న్యాయస్థానం ఆదేశాలను అమలు పరచాల్సిన కార్యనిర్వాహక వ్యవస్థే నిర్లక్ష్యం వహించడం దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టుల ఆదేశాలను కార్యనిర్వాహక వ్యవస్థ అగౌరవపరిచే పోకడ పెరుగుతున్నదని, మరోవైపు జడ్జిలను జడ్జిలే నియమించుకుంటారంటూ కొన్ని శక్తులు కావాలనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. తీర్పులు తమకు అనుకూలంగా రానప్పుడు కక్షిదారులు న్యాయాధికారులపై భౌతికదాడులకు, దుష్ప్రచారానికి పాల్పడుతున్నా అధికారులు చొరవతో చర్యలు తీసుకోవడం లేదంటూ సీజేఐ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపదగినవి. దేశంలో ఓ ప్రణాళిక ప్రకారం అప్రజాస్వామిక వాతావరణం ఎలా నెలకొంటున్నదో ఇది సూచిస్తున్నది.
ప్రజాస్వామ్య భారతానికి మూలస్తంభాల వంటి శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు పరస్పరం సహకరించుకుంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఎమర్జెన్సీ వంటి చీకటి దశను మినహాయిస్తే, స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఈ మూడు వ్యవస్థలు దాదాపుగా తమవైన పరిధులను దాటకుండానే పనిచేస్తూ వచ్చాయి. దానివల్లే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ గౌరవాన్ని అందుకుంటున్నది. అయితే, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు మౌలిక వ్యవస్థల పొందికలో మార్పులు కనిపిస్తున్నాయి. న్యాయవ్యవస్థ పలు ఒత్తిళ్లను తట్టుకొని నిలువవలసి వస్తున్నది. ప్రధాన న్యాయమూర్తి ఆవేదనను ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలి.
మోదీ సర్కార్ హయాంలో దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. పార్లమెంటులో అర్థవంతమైన చర్చలకు స్థానం లేకుండాపోయింది. ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉంది కనుక బిల్లులను ఏకపక్షంగా ఆమోదించుకోవడం సాగుతున్నది. బీజేపీ కూడా మోదీ కేంద్రంగానే నడుస్తున్నది. కేంద్ర మంత్రివర్గం నామమాత్రమై, కార్యనిర్వాహక వ్యవస్థ మొత్తం మోదీ కనుసన్నల్లో వ్యవహరిస్తున్నది. దీనివల్ల ఆయా వ్యవస్థలలో నిష్క్రియాపరత్వం ఆవరించింది. ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర సంస్థ పనితీరుపైనా సందేహాలు వెలువడుతున్నాయి. ఈ మొత్తం అప్రజాస్వామిక పోకడలో భాగంగానే న్యాయవ్యవస్థ ఒత్తిళ్లకు గురికావడాన్ని అవగాహన చేసుకోవాలి. దేశ ప్రజాస్వామ్యం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నదని ఈ పరిణామాలు తెలుపుతున్నాయి. ప్రజాస్వామ్య దేశాల జాబితాలో భారత్ ర్యాంకు పాతాళానికి పడిపోవడం కూడా గమనార్హం. ఈ పరిస్థితి మరింత దిగజారకుండా ప్రజాస్వామ్య అనుకూల శక్తులన్నీ ఉమ్మడి కార్యాచరణకు దిగటం తక్షణావసరం. ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఇందు కు హెచ్చరికగా భావించాలి.