ఉమ్మడి మెదక్ జిల్లాలోని రామాయంపేటలో క్రీ.శ.1311లో ఒక శాసనం ఉన్నది. ఈ శాసనం వేయించింది రుద్రయరెడ్డి. శాసనకాలం శ.సం.1233 = క్రీ.శ.1311, విరోధికృత్ సంవత్సరం, పుష్యశుద్ధ పౌర్ణమి.
రుద్రయరెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రులకు పుణ్యంగా గొడలిపఱతి రామనాథ దేవునికి భోగానికి, దేవుని నిత్యపూజలకు కొన్ని పన్నులను తగ్గిస్తూ, వృత్తులను సమర్పించాడు. రామానుజ చెరువు కింద ఉన్న కొంత భూమి, గొడలిపఱతి, మాధవోరము గ్రామాల్లో ఉండే మామిడితోటల్లోని సిద్ధాయం సమర్పించబడింది. ఈ సిద్ధాయం ప్రతి మాడకు పాతిక వంతున, ప్రతి మర్తురుకు ఒక చిన్నం చొప్పున సమర్పించబడింది. అదేవిధంగా ఈ రెండు గ్రామాల్లో ఉండే ప్రతి కోమటి ఇంటిలో వాడే ప్రతి వస్తువు మీద చిన్నం, దేవరుల (పూజారులేమో) ఇంట చిన్నం, ఈ నాలుగు ఊర్లలో ప్రతి వ్యక్తి పండించే ప్రతి పంట మీద ఒక అడ్డుగ సమర్పించబడింది.
పైన పేర్కొనబడినవారు కాకుండా మిగతా ప్రజలు మాడకు పాతిక చొప్పున భోగరాజు చెరువు వెనుక మ్రోతుంగు మర్తురు, భోగరాజు చెరువు సమీపంలో ఉన్న గోడలిపఱతి, మ్రోంటుగుమడుగు గ్రామాల్లోని ప్రతి కరణం ఒక మాడ, తిర్పరి మాడ, తాడిగండ కరణాలు, మాధవోరు, ఇతర గ్రామాలకు చెందిన దండకరణాలు, ఆ గ్రామాల్లో ఉండే భోగంవారు ప్రతి ఒక్కరు ఐదేసి సమర్పించవలెను.
ఈ నాలుగు ఊర్లలోని అష్టాదశ ప్రజలు ఈ ధర్మాన్ని పాటించేవిధంగా బాధ్యత వహించాలి. ఈ వ్రిత్తికి ఎవ్వరు ఏమి హాని తలపెట్టకుండా చూడాలి. ఒకవేళ ఈ ధర్మాన్ని పాటించకపోతే వారి పితరులు నరకానికి పోతారు. ఏ ఏలిక అయినా, ఏ కరణమైనా, ఎవరైనా సరే ఈ ధర్మాన్ని మానిపిస్తే వారు, వారి పితరులు కుంభీపాకాన పడుతారు. ఈ ధర్మాన్ని ప్రతిపాలించినవారికి ధర్మజయము కలుగుతుందని శాపోక్తులు, శాపాశీస్సులు చెప్పబడినవి.
శాసనం వేయించిన వ్యక్తి బహుశా ఆ ప్రాం తాధికారి లేదా పాలకుడై ఉండవచ్చు. కాబట్టే అన్నిరకాల ప్రజల నుంచి పన్నులు సేకరించి అవి స్వామివారి నిత్య కైంకర్యములకు సమర్పించాడు. అంతేకాక తెలంగాణ నుంచి వెలువడిన శాసనాల్లో శిక్షలకు సంబంధించి గరుడ పురాణంలో చెప్పబడిన కుంభీపాకం అనే శిక్ష ఈ శాసనంలో మనం గమనించవచ్చు.
– భిన్నూరి మనోహరి