ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ, రాజ్యాంగబద్ధమైన అంశాలను లేవనెత్తుతున్న విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలపై కేంద్రప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ప్రయోగించటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ మేరకు 500 మందికిపైగా పౌరులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు, విద్యార్థులు ఒక బహిరంగలేఖ రాసి మే 23న విడుదల చేశారు. ఆ లేఖ పూర్తి పాఠం..
‘విచారణ పేరుతో ఢిల్లీలో అనేకమంది మహిళా కార్యకర్తలను, మేధావులను ఈడీ నిరంతరం వేధించటాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. పీఎంఎల్ఏ కింద సంక్రమించిన విపరీత అధికారాలను ఈడీ ఈ విధంగా దుర్వినియోగపరుస్తున్నది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న వారిపై, పేదలు, అణచివేతకు గురైన వర్గాల తరఫున గొంతెత్తున్న వారిపై యూఏపీఏ లాగానే పీఎంఎల్ఏను అడ్డగోలుగా ఉపయోగించిన ఉదంతాలు పెరుగుతున్నాయి. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా కూడా ఈడీని ఉపయోగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా పలువురు మహి ళా స్కాలర్లు, కార్యకర్తలకు తరచూ సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరైన సందర్భంలో వారిని గంటలకు గంటలు వేచి ఉం డేలా చేస్తున్నారు. మహిళా అధికారులు లేకుండానే ప్రశ్నిస్తున్నా రు. పదే పదే పత్రాలు సమర్పించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ విచారణ అంతమనేదే లేకుండా కొనసాగుతున్నది. విచారణతో ఏ విధంగానూ సంబంధం లేని సమాచారాన్ని డిమాండ్ చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు ఇవ్వాలని అడుగుతున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం కావాలంటున్నారు.
ఈ రకమైన వేధింపులను ఎదుర్కొంటున్న మహిళల పేర్లను ఇక్కడ మేం ప్రస్తావించలేం. ఎందుకంటే, వారిపై వేధింపులు మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. వీరంతా దేశానికి ఎంతో అవసరమైన అంశాలపైన పని చేస్తున్నవాళ్లు. ఆహార భద్రత, బాధ్యతాయుతమైన జవాబుదారీ ప్రభుత్వం, ప్రజల మధ్య సౌహార్ద పూర్వక సంబంధాలు నెలకొల్పటం, పౌరులకు వారి హక్కుల పట్ల చైతన్యం కలిగించటం, రైతుల హక్కులు, మహిళల హక్కు ల వంటి ఎన్నో అంశాలపై వీరు సుదీర్ఘకాలంగా కృషిచేస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే, ఆప్, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే.. ప్రభుత్వం ఏదైనా కావొచ్చు.. ప్రజల పట్ల తన బాధ్యతను నెరవేర్చేవిధంగా ఆయా ప్రభుత్వాలపై వీరు ఒత్తిడి తెస్తుంటారు. వీరిని ఈడీ లక్ష్యంగా చేసుకోవటం అంటే, వీరు చేస్తున్న కృషిని అడ్డుకోవటం కోసమేనని స్పష్టమవుతున్నది. ఉదాహరణకు, తప్పుడు ఆర్థిక విధానాల కారణంగా నెలకొన్న వ్యవసాయ సంక్షోభం ప్రజలను ఎలా కడగండ్ల పాలు చేస్తుందో వీరు తెలియజేస్తున్నారు. వీరు ఆ పని చేయకుండా ఈడీ అడ్డుకుంటున్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం సమాచారహక్కు ద్వారా వీరు చేసే కృషిని ఆపుతున్నది. నిరుపేదలకు రేషన్లు, పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా? అన్నదానిపై ఆడిటింగ్, బహిరంగ విచారణలు జరుపుతున్న వారిని ఈడీ నిరోధిస్తున్నది. ఈ కార్యకర్తలు పేదరికం, అసమానతలు, భూ హక్కులపై ఎంతో ముఖ్యమైన పరిశోధనలు జరిపారు. ప్రతిష్ఠాత్మక జర్నల్స్లో అవి ప్రచురితమయ్యాయి. తద్వారా ఆయా అంశాలు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో వెలుగులోకి వచ్చాయి. అధికారంలో ఉన్న వారికి ఇదే కంటగింపుగా మారి, ప్రతీకార చర్యలకు దిగారు.
