‘ప్రతి పౌరుడు తాను ప్రభుత్వంలో భాగం అనుకునే పాలనే ధర్మబద్ధమైన పరిపాలన’ అని థామస్ జెఫర్సన్ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను మార్మోగేలా రాష్ట్ర ప్రజలు జరుపుకొంటున్నారు.
సుపరిపాలన అంటే నైతికతతో కూడిన, పారదర్శకంగా ఉండే, సులభతర నియమ, నిబంధనలు, పద్ధతులు, జవాబుదారీతనం, బాధ్యతతో కూడుకొన్న ఆదర్శ పాలన. మంచి పాలన అంటే సామాన్యులు, పేద ప్రజల పట్ల సహ అనుభూతితో కూడిన ఉత్తమ విలువలతో కూడిన పరిపాలన.
నిర్ణయ ప్రక్రియ, వాటి అమలు, సమీక్షలలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం. అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకుపోయి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయడం. తద్వారా వారికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్నది. ప్రజలకు నాణ్యతతో కూడిన అనేక సేవలను అందించే లక్ష్యంతో సమాచార, సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకొన్న సేవలను ప్రభుత్వం అందిస్తున్నది. అత్యుత్తమ పరిపాలన అందించడం కోసం ప్రభుత్వం అనేక పాలనా సంస్కరణలు ప్రవేశ పెట్టింది.
తెలంగాణ రాష్ట్రంలోని ముప్పైమూడు జిల్లాలలో వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్య, రవాణా, పారిశ్రామిక, పట్టణ , పల్లె , పాడి పరిశ్రమ మొదలగు అన్ని పాలనా రంగాలలో ఉత్తమ పరిపాలన దిశగా మార్పు తో కూడిన సంస్కరణలను ప్రభుత్వం తీసుకువచ్చింది. కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతమైన పాలనలో నూతన ఒరవడి దిద్దింది.
ధరణి వెబ్ పోర్టల్ ద్వారా భూలావాదేవీలన్నీ చిటికెలో పూర్తవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర భవన అనుమతులు, స్వయం ధృవీకరణ కోసం టీఎస్ బీపాస్, సులభంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన పాలనా పరమైన అనుమతుల కోసం ఐపాస్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కోసం తెలంగాణ నైపుణ్య, విజ్ఞానాభివృద్ధి అకాడమీ (టాస్క్)ఏర్పాటు చేశారు. సరికొత్త ఆవిష్కరణల కోసం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఏర్పాటు చేయబడింది. పౌర సేవలన్నీ ఆన్లైన్లోనే కొనసాగే పద్ధతులను ప్రవేశపెట్టింది.
తెలంగాణ రాష్ర్టాన్ని పాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలుగా విభజించి ప్రతి జిల్లా కేంద్రంలో ఆధునిక సౌకర్యాలతో జిల్లా పాలనాధికారుల కార్యాలయాలు నిర్మించడం వల్ల ప్రజలకు పారదర్శక పాలనా ఫలాలు అందుబాటులోకి వచ్చాయి. పరిపాలన వేగవంతం చేయడానికి ఈ-గవర్నెన్స్ ఉపయోగపడింది. ప్రజలకు అవసరమైన పనుల కోసం రోజులతరబడి కార్యాలయాలు చుట్టూ తిరగడం, గంటల తరబడి క్యూలు కట్టే అవసరం లేకుండా ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిం ది. ఈ విధానంతో తక్కువ సమయంలో పనులు పూర్తవుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎర్రా నాగేంద్ర బాబు: 98490 85520 (వ్యాసకర్త : రిటైర్డ్ జాయింట్ కలెక్టర్)