Stock Market : భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 633.29 పాయింట్లు (0.83 శాతం) ఎగబాకి, 76,704.13 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా లాభాలబాట పట్టింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 196.65 పాయింట్లు (0.83 శాతం) ఎగబాకి 23,777.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా మూడోరోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో నడవడం విశేషం.
మూడు ట్రేడింగ్ సెషన్లలో కలిపి సెన్సెక్స్ 2,100 పాయింట్లు ఎగిసింది. బుధవారం ఉదయం ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,632.90 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ 0.82 శాతం పెరిగి, 55,326.0 పాయింట్ల వద్ద నిలిచింది. ఈ రోజు ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్లు పెరిగింది. ఉదయం ట్రేడింగ్ లాభాల్లోనే ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 77 వేల పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 76,704 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకవైపు మిడిల్ ఈస్ట్ సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ వరుసగా మూడు రోజులు భారత స్టాక్ మార్కెట్లు లాభాలు చూడటం విశేషం.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా అందుబాటులోకి రావడం వంటివి మార్కెట్ సానుకూలతకు కారణాలు. గత వారం పూర్తి నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభం నుంచి లాభాలు పొందడం విశేషం. మరోవైపు భారతీయ కరెన్సీ రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. ఆల్టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. డాలర్తో రూపాయి మారక విలువ నేడు 92.65కు చేరింది. తొలిసారి 92.50 దాటింది. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 102 డాలర్లుగా కొనసాగుతోంది.