రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ ఈ నెల 25న హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన విమర్శల వెనుక ఇక్కడి వామపక్షాల ప్రమేయం ఉందన్నది బహిరంగ రహస్యమే. వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం ఒకపక్షపు మాటలు విని ఆ విధమైన వ్యాఖ్యలు చేయటంలో టికాయత్ తొందరపాటును అట్లుంచి, ఇందుకు కారణమైన కమ్యూనిస్టులది అసలు దుర్మార్గమన్నది గుర్తించాలి. పైగా ఆ విమర్శలలో అవాస్తవాలు అనేకం ఉన్నాయని విషయాలు తెలిసినవారు ఎవరైనా చెప్పగలరు. ముందుగా ఆ వాస్తవాలు ఏమిటో చూసి ఆ తర్వాత వామపక్షాల గురించి చెప్పుకొందాము.
కేంద్రప్రభుత్వ వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించలేదన్నది ఒక విమర్శ. ఇది మొట్టమొదటి పెద్ద అసత్యం. పార్లమెంట్ ఉభయ సభలలోనూ ఆ పార్టీ సభ్యులు బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడటమేగాక వ్యతిరేకంగా ఓటు కూడా వేశారు. ఇది ఆయారోజులలో మీడియాలో వెలువడిన విషయం. పార్లమెంటు రికార్డులలోనూ తనిఖీ చేసుకోవచ్చు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో రైతులకు, వ్యవసాయరంగానికి ఏమీ చేయలేదనటం, చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదనటం, ధాన్యం కొనటం లేదనటం వంటివి ఇతర పెద్ద అబద్ధాలు.
రైతుల కోసం, వ్యవసాయం కోసం తెలంగాణ ప్రభుత్వం చేసినంతగా మొత్తం దేశంలోనే మరెవరూ చేయటం లేదని చెప్పటానికి వరుసబెట్టి అనేక అంశాలను పేర్కొనవచ్చు. రైతుబంధు పథకం వంటిది దేశంలో మరెక్కడైనా ఉందా? ఒక్క గుంట భూమి ఉన్న రైతు మరణించినా, ఏ కారణం వల్ల చనిపోయినా, రూ.ఐదు లక్షలు సహాయం చేసే రైతుబీమా వంటి పథకం మరే రాష్ట్రంలోనైనా ఉందా? ధాన్యం మొత్తం ప్రభుత్వమే ఖరీదు చేయటం ఇంకే రాష్ట్రంలోనైనా జరుగుతున్నదా? వ్యవసాయానికి కీలకమైన నీటి లభ్యత, విద్యుత్తు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ విస్తరణాధికారుల సేవలు మొదలైన వాటిలో ప్రతి ఒక్కదానికి సంబంధించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఏ విధంగా ఉండేదో, తర్వాత కేసీఆర్ పాలనలో ఏ విధంగా మారిందో తెలంగాణ రైతులకు బాగా తెలుసు. రైతులు భరోసాగా వ్యవసాయం చేస్తూ రికార్డుస్థాయి పంటలతో తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చింది ఈ చర్యల ఫలితం వల్ల కాదా? అప్పుల ఊబిలో కూరుకుపోయే రైతులు నేడు రైతుబంధు వల్ల ఆ సంక్షోభం నుండి బయటపడటం లేదా? రైతుల రుణమాఫీ కింద ఈ ఏడేండ్లలో వేల కోట్ల రూపాయల భారం రద్దు కాలేదా? జలవనరుల అభివృద్ధితో రాష్ట్రంలోని అధిక ప్రాంతాలు పంటలతో పచ్చబడలేదా? మహబూబ్నగర్ వంటి అత్యంత వెనుకబడిన జిల్లా నుంచి సైతం పంట ఉత్పత్తులు ఎగుమతి కావటం మొదలవలేదా? యావత్ తెలంగాణ నుంచే పేద రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు పోవటం ఆగి, గతంలో వెళ్లినవారు తిరిగి రావటమే గాక, ఇతర ప్రాంతాల వారు ఇక్కడకు వలస వస్తుండటం నిజం కాదా? రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గలేదా? ఇట్లా రాసేందుకు ఇంకెన్నయినా ఉన్నాయి.
రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి, రైతు సంఘం అందజేసే జాబితా ప్రకారం, రూ.మూడేసి లక్షల సహాయం ఇస్తామని కేసీఆర్ ప్రకటించినపుడు టికాయత్తోపాటు రైతు ఉద్యమ నేతలంతా హర్షం వెలిబుచ్చారు. అటువంటిది టికాయత్
హైదరాబాద్ వచ్చేసరికి ఏం జరిగినట్లు? ఆయన చుట్టూ చేరిన వామపక్ష వీరులు, ఎన్జీవో శూరులు అదే టికాయత్ చేత కేసీఆర్పైన రాళ్లు వేయించారు. అది చూసినవారికి దిగ్భ్రమ కలిగింది. కేంద్రంతోసహా మరెవరూ చేయనివిధంగా, మొట్టమొదలుగా ఆర్థిక సహాయం ప్రకటించిన వ్యక్తిపై విషపూరితమైన వ్యాఖ్యలు చేయటం మన చెవులను మనమే నమ్మలేని విధంగా చేసింది.
ఇందులో ఏ ఒక్కటి కూడా కల్పితం కాదు. అన్నీ స్పష్టంగా మన కళ్లెదుట కనిపిస్తున్న నిజాలు. అందువల్లనే ఈ అద్భుతాలను దేశమంతా గుర్తించి ప్రశంసిస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కొనియాడుతున్నాయి. ఇంత స్వల్పకాలంలో ఇంతటి ఘనతను సాధించారని, అది వ్యవసాయంతోసహా అన్నిరంగాల్లో కనిపిస్తున్నదని తాజాగా రిజర్వ్బ్యాంక్ హ్యాండ్బుక్ గణాంకాలతో వివరించి చెప్పలేదా?
ఈ వివరాలన్నీ టికాయత్కు తెలిసే అవకాశం లేదు. కానీ హైదరాబాద్ సభలో ఆయన చుట్టూ చేరిన వామపక్ష వీరులకు, ఎన్జీవో శూరులకు తెలియకపోవటమనే అవకాశమే లేదు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి, రైతు సంఘం అందజేసే జాబితా ప్రకారం, రూ.మూడేసి లక్షల సహాయం ఇస్తామని కేసీఆర్ ప్రకటించినపుడు టికాయత్తోపాటు రైతు ఉద్యమ నేతలంతా హర్షం వెలిబుచ్చారు. కేంద్రంతోసహా అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని రైతు కుటుంబాలకు సహాయం చేయాలన్నారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రకటనే మొట్టమొదటిది అయినందున, దేశవ్యాప్తంగా ఇతర రంగాలకు చెందినవారు కూడా ప్రశంసించారు.
అటువంటిది టికాయత్ హైదరాబాద్ వచ్చేసరికి ఏం జరిగినట్లు? పైన అనుకున్నట్లు, ఆయన చుట్టూ చేరిన వామపక్ష వీరులు, ఎన్జీవో శూరులు అదే టికాయత్ చేత కేసీఆర్పైన రాళ్లు వేయించారు. అది చూసినవారికి దిగ్భ్రమ కలిగింది. కేంద్రంతోసహా మరెవరూ చేయనివిధంగా, మొట్టమొదలుగా ఆర్థిక సహాయం ప్రకటించిన వ్యక్తిపై విషపూరితమైన వ్యాఖ్యలు చేయటం మన చెవులను మనమే నమ్మలేని విధంగా చేసింది.
వామపక్ష వీరులు రాష్ట్రంలోనేగాక మొత్తం దేశ రాజకీయాలలోనే అసమర్థులుగా తేలటం, తమ చేతకానితనం వల్ల తమపై తమకే కలుగుతున్న తీవ్ర నిస్సహాయ భావన, కుంగుబాటుతో దుర్జనులుగా మారటం కొంతకాలంగా కన్పిస్తున్నదే. తాము 34 ఏండ్ల పాటు పాలించిన పశ్చిమబెంగాల్లో రైతులను ఉద్ధరించింది ఏమిటో సింగూర్, నందిగ్రామ్ ఉదంతాలతో తేలిపోయింది. కౌలుదార్లకు భూమి పంపిణీ చేస్తామని మాట ఇచ్చి, పెద్ద రైతుల భయంతో ఆ పని మానివేసి, ఆ పెద్ద రైతుల మద్దతు కోసం పాకులాడటంతోనే స్పష్టమైంది. 1977లో అధికారానికి వచ్చిన మొదటి రెండేండ్లలోనే మారీచ్ ఝాపీ దీవిలో బంగ్లాదేశ్ వలస రైతులు, పేదలపై సాగించిన మారణకాండతో రైతాంగంపై వారి ‘ప్రేమ’ ప్రపంచం ముందు బట్టబయలైంది.
ఇటువంటి చరిత్ర గల వామపక్షవీరులు, ఈ రోజున అదే బెంగాల్లోని 294 అసెంబ్లీ సీట్లలో ఒక్కటంటే ఒక్కటైనా గెలువలేక, తెలంగాణ రైతాంగం కోసం ఇంతింత చేస్తున్న కేసీఆర్పైన తమ అసమర్థ దుర్జనత్వపు దిక్కుమాలిన ధోరణితో రాళ్లు రువ్విస్తున్నారు. ఇక్కడ సైతం తమకు సీట్లు కాదు కదా డిపాజిట్లు కూడా రాని దుస్థితికి పతనమైనవారు, అబద్ధాలు మాట్లాడి, బయటివారిలో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆ విధంగానైనా రైతురాజ్యం తేకపోతామా అని కొత్త ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’ రచిస్తున్నట్లున్నారు.
–టి.రాజశేఖర్