‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక టీఆర్ఎస్కు రెలవెన్స్ ఏముంటుంది?’
2014లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ వ్యవహారాలు చూసిన దిగ్విజయ్సింగ్ చేసిన వ్యాఖ్య ఇది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టింది కాబట్టి.. రాష్ట్రమే ఏర్పాటైన తర్వాత ఆ పార్టీ కొనసాగే అవకాశం లేదని, కేసీఆర్ పాత్ర ముగిసిపోయిందని ఆయన వ్యాఖ్యల సారాంశం. అందువల్ల కాంగ్రెస్లో టీఆర్ఎస్ను విలీనం చేసుకోవడం లేదా పొత్తు పెట్టుకోవడం అవసరమే లేదని, తెలంగాణ వచ్చింది కాబట్టి టీఆర్ఎస్కు భవిష్యత్తే లేదని ఆయన ఆలోచన. కానీ, రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి. ఎవరో ఏదో ఊహించుకొని.. సూత్రీకరించుకొని.. దానికి ఏవో నాలుగు ఉదాహరణలు, తమ బుర్రకు తోచిన నాలుగు ఊహాజనిత కల్పనలు తగిలించినంత మాత్రాన అవే నిజాలైపోవు. అవే భవిష్యత్తూ కావు.
దిగ్విజయ్ సింగ్ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో.. అందుకోసమే పుట్టినప్పటికీ టీఆర్ఎస్ రెలవెన్స్ లేకుండాపోలేదు. కేసీఆర్ ఉనికి మాయమైపోనూ లేదు. కాంగ్రెస్ పార్టీ వాచాలత్వం రాష్ట్ర సాధన దగ్గర ఘనీభవించిపోతే.. రాష్ట్ర పునర్నిర్మాణం అనే సుందర స్వప్నాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఆయన రాష్ట్రం సాధించినవాడు కాబట్టి పునర్నిర్మాణం కూడా ఆయనే చేయగలరని ప్రజలు కూడా నమ్మారు. రాష్ట్రం ఎలాగూ ఇచ్చేసింది కాబట్టి అసలు కాంగ్రెస్కే రెలవెన్స్ లేదని కూడా ప్రజలు తీర్మానించుకున్నారు. మొత్తంగా దిగ్విజయ్ చెప్పిన రెలవెన్స్ అనే కథ పూర్తిగా మారిపోయి ఎదురు తన్నింది. చాలామంది విద్యావంతులకు రాజకీయాల పదును.. రాజకీయ నాయకుల శక్తి అర్థం కాదు. బహుశా విద్యావంతులమనే అహం తెచ్చిన బలహీనత అది.
Telangana | భారత రాజకీయాల్లో.. ఇక ముగిసిపోయినట్టే అనిపించుకున్న అనేక పార్టీలు, నాయకులు, ఉద్యమాలు భస్మం నుంచి ఫీనిక్స్ పక్షులై లేచిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎంతోదూరం అక్కర్లేదు. 1969లో నిలిచిపోయి ఆ తర్వాత ఎన్టీఆర్, వైఎస్, చంద్రబాబుల హయాంతో ఆ మాట కూడా వినిపించకుండా ‘ఇంకేం తెలంగాణ? శాశ్వతంగా తెరపడింది’ అనుకున్న రాష్ట్ర నినాదం, ఉద్యమమై పురుడుపోసుకొని, రాజకీయ ప్రభంజనమై, దేశాన్ని కుదిపేసి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంగా సాక్షాత్కారమైన ఉదంతం కండ్లముందే ఉన్నది. అలాగే వందేండ్ల నాటి వివాదం అయోధ్య రామాలయ వివాదం.