మనీ లాండరింగ్, మరీ ముఖ్యంగా మాదక ద్రవ్యాల, ఆయుధాల అక్రమ రవాణాను, వ్యవస్థీకృత నేరాల్ని నిరోధించే లక్ష్యంతో పీఎంఎల్ఏను రూపొందించారు. భారత్కున్న అంతర్జాతీయ ఒడంబడికల్లో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, దానిని ప్రస్తుతం ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మేధావులకు వ్యతిరేకంగా ఉపయోగిస్తుండటం దిగ్భ్రాంతికరం.
ఆ చట్టం అసలు లక్ష్యాన్ని పూర్తిగా పక్కదారి పట్టించడమే ఇది. సహజ న్యాయం, నిష్పాక్షిక విచారణ, మహిళల పట్ల అనుసరించాల్సిన పద్ధతులు, మానవహక్కుల వంటి వాటిని వేటినీ పట్టించుకోకుండా, ప్రభుత్వానికి ఈ చట్టం విపరీత అధికారాలనిస్తున్నది. పోలీసు అధికారాలను కలిగి ఉన్న ఏ దర్యాప్తు సంస్థ అయినా సీఆర్పీసీని అనుసరించాల్సి ఉంటుంది. కానీ, సీఆర్పీసీతోపాటు ఏ ఇతర చట్టాన్నీ పాటించే అవసరం లేని అధికారాలను పీఎంఎల్ఏ కల్పిస్తున్నది.
ఈడీకి ఎంతటి విపరీత అధికారాలున్నాయంటే, దర్యాప్తు ప్రారంభించక ముందు ఎఫ్ఐఆర్ను నమోదు చేయాల్సిన పని లేదు. సమన్లు జారీచేసే సమయంలోగానీ, విచారణ సందర్భంలోగానీ ఎందుకు పిలిచామో, ప్రశ్నిస్తున్నామో సదరు వ్యక్తులకు చెప్పాల్సిన పని లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ లేదా అంతకన్నా పెద్ద హోదాలో ఉన్న ఈడీ అధికారి ఎవరైనా ఏ వ్యక్తినైనా (నిందితుడైనా కాకపోయినా) విచారణకు పిలువవచ్చు. తనిఖీ చేయవచ్చు. వాంగ్మూలం రికార్డు చేయవచ్చు. పత్రాలు ఇమ్మని ఆదేశించవచ్చు. ఈ లెక్కన ఈడీకి సివిల్ కోర్టుకన్నా ఎక్కువ అధికారాలున్నాయి. కానీ, సివిల్ కోర్టులో నిందితుడికి లేదా సాక్షికి లభించే రక్షణలు ఇక్కడ లభించవు. అంతేకాదు, తమ విచారణలో నిందితుడు లేదా సాక్షి చెప్పిన అంశాలను వారికే వ్యతిరేకంగా కోర్టులో సమర్పించే అధికారం ఈడీకి ఉన్నది. ఈ అధికారం పోలీసులకు కూడా లేదు. రికార్డులను, వాంగ్మూలాలను ఇవ్వమని ఒత్తిడి చేసే అధికారం ఈడీకి ఉంది. ఎందుకంటే, నిశ్శబ్దంగా ఉంటే నేరం చేసినట్టే లెక్క. ఆరోపణలను నిరూపించే బాధ్యత ఈడీ తీసుకోదు. తమపై నమోదైన ఆరోపణలు తప్పని నిరూపించుకునే భారం నిందితులదే. అప్పటి వరకూ వారు నేరస్థుల కిందే లెక్క. అందుకే బెయిల్ కూడా రాదు. ఇంతటి దారుణమైన నిబంధనలున్న పీఎంఎల్ఏ, వ్యక్తిగత స్వేచ్ఛ ను, చట్టాలను, రాజ్యాంగబద్ధమైన పద్ధతులను ఉల్లంఘించే అధికారాలను పభుత్వ సంస్థలకు ఇస్తున్నది. ఆ నిబంధనలను మేం వ్యతిరేకిస్తున్నాం.
పీఎంఎల్ఏ దుర్వినియోగాన్ని, దాని పేరిట జరుగుతున్న వేటను ఖండిస్తున్నాం. తక్షణం దీన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం.