూరు చేస్తూ కుటీర పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నది.
వెనుకబడిన తరగతుల కులాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పరేషన్ ఏర్పాటుచేసి వెయ్యి కోట్లు నిధులు కేటాయించి చైర్మన్ను నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా లాండ్రీలు, ధోబీఘాట్లకు, సెలూన్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు ఉచిత 24 గంటల విద్యుత్ను అందిస్తున్నది తెలంగాణ సర్కారు. వ్యవసాయానికి విత్తనాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ సామగ్రిలో రాయితీ, రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలతో రైతుల ఆరికాభివృద్ధికి కృషి చేస్తున్నది. బీసీలు ఆర్థిక, రాజకీయ, సామాజికంగా ఎదగాలని వారి సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తున్నది.
-మిద్దె సురేష్
97012 09355