తాళాలు వేసి మూసేసిన ఆ ప్రాంగణం తిరిగి తెరుచుకుంటుందని నెహ్రూ, ఇందిర హయాంలో ఎవరన్నా ఊహించారా? ఆ ఆలయ నినాదమే దేశ రాజకీయాలను సమూలంగా మార్చివేస్తుందనీ అనుకున్నారా? ఒక కాంగ్రెస్ ప్రధానే స్వయంగా తాళాలు తెరవమని ఆదేశాలు ఇస్తాడనుకున్నారా? ఒక కాంగ్రెస్ ప్రధాని ఉన్నప్పుడే ఆ వివాదాస్పద కట్టడం నేలమట్టం అవుతుందనుకున్నారా? ఆ ఆలయ నినాదం నుంచి పుట్టిన సంఘటనల పర్యవసానంగా ఒక విపక్షం అయోధ్యలో రామాలయం అనే నినాదంతో ఢిల్లీ గద్దెమీద పాతుకుపోతుందనుకున్నారా? సిద్ధాంతీకరణలు.. సూత్రీకరణలు మనకు నచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. కానీ చరిత్ర చాలా గడుసుది. ఎవరి ఊహలకు అందనిది. చరిత్రకు ఆవృతాలు, పునరావృతాలు ఉంటాయి నిజమే. అయితే ప్రతీసారి చరిత్ర పునరావృతం కాదు. నాదెండ్లది, చంద్రబాబుది రెండూ వెన్నుపోట్లే. కానీ, ఒకటి అపజయం పొందితే రెండోది విజయం సాధించింది.
ఈ మధ్య చాలామంది పాత్రికేయులు బీఆర్ఎస్కు సుద్దులు చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న్లైనా కాలేదు, మూన్నెల్లు కాలేదు. అప్పుడే విమర్శలా? అనేది ఆ సుద్దుల సారాంశం. వాస్తవానికి వారు బీఆర్ఎస్ నాయకులకు సుద్దులు చెప్పడం లేదు. వారి బాగుకోసం కూడా చెప్పడం లేదు. ‘చూశారా? బీఆర్ఎస్ నాయకులు పాపం కాంగ్రెస్ ఇలా అధికారంలోకి రాగానే అలా దాడులు చేస్తున్నారు’.. అనే సందేశం ప్రజల్లోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ మీడియా ప్రచారాలతో ప్రజల మెదళ్లను తమ రిమోట్లోకి తీసుకొని అలాంటి భావన జొప్పించడానికి చూస్తున్నారు. ఇలాంటి పాత్రికేయులకు ఒక్కటే ప్రశ్న. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మీద, కరెంటు సమస్య మీద కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వానికి సమయమిచ్చే రోడ్ల మీద బీభత్సం సృష్టించాయా? రైతు రుణమాఫీపై ఒక మంత్రి అసంపూర్ణ సమాచారంతో చేసిన ఒక వ్యాఖ్య మీద రహదార్లు దిగ్బంధించి పోలీసుల తలలు పగులగొట్టి నెత్తురు చిందేలా చితకబాదిన ఉదంతం నిజం కాదా? ఆ వార్తలు పతాక శీర్షికలలో తనివితీరా పరిచి శునకానందాలు పొందిన వైనం వాస్తవం కాదా? మరి అప్పుడు ఆ నాయకులకు ఇలాంటి సుద్దులు నీతి బోధలేమైనా చేశారా? అంటే ఒక్క ముక్కా రాసిన పాపాన పోలేదు. మరి ఇప్పుడీ పల్లకీ మోతల రాతలెందుకు?
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తన ఉనికి కోసం పాకులాడుతున్నదట. దేశ రాజకీయాలు అవగాహన చేసుకున్న రాతలేనా ఇవి. మహారాష్ట్రలో శివసేన వంటి ప్రాంతీయ పార్టీ ఉన్నది. ఎన్సీపీ వంటి సెమీ జాతీయ పార్టీ ఉంది. ఇంకా ఆర్పీఐ, ఎమ్మెన్నెస్ వంటి స్థానిక పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలున్నాయి. అక్కడ ఏ ఎన్నికల్లో ఏ పార్టీ ఓటమి ఏ ప్రాంతీయ పార్టీని ఉనికే లేకుండా చేసింది? ఏ ప్రాంతీయ పార్టీ మాయమైపోయింది? ఏ ప్రాంతీయ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో రెలవెన్స్ లేకుండాపోయింది? బీజేపీ ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని చూస్తుందట. ఆ మాటకొస్తే ఏ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలను బతుకనిచ్చింది? కాంగ్రెస్ తన 60 ఏండ్ల ప్రస్థానంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలను మింగేసింది. అదేమన్నా పత్తిత్తా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ అస్థిరపరచకుండా ఉంటుందన్న గ్యారెంటీ ఏమన్నా ఉందా? 2019లో మధ్యప్రదేశ్లో అత్తెసరు మెజారిటీతో అధికారం చేపట్టిన కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏడాది తిరిగే సరికి కూల్చివేయలేదా? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే బలంగా ఏమన్నా ఉందా? అంతేనా? ఎన్నెన్ని కుప్పిగంతులు! కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు ఇబ్బంది లేదట.
ప్రభుత్వం కుదురుకున్నదట. ఇక పెరిగేదంతా కాంగ్రెసేనట. తరిగేదంతా బీఆర్ఎస్ అట. అందుకే బీఆర్ఎస్ తన ఉనికి కోసం ప్రకటనలు చేస్తున్నదట. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఇబ్బంది పెట్టదట. త్వరలో ఆ రెండు పార్టీలు మిలాఖత్ ఆరోపణలు వచ్చినా రావచ్చునట. పల్లకీ మోత అర్థమవుతూనే ఉన్నది. సరే.. పల్లకిలో కూర్చున్నవారు క్షేమంగా ఉండాలని బోయీలు కోరుకుంటారు. వారి అవసరం వారిది.
బీఆర్ఎస్కు భవిష్యత్తు శూన్యమైపోయిందట. ఐదేండ్ల తర్వాత ప్రజలు అధికారమిస్తారా? అనే భయం, అనుమానం వెంటాడుతుందట. ఏం రాతలు? భవిష్యత్తే శూన్యంగా కనిపించేంత దైన్యం బీఆర్ఎస్కు లేదు. ఆ పార్టీ భవిష్యత్తును మింగేసేంత ధైర్యం కాంగ్రెస్కూ లేదు. మొత్తం అసెంబ్లీలో 30 శాతం సీట్లు అనేది తక్కువ సంఖ్య కాదు. ఓవరాల్గా రాష్ట్రవ్యాప్తంగా రెండు పార్టీల మధ్య తేడా ఏదో అగాథాన్ని పూరించనంత పెద్దదీ కాదు. ఈడ్చికొడితే ఒకటిన్నర నుంచి రెండు శాతం. ఇక ఇతర పార్టీల వల్ల సమస్యా? అంటే అవి తెలంగాణ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. పైగా అనేక ఎన్నికల్లో ఆ రెండు విపక్షాలు కుమ్మక్కై పోటీ కూడా చేశాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో అది నగ్నంగా బయటపడింది కూడా. ఆ రాతలు చూడండి. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పార్లమెంటులో ఉండటం దానికి అవసరమట.
బీజేపీ ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి (ఎన్నికలే జరుగుతుంటే అధికారంలో ఎక్కడున్నట్టు?) దానికీ అవసరమట. ఎటొచ్చీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గెలిచి ఏం చేయగలుగుతుందనేది ప్రజల మెదళ్లలోకి జొప్పించదలుచుకున్న సందేశం. అదే నిజమైతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెలవెన్స్ ఏమిటి? కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో లేదు. మరి ఎందుకు పోటీ చేసినట్టు? అప్పుడు ఈ రెలవెన్స్ రాతలు రాయలేదేం? అది పక్కకు పెట్టినా వాగ్దానాలు నెరవేర్చకుండా తప్పుదారిన వెళ్తున్న అధికార పార్టీ చెంపలు వాయించి దారిలో పెట్టడానికి పార్లమెంట్ ఎన్నికలు మాత్రం వేదిక కారాదా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన దుబ్బాక తదితర ఉప ఎన్నికల్లో ఏ ప్రాసంగికత ఉందని అధికార పార్టీని ఓడించాలని రాతలు రాశారు. ఓటమిలో పాఠాలుంటాయి. గెలుపులో గుణపాఠాలుంటాయని హరికథలు చెప్పారు?
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రాసంగికత, ప్రచారానికి ప్రాతిపదిక ఏమిటంటే కిషన్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన రెండు ప్రకటనలు. ఏమిటట? లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటర్లు ఎందుకు ఓటు వేస్తారు? ఎందుకు వేయాలి? బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో లేదు. మరి గెలిచి ఏం చేయగలుగుతుంది? అసలు ఏ నినాదంతో పోటీ చేస్తుంది? అన్నది ఆ ప్రకటనకర్తల ప్రశ్న. అధికారంలో ఉన్నాయి కాబట్టి బీజేపీ లేదా కాంగ్రెస్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాయి. మధ్యలో బీఆర్ఎస్ ఏం చేయగలుగుతుంది? అనేది వారి ప్రశ్న. చాలా చిత్రమైన ప్రశ్న. విపరీతమైన ప్రశ్న కూడా!
ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిందెవరు? రాష్ర్టాన్ని దేశంలో తలెత్తుకునేలా నిలబెట్టిందెవరు? రేపు ఈ రాష్ర్టానికి ఏదైనా జరగరానిది జరిగితే వీధుల్లోకి వచ్చేదెవరు? బీఆర్ఎస్ను మించి ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్కటైనా నిలబడుతాయా? కలబడుతాయా? అందరికీ తెలుసు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి ఉన్న ప్రాసంగికత అదే. బిడ్డకు తల్లికి ఉన్న పేగుబంధమే ఆ ప్రాసంగికత.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమిళనాట పాగా వేసేందుకు గోదావరి-కావేరీ జలాల అనుసంధానం అంటూ ఓ దుర్మార్గమైన ఎత్తుగడ తీసుకుంటున్నది. నిజమే.. దేశంలో ఉన్న అనేక జీవనదులను అనుసంధానించి పంటపొలాలకు మళ్లించాల్సిన అవసరం ఉన్నది. అయితే దాన్ని గంగా, యమున, బ్రహ్మపుత్ర వంటి భారీ జీవనదులతో ప్రారంభించాలి. వాటిలో సింహభాగం జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ముందు వాటిని వాడుకోవాలి. అదనపు నీళ్లను దక్షిణాదికి కూడా మళ్లించాలి. దాన్ని పక్కనబెట్టి నోరులేని దక్షిణాది రాష్ర్టాల మీద పడి.. అంతంతమాత్రం నీటి లభ్యత.. దానికితోడు అనేక జల వివాదాలున్న గోదావరి-కావేరీ నదుల మీద పడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నీళ్లు రావాల్సిన ప్రాంతాలున్నాయి. స్థిరపరుచుకోవాల్సిన ఆయకట్టు ఉన్నది. ఈ నేపథ్యంలో కేంద్రం దౌర్జన్యంగా నదుల నీళ్లను మళ్లించకుండా పోరాడాల్సి ఉన్నది. ఈ పోరాటం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్ల కాదు. బీజేపీ ఎలాగూ కేంద్రంలోనే ఉంది కాబట్టి ఆ పార్టీ వాళ్లు నోరు మెదపరు. ఇక కాంగ్రెస్.. గతంలో ఆ పార్టీ ఏడు మండలాలు ఏపీకి అప్పగించినప్పుడు ఎంత గొప్ప పోరాటాలు చేసిందో.. హైకోర్టు కోసం ఏం చేసిందో చూశాం. ఆ పార్టీల వల్ల తెలంగాణ ప్రయోజనాలు నేరవేరవు. తెలంగాణ కోసం భూమిని, ఆకాశాన్ని ఏకం చేసిన బీఆర్ఎస్కు, ఆ పార్టీ అధినేత కేసీఆర్కు మాత్రమే ఆ శక్తి ఉంది. అందుకే ఈ కీలక సమయంలో లోక్సభలో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాల్సిన ప్రాసంగికత ఎంతైనా ఉన్నది.
మరోవైపు దేశంలో మతతత్వ రాజకీయాలను సమర్థంగా ఎదుర్కోగల లౌకిక శక్తుల అవసరం ఉన్నది.
లౌకిక విధానం గురించి కాంగ్రెస్ మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. ఓట్ల కోసం బాబ్రీ తాళాలు తీయించిన ఘనత కాంగ్రెస్ది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బాబ్రీ కూలింది. కశ్మీర్ను కెలికికెలికి బ్రహ్మరాక్షసిని చేసిందీ.. ఖలిస్థాన్ ఉద్యమానికి బీజం వేసిందీ కాంగ్రెస్సే. దేశమంతా మతతత్వ శక్తులు విచ్చలవిడిగా స్వైరవిహారం చేయడం ఆ పార్టీ పాలన ఫలితమే. ఇక బీజేపీ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. పెద్దసంఖ్యలో మైనారిటీ జనాభా ఉన్న తెలంగాణ లౌకికతను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్లమెంటులో ఉండాల్సిన ప్రాసంగికత ఉంది.
ఇక ఆర్థికరంగానికి వస్తే ప్రభుత్వరంగ సంస్థలను విచ్చలవిడిగా బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తుంటే దానిమీద కాంగ్రెస్ ఒక నిర్మాణాత్మక ఉద్యమాన్ని నిర్మించడంలో విఫలమైంది. దేశ రాజకీయ చరిత్రలో రాహుల్ వంటి విఫల ప్రతిపక్ష నాయకుడు మరొకరు లేరు. ఈ నేపథ్యంలో లక్షల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల పరిరక్షణ కోసం తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థలను నిలబెట్టి చూపిన కేసీఆర్ వంటి నాయకులు పార్లమెంటులో ఉండాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో గొంతెత్తాల్సిన ప్రాసంగికత ఉంది.
ఇవన్నీ వదిలేసి బీఆర్ఎస్ మీద పడటం వెనుక మతలబు ఉన్నది. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయినా బలమైన ప్రతిపక్షంగా ఉన్నది. జరిగిన ఒకే ఒక్క అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ విశ్వరూపం ప్రదర్శించింది. దానికితోడు పెద్దగా వ్యవధి లేకుండా కొద్దిరోజుల్లోనే పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఒక రాజకీయపార్టీగా బీఆర్ఎస్ తన పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేసుకునే క్రమంలో ప్రభుత్వం మీద దాడులు ముమ్మరం చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ కన్నా ఆ పార్టీని మోసే బోయీలకు మింగుడుపడటం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకునే స్థితిలో లేదు. ‘దేవుడా! పార్లమెంటు ఎన్నికల కోడ్ను త్వరగా ప్రకటించేలా చూడు’ అని ప్రభుత్వంలోని పెద్దలంతా వేడుకుంటున్న పరిస్థితి.
వాగ్దానాల అమలు జరగలేదు కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రజల ఆగ్రహం చవిచూడవచ్చనే భయం వెంటాడుతున్నది. అందుకే ఆలోగా ఓటర్ల దష్టిలో బీఆర్ఎస్కు ఓటేస్తే లాభం లేదనే ప్రచారాలు. ‘గెలిపించినా వీళ్ల చేతిలో ఏదీ లేదు కదా?’ అనే భావనను బలంగా ప్రజల్లో నాటడం. బీజేపీ ఎలాగూ పెద్దపోటీ కాదు కాబట్టి బీఆర్ఎస్ను పక్కకు తప్పిస్తే గండం గడుస్తుందనే వ్యూహం. బీఆర్ఎస్ను బలహీన పరచడం, బీఆర్ఎస్ ఓటర్లను దారి మరల్చడం. తద్వారా కాంగ్రెస్ పార్టీకి దారి క్లియర్ చేయడం అనే స్క్రిప్టు ఇప్పుడే ప్రారంభమైంది. మళ్లీ ఇందులో పతివ్రత కథలు. సినిమా అంతా రేపులు చూపించి ఆఖరున రేపులు చేయడం తప్పు, పాపం అంటూ సందేశం ఇచ్చినట్టు.. వేయాల్సిన రాళ్లన్నీ వేసి ఆఖర్లో బీఆర్ఎస్ ఇలా ఉండాలి. అలా ఉండాలి.. ఆ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది అని నీతి సూత్రాలు వల్లించినంత మాత్రాన ఆ ప్రచారాల లక్ష్యం ఏమిటో గమనించలేనంత వెర్రివాళ్లా ప్రజలు?
– ఎస్జీవీ శ్రీనివాసరావు